
కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో శ్రీధర్, కాంచన మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తీక్ ని చూడడానికి నేను వస్తే.. వాడు డ్యూటీకి వెళ్లాడని చెప్తున్నావేంటీ అంటాడు శ్రీధర్. చెప్తే వినరు కదా అంటుంది కాంచన. కార్తీక్, దీప మన దగ్గర ఏదో దాస్తున్నారని డౌట్ పడుతుంది కాంచన. జ్యోత్స్న పెట్టిన అగ్రిమెంట్ తో కూడా దీపకు ఏదో సంబంధం ఉంది అంటుంది కాంచన. హా ఉంది కదా.. దీపకు బాగోలేనప్పుడే కదా కార్తీక్ అగ్రిమెంట్ పై సంతకం పెట్టింది అంటాడు శ్రీధర్.
అది కాదండీ.. మామాలుగా అయితే ఇంతకు ముందు దీప నాలాగే ఉండేది. కార్తీక్ ని ఆ ఇంటికి వెళ్లకుండా వారించేది. కానీ ఇప్పుడు కార్తీక్ ని అడ్డుకోవడం లేదు. అంటే ఏదో ఉంది అంటుంది కాంచన. తెలుసుకుందాంలే నువ్వు టెన్షన్ పడకు అంటాడు శ్రీధర్. సరే నేను వెళ్తాను అని చెప్తాడు శ్రీధర్. మీరు కాస్త నీరసంగా కనిపిస్తున్నారు డాక్టర్ కి చూపించుకోండి అని చెప్తుంది కాంచన. నాకేమైంది నేను బాగానే ఉన్నాను అంటాడు శ్రీధర్. అటు కొడుకు, కోడలు నా మాట వినరు. మీరు కూడా నా మాట వినరా.. ముందు డాక్టర్ దగ్గరకు వెళ్లండి అని కాస్త గట్టిగానే చెప్తుంది కాంచన. సరే అని వెళ్లిపోతాడు శ్రీధర్.
మరోవైపు జ్యోత్స్న జాతకం చూస్తుంటాడు పంతులు. ఈ జాతకం ప్రకారం అమ్మాయికి ఈ పాటికే పెళ్లి అయిపోయి ఉండాలే అంటాడు పంతులు. మా పెద్ద మేడంకి ఇంకా పెళ్లి కాలేదండీ అంటాడు కార్తీక్. పంతులు దగ్గరికి వెళ్లి చూసిన పారు.. అయ్యో.. ఇది నా జాతకం అండీ, నా మనుమరాలిది కాదు అని జ్యోత్స్న జాతకం ఇస్తుంది.
కాసేపు సస్పెన్స్ తర్వాత ఈ అమ్మాయి జాతకం భలే విచిత్రంగా ఉందండి. ఈ జాతకం ప్రకారం సరిగ్గా నెల రోజుల లోపు పెళ్లి జరుగుతుంది. లేదంటే జీవితాంతం కుమారిగానే మిగిలిపోతుంది అని చెప్తాడు పంతులు. అంతా షాక్ అవుతారు. నెల రోజుల్లో బావకు పెళ్లాన్ని అవుతానని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. అలా నేను జరగనివ్వను అని మనసులో అనుకుంటుంది పారు.
ఆ తర్వాత కార్తీక్ జాతకాన్ని పంతులుకు చూపిస్తుంది పారు. చాలా మంచి జాతకం. పది మందికి సాయం చేసే గుణం. మహారాజు లాంటి జీవితాన్ని వద్దు అనుకొని పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అన్నీ కష్టాలే. కానీ అతని జీవితంలోకి వచ్చిన అమ్మాయిది కూడా రాణి జాతకమే, తప్పకుండా మంచి రోజులు వస్తాయి అని చెప్తాడు పంతులు. బావ జాతకంలో రెండో పెళ్లి రాత ఉందా? అని అడుగుతుంది జ్యోత్స్న. పారు అరవడంతో నోరు మూసుకుంటుంది జ్యోత్స్న.
జ్యోత్స్న కోసం పూజలు, పరిహారాలు వంటివి ఏమైనా చేయాలా పంతులు గారు అని అడుగుతుంది సుమిత్ర. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. అన్నీ వాటంతట అవే జరుగుతాయి. అమ్మాయిని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పండి చాలు అని చెప్తాడు పంతులు. విన్నావు కదా జాగ్రత్తగా ఉండు నెల రోజుల్లో నీ పెళ్లి అని జ్యోత్స్నతో చెప్తుంది సుమిత్ర. ఓకే మమ్మీ నేను కూడా రెడీగా ఉన్నాను అంటుంది జ్యోత్స్న.
