Roundup 2021: పవన్ ప్రసంగం, మా ఎన్నికలు, సమంత విడాకులు... 2021లో టాలీవుడ్ ని ఊపేసిన వివాదాలు

First Published Dec 25, 2021, 9:44 AM IST

చిత్ర పరిశ్రమలో(Tollywood) వివాదాలు చాలా కామన్. ప్రతి ఏడాది ఎన్నో కొన్ని వివాదాలు చోటు చేసుకుంటాయి. అయితే 2021లో వివాదాలు రచ్చకెక్కాయి. అందరి దృష్టి కేంద్రీకృతమై ఉండే గ్లామర్ ఫీల్డ్ కావడంతో మీడియాలో ప్రధాన శీర్షికలుగా నిలిచాయి. మరి ఈ ఏడాది వార్తలకెక్కిన ప్రధాన వివాదాలు ఏమిటో చూద్దాం 
 

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)వకీల్ సాబ్ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చారు. పాలిటిక్స్ కారణంగా విరామం ప్రకటించిన పవన్ 3 ఏళ్ల తర్వాత వకీల్ సాబ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ మూవీ పట్ల అత్యంత ఉత్సాహం ప్రదర్శించారు. కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చిన వకీల్ సాబ్ ఏప్రిల్ 9న సమ్మర్ కానుకగా విడుదల చేశారు.  అయితే ఆంధ్రప్రదేశ్ లో వకీల్ సాబ్ మూవీ బెనిఫిట్ షోలను ప్రభుత్వం రద్దు చేసింది. గత చిత్రాలకు బెనిఫిట్ షోలకు అనుమతి లేదన్న ప్రభుత్వం, వకీల్ సాబ్ చిత్ర బెనిఫిట్ షోలు ప్రదర్శనకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. వైసీపీ ప్రత్యర్థిగా ఉన్న పవన్ పై కక్ష సాధింపులో భాగంగానే వకీల్ సాబ్ బెనిఫిట్ షోలు ఆంధ్ర ప్రభుత్వం రద్దు చేసినట్లు ఫ్యాన్స్, జనసేన వర్గాలు అసహనం వ్యక్తం చేశాయి.

వినాయక చతుర్థి వేళ మెగా ఫ్యామిలీలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. హీరో సాయి ధరమ్ తేజ్ (Sai dharm tej)హైదరాబాద్ లో బైక్ ప్రమాదానికి గురయ్యారు. తీవ్రగాయాలపాలైన సాయి ధరమ్ తేజ్ ప్రమాదం అనంతరం స్పృహ కోల్పోయారు. నెల రోజులకు పైగా సాయి ధరమ్ తేజ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ ప్రమాదం విషయంలో నటుడు నరేష్, శ్రీకాంత్ మధ్య మాటల యుద్ధం నడిచింది. 

సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు అతిధిగా వచ్చిన పవన్ కళ్యాణ్ దానిని  రాజకీయ వేదికగా మార్చేశారు. టికెట్స్ ధరల తగ్గింపు, బెనిఫిట్ షోల రద్దు, ఆన్లైన్ అమ్మకాలు వంటి ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా ఫంక్షన్ లో పవన్ రాజకీయ ప్రసంగం దుమారం రేపింది. ఏపీ మంత్రి పేర్ని నాని ని పవన్ సన్నాసి అంటూ సంబోధించారు. ఇది రాజకీయ వివాదానికి  దారితీసింది. పవన్ వ్యక్తిగత వ్యాఖ్యలతో పరిశ్రమకు సంబంధం లేదని ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, బడా నిర్మాతలు ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. పేర్ని నాని సైతం మీడియా వేదికగా పవన్ ని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  
 


రిపబ్లిక్ వేదికపై పవన్ ప్రసంగానికి వ్యతిరేకంగా నటుడు పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ లో మాట్లాడారు.  మీడియా సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తన ఇంటిపై దాడి చేశారని, భార్యను నీచంగా తిట్టారని మరో ప్రెస్ మీట్ ద్వారా ఆవేదన చెందారు. ఈ క్రమంలో ఆయన పవన్ వ్యక్తిగత జీవితంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పోసాని ప్రెస్ మీట్ జరుగుతుండగానే ఫ్యాన్స్ ఆయనపై దాడికి దిగారు. పోలీసులు పోసానిని రక్షణ మధ్య ఇంటికి పంపివేశారు. ఇక పోసాని కామెంట్స్ పరిశ్రమలో దుమారం రేపాయి. 
 


