
ఎన్టీఆర్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తూ నటించిన మూవీ `వార్ 2`. ఇందులో హృతిక్ రోషన్ మరో హీరో. కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. యష్ రాజ్ ఫిల్మ్స్ సుమారు రూ.400కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ యష్ రాజ్ స్పై యాక్షన్ మూవీస్ సిరీస్లో భాగంగా వస్తోంది. స్పై యాక్షన్ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కించారు. గత చిత్రాలను మించిన యాక్షన్ ఇందులో ఉండబోతుందని టీజర్, ట్రైలర్స్ చూస్తుంటే అర్థమవుతుంది. వీరోచితమైన యాక్షన్ సీన్లు సినిమాకి హైలైట్గా నిలవబోతున్నాయని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే `వార్ 2`లో తెలిసిన నటులు చాలా మందే ఉన్నా, మెయిన్ స్టార్ కాస్టింగ్ మాత్రం తక్కువే. ఇందులో ఎన్టీఆర్, హృతిక్, కియారా మెయిన్ కాస్టింగ్గా చెప్పొచ్చు. సినిమాలో హీరో, విలన్ హృతిక్, తారకే కావడంతో మిగిలిన ఆర్టిస్ట్ లకు పెద్దగా ప్రయారిటీ ఉండదు. వీరి చుట్టూనే అసలు కథ తిరుగుతుంది. ఇదే విషయం టీజర్, ట్రైలర్లు చూసినప్పుడు మనకు అర్థమయ్యింది. అందులో తారక్, హృతిక్ ల మధ్య వార్ లా సాగింది. సినిమా కూడా అలానే ఉండబోతుందని తెలుస్తోంది.
ఒకప్పుడు ఇండియన్ `రా`లో స్పై ఏజెంట్గా ఉన్న కబీర్ దలివాల్(హృతిక్ రోషన్) కొన్ని కారణాలతో దాన్నుంచి బయటకు వెళ్తాడు. రా కి వ్యతిరేకంగా పనిచేస్తుంటాడు. పలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటాడు. రా కి పెద్ద థ్రెట్గా మారిన నేపథ్యంలో ఆయన్ని పట్టుకునేందుకు మరో పవర్ ఫుల్ రా ఏజెంట్ విక్రమ్(ఎన్టీఆర్) రంగంలోకి దిగుతాడు. మరి కబీర్ని పట్టుకునేందుకు విక్రమ్ చేసిన పోరాటం, సాహసాలు ఏంటి? విక్రమ్కి కబీర్ దొరికాడా? అసలు ఇందులో హీరో ఎవరు? విలన్ ఎవరు? అనే ట్విస్టే ఈ మూవీ కథగా ఉండబోతుందని తెలుస్తోంది. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతుందని సమాచారం.
`వార్ 2` మూవీపై భారీ హైప్ నెలకొంది. ఆగస్ట్ 14న చాలా గ్రాండ్గా సినిమాని విడుదల చేస్తున్నారు. ఐమాక్స్ వెర్షన్లో కూడా ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. దీనిపై భారీ అంచనాలున్న నేపథ్యంలో ఇందులో నటించిన స్టార్ కాస్టింగ్ పారితోషిక వివరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాకి ఎన్టీఆర్ రూ.70కోట్ల పారితోషికం తీసుకున్నారని సమాచారం. `ఆర్ఆర్ఆర్` సినిమా తర్వాత ఆయన పారితోషికం పెంచారు. తెలుగులో ఆయనకు సమకాలీకులైన రామ్ చరణ్, బన్నీ వంద కోట్లకుపైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నేపథ్యంలో తారక్ మాత్రం యావరేజ్గానే మెయింటేన్ చేస్తుండటం విశేషం.
`వార్2` మరో హీరో హృతిక్ రోషన్ పారితోషికం ఎన్టీఆర్ కంటే తక్కువ కావడం విశేషం. ఆయన కేవలం రూ.48కోట్లు మాత్రమే తీసుకుంటున్నారట. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. ఆయన కలెక్షన్లలో షేర్ తీసుకోబోతున్నారట. ఆ డీల్ ప్రకారమే పారితోషికం తక్కువ తీసుకున్నట్టు సమాచారం. కానీ సినిమా హిట్ అయితే హృతిక్కి వంద కోట్ల వరకు రానున్నట్టు సమాచారం. ఇక హీరోయిన్ కియారా అద్వానీ రూ.15కోట్లు, ముఖ్య పాత్రలో నటించిన అశుతోష్ రానా రూ.80లక్షలు, చిత దర్శకుడు అయాన్ ముఖర్జీ రూ.30కోట్లు పారితోషికం తీసుకున్నట్టు బాలీవుడ్ మీడియా ది ఎకనామిక్స్ టైమ్స్ వెల్లడించింది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.