
ఇంగ్లండ్లోని ప్రఖ్యాత సిల్వర్స్టోన్ రేస్ ట్రాక్లో మిషెలిన్ లే మాన్స్ కప్ (Michelin Le Mans Cup) కార్ రేసింగ్ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎస్. జోసెఫ్ విజయ్ జెండా ఊపి ప్రారంభించారు. 2026 ఛాంపియన్షిప్లో ఇది ఐదో రౌండ్. ఈ పోటీలో ప్రముఖ కోలీవుడ్ నటుడు, రేసర్ అజిత్ కుమార్ బరిలోకి దిగారు. తమిళ సినిమాకు చెందిన ఇద్దరు అగ్ర తారలు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన మోటార్స్పోర్ట్స్ స్టేజ్పై కలుసుకోవడం ఒక అరుదైన ఘట్టం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్.
అజిత్ను చూడగానే సీఎం విజయ్ ఉత్సాహంగా పరుగెత్తుకెళ్లి ఆయన్ను కౌగిలించుకుని తన ప్రేమను చూపించారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత ఇద్దరూ కలిసి చేతులు పట్టుకుని, ఈ కార్ రేస్ చూడటానికి వచ్చిన లండన్లోని తమిళ ప్రజలకు అభివాదం చేశారు. ఈ ఈవెంట్ కోసం స్టేడియం మొత్తం హౌస్ఫుల్ అయ్యింది. ఇందుకోసం దాదాపు 70 వేల టిక్కెట్లు అమ్ముడయ్యాయని సమాచారం. విజయ్, అజిత్ కలియికని అంతా ఐకానిక్ మీట్గా భావిస్తున్నారు.
రెండు గంటల పాటు జరిగే ఈ రేసుకు సీఎం విజయ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. మరోవైపు, అజిత్ 'అజిత్ రెడాంట్ బై విరాజ్' జట్టు తరఫున రేసులో పాల్గొన్నారు. తన విజయవంతమైన సినీ కెరీర్తో పాటు, మోటార్స్పోర్ట్స్పై తనకున్న ఆసక్తిని అజిత్ ఎప్పుడూ చూపిస్తూనే ఉంటారు. ఆయన LMP3 Pro/Am విభాగంలో 'అజిత్ రెడాంట్ బై విరాజ్' జట్టు తరఫున పోటీ పడుతున్నారు. ఫ్రాన్స్కు చెందిన రేసర్ రొమైన్ వోస్నియాక్తో కలిసి నంబర్ 16 లిజియర్ కారును నడుపుతున్నారు.
రేసుకు ముందు జరిగిన ప్రెస్ మీట్లో అజిత్ మాట్లాడుతూ, సీఎం విజయ్ రాకను స్వాగతించారు. భారత్లో కూడా ఇలాంటి పెద్ద పోటీలు నిర్వహించాలనే తన కోరికను వ్యక్తం చేశారు. "తమిళనాడు ముఖ్యమంత్రి ఎస్. జోసెఫ్ విజయ్ తన బిజీ షెడ్యూల్లోనూ సమయం కేటాయించుకుని మమ్మల్ని చూడటానికి సిల్వర్స్టోన్కు వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము గత 34 ఏళ్లుగా సినీ పరిశ్రమలో సహోద్యోగులుగా ఉన్నాం. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నికవడం నాకు చాలా సంతోషంగా ఉంది," అని అజిత్ అన్నారు.
That run and hug 🫂 ❤️ #AK #CMVijay pic.twitter.com/x7TKRi460Y
— Actor Vijay Fan Page (@ActorVijayFP) September 12, 2026
"ఆయన (విజయ్) క్రీడలను ప్రోత్సహించడానికి చాలా చేస్తున్నారు. అందుకే, భారత్లో, చెన్నైలో ఇలాంటి ఈవెంట్లను నిర్వహించడానికి ఏం అవసరమో చూడాలని మేము ఆహ్వానించాం. ఈ ఈవెంట్లు భారత్కు రావాలన్నదే నా కోరిక," అని కూడా ఆయన తెలిపారు. సిల్వర్స్టోన్లో జరుగుతున్న ఈ రేసులో అజిత్తో పాటు భారత్ నుంచి మాజీ ఫార్ములా వన్ రేసర్ నరైన్ కార్తికేయన్, ఆదిత్య పటేల్ కూడా పాల్గొంటున్నారు.
ఈ రేసు 5.891 కిలోమీటర్ల పొడవైన గ్రాండ్ ప్రిక్స్ సర్క్యూట్లో రెండు గంటల పాటు జరుగుతుంది. ఇది 2026 మిషెలిన్ లే మాన్స్ కప్ సీజన్లో ఐదవ రౌండ్. దీని ఫైనల్ రౌండ్ అక్టోబర్లో పోర్చుగల్లోని పోర్టిమావో నగరంలో జరగనుంది. మిషెలిన్ లే మాన్స్ కప్ అనేది ఒక ఎండ్యూరెన్స్ రేసింగ్ ఛాంపియన్షిప్. ఇందులో LMP3, LMP3 Pro/Am, GT3 వంటి విభాగాలు ఉంటాయి. ఫార్ములా వన్ రేసులో డ్రైవర్లు ఒంటరిగా పోటీ పడతారు, కానీ ఈ ఎండ్యూరెన్స్ రేసులో ఒకే కారును పలువురు డ్రైవర్లు నిర్దిష్ట సమయం పాటు పంచుకుని నడుపుతారు.
అజిత్ 2026 సీజన్ కోసం ఈ ఛాంపియన్షిప్లో చేరారు. ఆయన LMP3 Pro/Am విభాగంలో ప్రత్యేకంగా రూపొందించిన Le Mans Prototype కారులో పోటీ పడుతున్నారు. తమిళనాడులో మోటార్స్పోర్ట్స్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో, సీఎం విజయ్ సిల్వర్స్టోన్ పర్యటనకు ఇంపార్టెన్స్ ఏర్పడింది. పెట్టుబడులను ఆకర్షించడం, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ వంటి వివిధ రంగాలలో భాగస్వామ్యాలను విస్తరించడం లక్ష్యంగా సీఎం ప్రస్తుతం వారం రోజుల పర్యటన కోసం ఇంగ్లండ్ వెళ్లారు.