
పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన బాలుకి మీనా దిష్టి తీస్తుంది. ఈ లోగా.. మనోజ్ వచ్చి తనకు కాఫీ కూడా ఇవ్వలేదని ఓవర్ యాక్షన్ చేస్తాడు. అయితే.. మీనా అత్తతో పాటు, మనోజ్, రోహిణీల దుమ్ము దులుపుతుంది. తాను తన భర్త, మామ గారెకి తప్ప ఎవరికీ కాఫీ ఇవ్వను అని తేల్చిచెబుతుంది. అయితే.. ఆ మాత్రం కాఫీ మాకు పెట్టుకోవడం వచ్చులే అని ప్రభావతి అంటుంది. కాఫీ నేను పెడతాను రండి అత్తయ్య అని రోహిణీ అంటే.. వద్దులే.. మా అమ్మ పెడుతుంది అని మనోజ్ లోపలికి తీసుకువెళతాడు. వాళ్లు వెళ్లిన తర్వాత..జరిగిన దానికి బాలు వాళ్ల నాన్న కు క్షమాపణలు చెబుతాడు. ‘ నువ్వు చేసింది మంచి పనే. కానీ.. చేసిన విధానం బాలేదు. నువ్వు పోలీస్ స్టేషన్ లో కూర్చున్నావ్.. నువ్వు జైలుకు పోతే మీనా పరిస్థితి ఏంటి అని ఆలోచించావా?’ అని సత్యం తిడతాడు. ఇంకోసారి అలా చేయను అని బాలు చెబుతాడు.
సీన్ కట్ చేస్తే..శ్రుతి జ్వరంతో బాధపడుతూ ఉంటుంది. రవి మాత్రం రెస్టారెంట్ కి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటాడు.అయితే శ్రుతి తనకు జ్వరంగా ఉందని.. సెలవు పెట్టమని అడుగుతుంది. రవి కూడా.. సెలవు తీసుకోవడానికి నీతూని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ, నీతూ ఒప్పుకోకపోవడంతో.. శ్రుతిని బాగా చూసుకోమని మీనాతో చెప్పి వెళ్లిపోతాడు. రవి తనకు బాలేని సమయంలో వదిలి వెళ్లాడని అలిగిన శ్రుతి.. పుట్టింటికి బయలు దేరుతుంది.
వద్దు అని.. మీనా ఎంత నచ్చచెప్పాలని చూసినా శ్రుతి వినిపించుకోదు. అప్పుడే ప్రభావతి వచ్చి వెళ్లొద్దని బతిమిలాడుతుంది. కానీ.. శ్రుతి వినిపించుకోకుండా వెళ్లిపోతుంది. దానికి కూడా మీనానే కారణం అంటూ.. ప్రభావతి నిప్పులు తొక్కుతుంది. శ్రుతి అలా వెళ్లడం చూసిన బాలు... ఇంట్లోకి వచ్చి మీనాని విషయం అడుగుతాడు. జరిగింది మొత్తం మీనా చెబుతుంది.. అయితే.. రవి వెళ్లి గంటలోనే తెచ్చుకుంటాడులే అని బాలు అంటాడు.
ఇక.. రవి రెస్టారెంట్ కి వెళ్లినా.. శ్రుతి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. తన భార్యకు బాలేదని నీతూతో చెబుతాడు. ఫోన్ లో మాట్లాడి సర్ది చెప్పు అని... సెలవు మాత్రం ఇవ్వను అని నీతూ చెబుతుంది. అప్పుడే... ప్రభావతి రవికి ఫోన్ చేసి.. శ్రుతి పుట్టింటికి వెళ్లిన విషయం చెబుతుంది. అంతేకాదు.. రవిని బాగా రెచ్చగొడుతుంది. భార్యకు లొంగకూడదు అని చెబుతుంది. వచ్చేటప్పుడు శ్రుతిని తీసుకువస్తాను అని రవి అంటే.. అలా చేస్తే.. నువ్వు చులకన అవుతావు.. చేయకు అని బాగా రెచ్చగొడుతుంది.
అయితే.. ప్రభావతి మాట్లాడిన మాటలు విని బాలు, మీనా షాక్ అవుతారు. కలపాల్సిన మనిషి ఇలా గొడవలు పెట్టడం ఏంటి అని భయపడతారు. వెంటనే మీనా రవికి ఫోన్ చేసి... అత్తయ్య మాటలు పట్టించుకోవద్దని.. శ్రుతికి నచ్చ చెప్పి ఇంటికి తీసుకురమ్మని సలహా ఇస్తుంది. తోటి కోడలు కాపురం గురించి గొప్ప ఆలోచించిన మీనాని చూసి బాలు మురిసిపోతాడు. తర్వాత బాలు పని మీద బయటకు వెళతారు.
మీనా ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా.. తన బంధువులు వస్తారు. శుభ లేఖ ఇవ్వడానికి వస్తారు. ఇచ్చి వెళ్లిపోతుంటే.. భోజనం చేయమని మీనా బలవంత పెడుతుంది. దీంతో.. వారు భోజనానికి కూర్చొంటారు. అది చూసిన ప్రభావతి.. మీనాని పక్కకు పిలిచి వచ్చిన బంధువులకు వినిపించేలా దారుణంగా మాట్లాడుతుంది. వాళ్లకు వినపడుతుందని మీనా ఎంత చెప్పినా ప్రభావతి వినదు. దీంతో.. వచ్చిన వాళ్లు ఒక్క ముద్ద కూడా తినకుండా చేతులు కడుక్కొని లేచి వెళ్లిపోతారు. దీంతో వాళ్లు వెళ్లిపోయాక మీనా చాలా బాధపడుతుంది. అత్తను ఏకిపారేస్తుంది. గతి లేని వాళ్లు కూడా ఇలా చేయరు అని అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. పూలు కట్టడానికి వెళ్లిన మీనా..తన ఇంట్లో జరిగినదంతా తన స్నేహితులకు చెబుతుంది. అయితే.. అత్త ఎలా కంట్రోల్ పెట్టుకోవాలో వాళ్లు సలహా ఇస్తారు. అత్తకు ఎదురు తిరగమని చెబుతారు. మీనా కూడా ఆలోచనలో పడుతుంది.
ప్రభావతి ఇంట్లో టీవీ చూస్తూ ఉంటుంది. అప్పుడే మనోజ్ వస్తాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. తనకు జలుబు చేసిందని మనోజ్ అంటే.. చికెన్ సూప్ తాగితే తగ్గుతుందని కొడుక్కి సలహా ఇస్తుంది. అప్పుడే మీనా ఇంట్లోకి వస్తే.. ప్రభావతి ఆపుతుంది. బజారుకి వెళ్లి చికెన్ తెచ్చి.. మంచిగా సూప్ చేయమని ఆర్డర్ వేస్తుంది. ఎవరికీ అని మీనా అంటే.. మనోజ్ కి అని చెబుతుంది. అయితే.. మీనా ఏ మాత్రం తగ్గకుండా.. నేను చేయను అని చెబుతుంది. రోహిణీ తో చేయించుకోమని చెబుతుంది. ఆ మాటలకు ప్రభావతి, మనోజ్ షాక్ అవుతారు. అయితే.. మనోజ్ పూలు అమ్ముకునే దానివి అంటూ తక్కువ చేసి మాట్లాడతాడు. ఆ మాటలకు మీనాకి కోపం విపరీతంగా వస్తుంది. కోపంగా లోపలికి వెళ్లి... బెల్టు తెస్తుంది.తమ్ముడి భార్యతో ఎలా మాట్లాడాలో తెలీదా అంటూ.. బెల్టుతో చితకబాదుతుంది. ఆ దెబ్బలకు భయపడిన మనోజ్.. నాకు చికెన్ సూప్ వద్దు అని మొత్తుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.