'మా' (MAA Elections)అధ్యక్ష ఎన్నికల పేరుతో టాలీవుడ్ పెద్దల మధ్య జరిగిన రచ్చ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నటులు ఒకరిపై మరొకరు వ్యక్తిగత దూషణలు చేసుకోవడం పరిశ్రమ పరువు బజారున పడింది. ఎన్నడూ లేని విధంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. ప్రకాష్ రాజ్ మెగా ఫ్యామిలీ అండతో అధ్యక్షుడు బరిలో నిలిచారు. ఆయనకు పోటీగా మంచు విష్ణు పోటీ చేయడం జరిగింది. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్, నాగబాబు... మంచు విష్ణుకు మద్దతుగా ఉన్న మా అధ్యక్షుడు నటుడు నరేష్ పై విమర్శలు గుప్పించారు. 
 

అదే సమయంలో నరేష్ సైతం నాగబాబు, ప్రకాష్ రాజ్ (Prakash raj)ని ఉద్దేశిస్తూ వ్యక్తిగత విమర్శలు చేయడం జరిగింది. ఇక ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ అనే నినాదం తెరపైకి వచ్చింది. రవిబాబు, రాజీవ్ కనకాల, కోటా శ్రీనివాసరావు బహిరంగంగానే ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అన్నారు. స్థానికుడు కాని ప్రకాష్ రాజ్ పెత్తనం మేము ఒప్పుకోమని తేల్చి చెప్పారు. 


చివరకు చిరంజీవి-మోహన్ బాబు మధ్య విబేధాలకు మా ఎన్నికలు కారణమయ్యాయి. అక్టోబర్ 10న ప్రతిష్టాత్మకంగా జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. ఆయన ప్యానెల్ నుండి గెలిచిన శ్రీకాంత్, ఉత్తేజ్, బెనర్జీ తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే నాగబాబు, ప్రకాష్ రాజ్ ఏకంగా మా సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. వీరి రాజీనామాలు మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆమోదించలేదు. 
 

ఇక 2021లో టాలీవుడ్ ని ఊపేసిన వివాదాల్లో సమంత (Samantha)-నాగ చైతన్య విడాకులు. అక్టోబర్ 2న సామ్ చైతూ సోషల్ మీడియా వేదికగా విడాకుల ప్రకటన చేశారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. అధికారిక ప్రకటనకు రెండు నెలల ముందు నుండే ఈ టాపిక్ మీడియాలో హాట్ హాట్ గా నడుస్తుంది. దీనితో వీరి విడాకుల వార్త అంతగా షాక్ ఇవ్వలేదు. 


అయితే విడాకులకు కారణాలు ఇవేనంటూ మీడియాలో వచ్చిన వరుస కథనాలు వివాదాస్పదం అయ్యాయి. మనస్పర్థలకు సమంతనే కారణమంటూ మీడియా ఆమెను కార్నర్ చేసింది. పిల్లలు వద్దనుకున్నారని, అబార్షన్ చేయించుకున్నారని, పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ తో ఎఫైర్ ఉందని... నిరాధారమైన కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలతో విసిగిపోయిన సమంత లీగల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ వివాదం సద్దుమణిగింది. సమంత ప్రొఫెషన్ గా బిజీ అయ్యారు. 

AP Ticket Price

ఏపీలో అమలవుతున్న టికెట్స్ ధరలపై పరిశ్రమ వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో థియేటర్స్ నిర్వహణ సాధ్యం కాదని, పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు నటులు ఓపెన్ గా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శ్యామ్ సింగరాయ్ (Shyam singharoy)మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని (Nani)ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో థియేటర్స్ వసూళ్ల కంటే కిరాణా కొట్టు వసూళ్లు అధికంగా ఉన్నాయంటూ సెటైర్స్ వేశారు. టికెట్స్ ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 35ని హైకోర్ట్ రద్దు చేసింది. అయితే ప్రభుత్వం దీనిపై అప్పీల్ కి వెళ్లడం జరిగింది. జనవరి 4న విచారణ జరగనుంది. 

Also read AP Ticket Price: నానికి ఏం తెలుసు, క్షమాపణ చెప్పాలి.. నిర్మాత నట్టి కుమార్ ఘాటు వ్యాఖ్యలు

Also read జగన్ సార్.. మాకు కూడా వరాలు ఇవ్వండి.. మీ నాన్నగారి అభిమానినన్న బ్రహ్మాజీ

click me!