
`ఆర్ఆర్ఆర్` సినిమా ఇప్పుడు ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. ఈ చిత్రానికి మించిన సినిమా ఇప్పుడు ఇండియాలో లేదంటే అతిశయోక్తి లేదు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ కలిసి నటిస్తుండటంతో సినిమాపై అన్ని భాషల్లోనూ అంచనాలు నెలకొన్నాయి. అలియాభట్, అజయ్ దేవగన్, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను మరింతగా పెంచింది. జనవరి 7న సినిమా ప్రపంచ వ్యాప్తంగా పదికిపైగా భాషల్లో ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేయబోతున్నారు.
దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్తో రూపొందిన సినిమా కావడంతో కరోనా కష్టకాలంలో వాటిని తిరిగి రాబట్టడమనేది పెద్ద ఛాలెంట్గా మారింది. దీంతో రాజమౌళి పక్కా ప్లాన్తో ముందుకు సాగుతుంది. అతిపెద్ద మార్కెట్ అయిన బాలీవుడ్ టార్గెట్ చేశారు. గత వారం రోజులపాటు ముంబయిలో `ఆర్ఆర్ఆర్` ప్రమోషన్లో బిజీగా గడిపారు రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, అలియాభట్. జాతీయ మీడియాలో బ్యాక్ టూ బ్యాక్ ప్రమోషన్ చేసి సినిమాపై హైప్ని మరింత పెంచడంతోపాటు హిందీ ఆడియెన్స్ లోకి సినిమాని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ముంబయిలో నిర్వహించిన `ఆర్ఆర్ఆర్` ఈవెంట్లోనూ తమ సత్తాని చాటి సినిమా స్థాయిని హిందీ ఆడియెన్స్ కి తెలియజేసే ప్రయత్నం చేశారు.
ఇప్పుడు సౌత్లో ప్రమోషన్ షురూ చేసింది జక్కన్న టీమ్. ఇటీవల తెలుగులో ఓ ప్రెస్మీట్ నిర్వహించాలని ప్లాన్ చేశారు. ప్రమోషన్కి సంబంధించిన కీలక అప్డేట్లు వెల్లడించాలని భావించారు. కానీ ఊహించని షాక్ తగిలింది `ఆర్ఆర్ఆర్` టీమ్కి. తెలంగాణ సర్కార్ ఈ షాక్ ఇవ్వడం విశేషం. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్ల విషయంలో పెద్ద షాకిచ్చింది. ఆ విషయంలో తెలంగాణ గుడ్ న్యూస్ చెప్పగా, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో ఓ రకంగా షాకిచ్చిందని టాక్.
హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో `ఆర్ఆర్ఆర్` ఈవెంట్గాని భారీగా నిర్వహించాలని రాజమౌళి భావించారు. పర్మిషన్ కోసం తెలంగాణ ప్రభుత్వానికి, పోలీస్ శాఖకి రిక్వెస్ట్ చేసుకోగా, అనుమతి నిరాకరించిందని సమాచారం. కోవిడ్ కేసులు, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం, హైకోర్ట్ కొన్ని ఆంక్షలు విధించడం వంటి కారణాలతో `ఆర్ఆర్ఆర్` ఈవెంట్కి పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తుంది. గత శనివారం నుంచి జనవరి 2 వరకు బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించకూడదని తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో అప్పటి వరకు `ఆర్ఆర్ఆర్`కి పర్మిషన్ లభించకపోవచ్చనే టాక్ వినిపిస్తుంది. ఇది ఓ రకంగా ఈ సినిమాకి పెద్ద షాకింగ్ విషయమనే చెప్పాలి. అయితే ఇందులో రాజకీయ కోణం కూడా ఉందనే కామెంట్ కూడా వినిపిస్తుంది.
ఏదేమైనా ఇప్పట్లో `ఆర్ఆర్ఆర్`కి పర్మిషన్ దక్కడం కష్టమనే చెప్పాలి. ఒకవేళ ఇవ్వాలనుకుంటే జనవరి 3 నుంచి అనుమతి ఇచ్చే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు కరోనా కేసులు, ఒమిక్రాన్ కేసులు ఎలా ఉంటాయనేది మరో ఆందోళన కలిగించే అంశంగా ఉంది. ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో భారీ ఈవెంట్కి పర్మిషన్ దక్కడం కష్టమే అనే టాక్ వస్తుంది. ఒకవేళ పర్మిషన్ ఇచ్చినా లిమిటెడ్ క్రౌడ్తో కూడిన అనుమతి దక్కే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే `ఆర్ఆర్ఆర్` పెద్ద షాక్ మాత్రమే కాదు, నష్టం కూడా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంత భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తూ సరైన ఈవెంట్ లేకపోతే అది ఇద్దరు హీరోల అభిమానులను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తుందని అంటున్నారు.
మరి ఈ విషయంలో `ఆర్ఆర్ఆర్` టీమ్ ఎలాంటి ప్లానింగ్తో ముందుకెళ్తుందో చూడాలి. కానీ ఇప్పుడైతే `ఆర్ఆర్ఆర్` యూనిట్లో ఓ రకమైన ఆందోళన నెలకొందని టాక్. అయితే ఈ విషయంలో ప్రభాస్ `రాధేశ్యామ్` టీమ్ సేఫ్లో ఉన్నారు. ఎందుకంటే `రాధేశ్యామ్` సినిమాకి సంబంధించి గత గురువారం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీగా ఈవెంట్ని నిర్వహించారు. ఇందులో దాదాపు నలభై వేల మంది అభిమానులు పాల్గొన్నట్టు టాక్. దీంతో ఇక ఎన్ని కోవిడ్ ఆంక్షలున్నా.. ఈవెంట్ల పరంగా `రాధేశ్యామ్`కి పెద్దగా వచ్చే నష్టం ఏం లేదంటున్నారు. అయితే `రాధేశ్యామ్` మరో ఈవెంట్ కూడా నిర్వహించాలనే ప్లానింగ్లోనూ ఉన్నారని సమాచారం.
ఇదిలా ఉంటే ఈ రెండు చిత్రాలకు ఏపీలో పెద్ద దెబ్బ పడే ఛాన్స్ ఉంది. ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లు తగ్గించడంతో థియేటర్ నిర్వాహణ కష్టమవుతుందని, తాము థియేటర్లని ఈ రేట్లకి రన్ చేయలేమని ఎగ్జిబిటర్లు వాపోతున్నారు. ఇప్పటికే చాలా థియేటర్లు స్వచ్ఛంధంగా మూసేస్తున్నారు. మరోవైపు అనుమతులు, సౌకర్యాల సాకుతో ఏపీ ప్రభుత్వం కూడా థియేటర్లని సీజ్ చేస్తుంది. దీంతో ఇప్పుడు అక్కడ ఏకంగా 175 థియేటర్ల వరకు మూతబడినట్టు సమాచారం. ఇది `ఆర్ఆర్ఆర్`, `రాధేశ్యామ్` చిత్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.