మరోవైపు అనసూయ, కాంచనలను ఆటపట్టిస్తుంటుంది శౌర్య. అంతలో కార్తీక్, దీప వస్తారు. శౌర్య పొరపాటున కార్తీక్ కి గాయమైన చోట పట్టుకుంటుంది. కార్తీక్ అబ్బా అని అరుస్తాడు. అయ్యే సారీ నాన్న అంటుంది శౌర్య. నొప్పి తగిలితే కానీ అమ్మా, నాన్న గుర్తుకురారు అంటుంది కాంచన. మా నాన్నను ఏం అనొద్దు అని అడ్డుపడుతుంది శౌర్య. నానమ్మతో అలా మాట్లాడొచ్చా అంటాడు కార్తీక్. సారీ చెప్పి లోపలికి వెళ్లిపోతుంది శౌర్య.
నీ కూతురు నిన్ను అర్థం చేసుకున్నదానిలో నువ్వు నన్ను సగం అర్థం చేసుకున్నా బాగుండేది అంటుంది కాంచన. నా మీద నీకు అన్నీ హక్కులు ఉన్నాయమ్మా అంటాడు కార్తీక్. ఆ హక్కుతోనే అడుగుతున్నా నిజం చెప్పు. జ్యోత్స్న ఇంతలా నీ వెంట ఎందుకు పడుతోంది? జ్యోత్స్న, దీప, నీకు మధ్య మాకు తెలియని ఏదో కథ జరుగుతోంది. అదేంటో చెప్పు అంటుంది కాంచన. తన కారణంగా విడిపోయిన ఈ రెండు కుటుంబాలను దీప కలపాలని ప్రయత్నిస్తోంది. త్వరలోనే కలుపుతుంది కూడా.. అని చెప్పి లోపలికి వెళ్లిపోతాడు కార్తీక్.
మరోవైపు జ్యోత్స్న పంతులు చెప్పిన మాటలను గుర్తుచేసుకొని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో తన ఫ్రెండ్ ఒకరు కాల్ చేసి తన కూతురి బర్త్ డేకి రావాలని పిలుస్తుంది. సరే అని చెప్తుంది జ్యోత్స్న. కార్తీక్ తో పెళ్లి గురించి వాళ్ల ఫ్రెండ్ కి చెప్పబోతుంది జ్యోత్స్న. వెనకాలే ఉన్న పారును చూసి ఆగిపోతుంది. ఆ తర్వాత ఫోన్ కట్ చేసి, ఎందుకు గ్రానీ ఇలా నాపై పగ సాధిస్తున్నావు అని అక్కడినుంచి వెళ్లిపోతుంది జ్యోత్స్న.
కార్తీక్ కి చేతికి కట్టు విప్పి, గాయం పూర్తిగా మానిందని చెప్తుంది దీప. గాయం మానింది కానీ నొప్పి తగ్గలేదు అంటాడు కార్తీక్. టాబ్లెట్ వేసుకో అంటుంది దీప. ఇది టాబ్లెట్ కి తగ్గదు.. నీ చెల్లి ఉంది కదా, అదే జ్యోత్స్న అంటాడు కార్తీక్. అది నాకు చెల్లేంటి అంటుంది దీప. ఓ రోజు నువ్వే అన్నావు కదా తను నా చెల్లెలు లాంటిది అని అంటాడు కార్తీక్.
అయితే ఇప్పుడు తనని నాకు సవతిని చేస్తావా ఏంటి? నా బావతో తాళి కట్టించుకుంటానని నాతో ఛాలెంజ్ చేసినప్పుడే అది నాకు శత్రువు అయిపోయింది అంటుంది దీప. అంతలో పారు దీపకు ఫోన్ చేసి ఏం ఆలోచించావు అని అడుగుతుంది. దేని గురించి అంటుంది దీప. నీ సవతి గురించి అంటుంది పారు. ఆ మాటకు గట్టిగా పారిజాతం గారు అంటుంది దీప. ఆ మాట వినడానికే నీకు ఏదోలా ఉంది.. కానీ వదిలేస్తే జరిగేది అదే.. జ్యోత్స్న నీ అంత మంచిది కాదు అంటుంది పారు. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది