
మెగాస్టార్ చిరంజీవి ఒంటరిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి టాలీవుడ్ లో నెంబర్ 1 స్థానానికి చేరుకున్నారు. అయితే కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి చాలా కష్టాలు ఎదుర్కొన్నారని సన్నిహితులు తరచుగా చెబుతుంటారు. కొన్ని అవమానాలు కూడా పడ్డారు. వాటన్నింటిని దిగమింగుకుని నటన, డ్యాన్సులు, ఫైట్స్ లో తన ప్రతిభ చాటుకుంటూ నెమ్మదిగా కెరీర్ లో ఎదగడం ప్రారంభించారు. 1983లో విడుదలైన ఖైదీ చిత్రంతో అంతా మారిపోయింది. ఆ మూవీలో చిరంజీవి మాస్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీనితో చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగారు. అక్కడి నుంచి ఇక వెనుదిగిరి చూసుకోలేదు. చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో చెన్నైలో ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చదువుకుంటూ చిన్న పాత్రలు, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించేవారు. ఆ టైంలో చిరంజీవి, కమెడియన్ సుధాకర్, హరిప్రసాద్ ఒకే రూమ్ లో ఉండేవారు.
నాగబాబు మాట్లాడుతూ.. చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్ ముగ్గురూ ఉండే రూమ్ పక్క ఇంట్లో పురాణం సూర్య అనే డైరెక్టర్ తన ఫ్యామిలీతో ఉండేవారు. అప్పటికి పురాణం సూర్య ఇంకా డైరెక్టర్ కాలేదు. చిరంజీవి గారి లాగే అతడు కూడా కుర్రాడు. వాళ్ళ నాన్నకి పూర్ణ పిక్చర్స్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఉండేది. పక్క ఇల్లే కాబట్టి పురాణం సూర్య తల్లి చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్ తో ఆప్యాయంగా మాట్లాడుతూ అవసరమైనప్పుడు కాఫీలు, టీలు ఇచ్చేవారు. డిస్ట్రిబ్యూషన్ ఫ్యామిలీ కాబట్టి పరిచయాల కోసం చిరంజీవి గారు కూడా వారితో మంచిగా ఉండేవారు. అప్పట్లో సెలెబ్రిటీలు, బయ్యర్ల కోసం రిలీజ్ కి ముందే ప్రీ వ్యూ ప్రదర్శించేవారు. పురాణం సూర్య వాళ్ళ నాన్న డిస్ట్రిబ్యూటర్ కాబట్టి సినిమా ప్రీ వ్యూ లకు వాళ్ళకి ఎంట్రీ ఉండేది. వాళ్ళ తరపున వచ్చిన వాళ్లకు కూడా ఎంట్రీ ఉండేది. ఒక సినిమా ప్రీవ్యూ ఉంది వెళ్లి చూస్తారా అని పురాణం సూర్య తల్లి.. చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్ ముగ్గురికీ చెప్పింది. దీనితో తప్పకుండా వెళతాం అని చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్ ముగ్గురూ వెళ్లారు.
థియేటర్ లో చివరి నుంచి రెండో వరుసలో కూర్చున్నారు. ఆ సినిమా హీరో కూడా అప్పుడప్పుడే ఎదుగుతున్నాడు. విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. ఆ చిత్రానికి అతడే హీరో. అతడు ఎవరనేది నేను చెప్పను. ప్రేక్షకులే అతడెవరో గెస్ చేయాలి అని నాగబాబు ఇంటర్వ్యూలో అన్నారు. అన్నయ్య వాళ్ళు చివరి నుంచి రెండో వరుసలో కూర్చుని ఉంటే.. ఆ హీరో వచ్చాడు. ఏంటి మీరు ఇక్కడ కూర్చున్నారు.. ఇంకా రావలసిన వాళ్ళు ఉన్నారు. మీరు దూరంగా వెళ్ళండి అని అహంకారంతో మాట్లాడారు.
అన్నయ్య వాళ్ళకి థియేటర్ లో ఒక మూలన కుర్చీలు వేయించి కూర్చోబెట్టారు. అన్నయ్య ఆ అవమానాన్ని భరించలేక పోయారు. రూమ్ కి వచ్చేశారు. అన్నయ్య రూమ్ లో ఉంటే ఆ రోజు సాయంత్రం పురాణం సూర్య వెళ్లి.. అమ్మ పిలుస్తోంది ఇంటికి రా చిరంజీవి అని పిలిచారు. అన్నయ్య ఆ సంఘటనతో చాలా చిరాకుతో ఉన్నారు. వస్తాను లే నువ్వు వెళ్ళిపో అని అతడితో అన్నయ్య కోపంగా అన్నారు. కొన్ని నిమిషాల తర్వాత అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్లారు.
అన్నయ్య రాగానే ఆమె కాఫీ ఇచ్చింది. ఏంటి చిరంజీవి చిరాకుగా ఉన్నావట, ఏం జరిగింది అని అడిగారు. మీరు వెళ్ళమంటేనే నేను ఆ సినిమా ప్రీవ్యూకి వెళ్ళాను. ఆ హీరో వచ్చి కూర్చుని ఉన్న మమ్మల్ని దూరంగా వెళ్ళమని అవమానించాడు. వాడు ఎప్పుడూ అంతే చిరంజీవి, అతడి బిహేవియర్ అంతే.. పట్టించుకోకు అని ఆమె అన్నారు. చిరంజీవికి ఆమెకి బదులిస్తూ.. వాళ్ళు అహంకారంతో కొట్టుకుంటున్నారు ఆంటీ. వాళ్ళకి సరైన లెసన్ చెప్పాలి. ఈరోజు నేను శపథం చేస్తున్నా త్వరలో టాలీవుడ్ లో నేను నెంబర్ 1 హీరోని అవుతా. నన్ను అవమానించిన వాళ్ళ కళ్ళముందే ఎదుగుతా అని చిరంజీవి చెప్పారట. చిరంజీవి చెప్పింది చేసి చూపించాడు అని పురాణం సూర్య తనతో చాలా సార్లు గుర్తు చేసుకున్నట్లు నాగబాబు తెలిపారు. ఆ హీరో ఎవరనేది ప్రేక్షకులే గెస్ చేయాలి అని అన్నారు. ఆ చిత్రానికి దాసరి నారాయణ రావు దర్శకుడు అని హింట్ కూడా ఇచ్చారు.