
విలక్షణ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి కోట శ్రీనివాసరావు ఆదివారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణం పట్ల గతంలో పలు మార్లు రూమర్లు వచ్చాయి.
దీనిపై స్వయంగా ఆయనే స్పందించారు. కానీ ఇప్పుడు ఆయన చిత్ర పరిశ్రమని వదిలేసి వెళ్లిపోయారు. టాలీవుడ్ని శోకసంద్రంలో ముంచెత్తారు. ఇదిలా ఉంటే కోట జీవితంలో అనేక ఆసక్తికర సంఘటనలు ఉన్నాయి.
వివాదాలతోపాటు క్రేజీ విషయాలు చోటు చేసుకున్నాయి. తనతోపాటు నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఒక నటుడు ఇప్పుడు టాలీవుడ్ ని శాసిస్తుండటం విశేషం. ఆయన ఎవరో చూద్దాం.
రంగస్థలం నుంచి సినిమాల్లోకి వచ్చారు కోట శ్రీనివాసరావు. ఈ క్రమంలో ఆయన 1978లో `ప్రాణం ఖరీదు` సినిమాతో నటుడిగా టాలీవుడ్కి పరిచయం అయ్యారు.
ఇందులో చిన్న పాత్రలో కనిపించారు కోట. పెద్దగా గుర్తింపులేని, గుర్తించలేని పాత్ర. దీంతో ఆయన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఐదేళ్ల వరకు అవకాశాలు రాలేదు.
ఐదేళ్ల తర్వాత `అమరజీవి`లో నటించారు. అది కూడా అంతంత మాత్రంగానే ఉండే పాత్ర. ఇక ఏడాది గ్యాప్ తర్వాత `బాబాయి అబ్బాయి`లో చిన్న రోల్ చేశారు.
ఆ ఏడాది వచ్చిన `వందే మాతరం` మంచి పేరు తెచ్చింది. అందరు గుర్తించేలా చేసింది. ఆ సమయంలో వచ్చిన అద్భుతమైన అవకాశమే `ప్రతిఘటన`. ఈ మూవీలో విలన్గా రెచ్చిపోయి ఆ తర్వాత సినిమాల్లో నటుడిగా సెటిల్ అయిపోయారు కోట.
ఇదిలా ఉంటే కోటతోపాటే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీని శాసిస్తున్న నటుడు ఎవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి కూడా `ప్రాణం ఖరీదు` చిత్రంతోనే ఇండస్ట్రీకి పరిచయం అయిన విషయం తెలిసిందే.
అయితే చిరంజీవి మొదట ఓకే చేసిన మూవీ `పునాది రాళ్లు`. ఇది రిలీజ్కి లేట్ అయ్యింది. కానీ ఆ తర్వాత ఒప్పుకున్న `ప్రాణం ఖరీదు` మొదట రిలీజ్ అయ్యింది. ఇందులో చిరంజీవితో సెకండ్ లీడ్ రోల్ కావడం విశేషం.
అలా కోట శ్రీనివాసరావుతోపాటు చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమకి నటుడిగా పరిచయం అయ్యారు. కోట శ్రీనివాసరావు తన సుమారు యాభై ఏళ్ల కెరీర్లో 750కిపైగా చిత్రాలు చేసి మెప్పించారు.
విలక్షణ నటుడిగా రాణించారు. విలన్గా, కమెడీ విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇతర విభిన్నమైన పాత్రలు పోషించారు. సెంటిమెంట్ రోల్స్ కూడా చేసి గుండెని బరువెక్కించారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి `ప్రాణం ఖరీదు` చిత్రంతో నటుడిగా పరిశ్రమకి పరిచయమై, `కోతల రాయుడు`తో పూర్తి స్థాయి హీరోగా టర్న్ తీసుకున్నారు. హీరోగా నటిస్తూనే విలన్ రోల్స్ కూడా చేసి మెప్పించారు.
ఆవేశంతో కూడిన పాత్రలతో అదరగొట్టారు. `ఖైదీ` సినిమాతో బిగ్ బ్రేక్ అందుకుని స్టార్గా ఎదిగారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇలా `హీరో`, `దొంగ`, `ఛాలెంజ్`, `విజేత`, `కొండవీటి రాజా, `వేట`, `చంటబ్బాయి`, `ఆరాధన`, `పసివాడి ప్రాణం`, `స్వయంకృషి`, `రుద్రవీణ`,
`యమడుకి మొగుడు`, `ఖైదీ నెంబర్ 786`, `స్టేట్ రౌడీ`, `జగదేక వీరుడు అతిలోక సుందరి`, `గ్యాంగ్ లీడర్`, `రౌడీ అల్లుడు`, `ఘారానా మొగుడు`, `ఆపద్భాంధవుడు`, `ముఠా మేస్త్రీ`, `మెకానిక్ అల్లుడు`, `అల్లుడా మజాకా`, `
హిట్లర్`, `మాస్టర్`, `చూడాలని వుంది`, `స్నేహం కోసం`, `ఇంద్ర`, `ఠాగూర్`, `శంకర్దాదా ఎంబీబీఎస్`, `స్టాలిన్` చిత్రాలతో విజయాలు అందుకుని తిరుగులేని మెగాస్టార్గా ఎదిగారు చిరంజీవి.
1990 తర్వాత చిరంజీవి కెరీర్ మారిపోయింది. బిగ్ టర్న్ తీసుకుంది. హీరోగా, కెరీర్ పరంగా పీక్ని చూశారు చిరు. బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో మెగాస్టార్ అనిపించుకున్నారు.
`ఇంద్ర`, `ఠాగూర్` తర్వాత ఆయన టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్గా నిలిచారు. ఇండస్ట్రీని శాసించారు. అప్పట్నుంచి అదే క్రేజ్ని, ఇమేజ్ని క్యారీ చేస్తున్నారు. రాజకీయాల్లోకి వెళ్లి వచ్చాక కూడా ఆయన క్రేజ్ తగ్గలేదు.
`ఖైదీ నెంబర్ 150`, వాల్తేర్ వీరయ్య`లతో తానేంటో నిరూపించారు. ఇప్పుడు సోషియో ఫాంటసీ మూవీ `విశ్వంభర`లో నటిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.
దీంతోపాటు అనిల్ రావిపూడితో ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ చేస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. వచ్చే సంక్రాంతికి ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.