
ఇండియన్ సినిమా అంటే మొన్నటి వరకు బాలీవుడ్, ఇప్పుడు టాలీవుడ్ పేర్లు వినిపిస్తాయి. ఇక తమిళం, కన్నడ, మలయాళం, మరాఠి, బెంగాలి, బోజ్పూరి ఇండస్ట్రీలు అడపాదడపా వార్తల్లో నిలుస్తుంటాయి.
ఎప్పుడూ చర్చనీయాంశం కానీ, మెయిన్ స్ట్రీమ్ వార్తల్లో నిలవని ఒడియా(ఒరిస్సా) మూవీ ఇప్పుడు ఇండియాలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ కావడం విశేషం.
దానికి కారణం ఒక మూవీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడమే. ఆ మూవీనే `బౌ బుట్టు భూత`. తల్లికొడుకు దెయ్యం మధ్య జరిగే కథ ఇది.
`బౌ(తల్లి) బుట్టు(కొడుకు) భూత(దెయ్యం)` అనే చిత్రం ఒరియాలో తెరకెక్కింది. ఈ మూవీకి జగదీష్ మిశ్రా దర్శకత్వం వహించగా, ఇందులో బాబూషాన్ మొహంతి, అర్చితా సాహు, అపరాజిత మొహంతి, అనుగులియా బంటీ ప్రధాన పాత్రల్లో నటించారు.
బాబూషాన్ మొహంతి హీరోగా చెప్పొచ్చు. విలేజ్ ప్రధానంగా సాగే ఈ హర్రర్ మూవీ జూన్ 12న ఒరియాలో విడుదలైంది. కేవలం రెండు కోట్లతో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు ఒడియా భాషలో సంచలనం సృష్టించింది. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుంది.
`బౌ బుట్టు భూత` చిత్రం రెండు నుంచి రెండున్నర కోట్ల బడ్జెట్తో రూపొందింది. ఇప్పుడు పదిహేను రోజులకు ఈ చిత్రం ఏకంగా సుమారు రూ.13కోట్లు రాబట్టింది. ఒరియాలో హైయ్యెస్ట్ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇండస్ట్రీ హిట్గా నిలిచింది.
ఇంకా ఈ మూవీ భారీ వసూళ్ల దిశగా వెళ్తుంది. రోజుకి ఈ చిత్రానికి సుమారు యాభై లక్షల కలెక్షన్లు వస్తున్నాయి. మున్ముందు ఇది మరింత భారీ కలెక్షన్లగా వెళ్తుందని చెప్పొచ్చు.
ఇప్పటి వరకు ఒరియాలో ఏడున్నర కోట్లు రావడమే హైయ్యెస్ట్. అదే ఇండస్ట్రీ రికార్డు. మూడేళ్ల క్రితం వచ్చిన `డామన్` మూవీ ఈ రికార్డుని సృష్టించింది.
ఇందులోనూ బాబూషాన్ మొహంతినే హీరో కావడం విశేషం. ఈ చిత్రం ఏడున్నర కోట్లతో ఇప్పటి వరకు ఇండస్ట్రీ హిట్గా ఉంది. ఇప్పుడు తన రికార్డుని తానే బ్రేక్ చేసుకున్నారు బాబూషాన్.
ఆయన ఒడియా బిగ్గెస్ట్ స్టార్గా అవతరించారు. ఇక ఒడియా టాప్ గ్రాస్ చిత్రాల్లో గతేడాది వచ్చిన `కర్మ`(6.50కోట్లు), `పబార్`(3.50కోట్లు) వంటి చిత్రాలు ఒడియాలో టాప్ గ్రాసర్గా నిలిచాయి.
ఇక `బౌ బుట్టు భూత` సినిమా కథ విషయానికి వస్తే ఒరిస్సాలోని ఒక విలేజ్లో తల్లితోపాటు కొడుకు(బాబూషాన్ మొహంతి) జీవిస్తుంటారు. వీరు చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగిస్తారు. తల్లి మంత్రగత్తె.
అక్కడే ఉంటే తమ బతుకులు మారవు, మనం ఎదగలేమని భావించిన కొడుకు వేరే ప్రాంతానికి వలస వెళ్లాలని ప్రయత్నిస్తాడు. ఈక్రమంలో అనుకోని అడ్డంకులు ఎదురవుతాయి. ఏకంగా దెయ్యం అతన్ని వెంటాడుతుంది. ఊరి దాటి వెళ్లనివ్వదు.
మరి ఆ దెయ్యం ఎవరు? దాని కథేంటి? దాన్ని దాటుకుని కొడుకు తన లక్ష్యం దిశగా వెళ్లాడా? ఆ ఊర్లో ఏం జరిగిందనేది ఈ మూవీ కథ. ఆద్యంతం హర్రర్ ప్రధానంగా సాగుతుంది.
కామెడీ ఎలిమెంట్లు, హర్రర్ అంశాల మేళవింపుగా సాగే ఈ మూవీ ఒరియా ఆడియెన్స్ ని ఆద్యంతం కట్టిపడేస్తుంది. దీంతో వారు ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీ కలెక్షన్ల పరంపర ఇంకా సాగుతూనే ఉంది. ఎక్కడ ఆగుతుందో చూడాలి.