
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులను ఆకట్టుకుంటుంది. అదే సమయంలో ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఇందులో చిన్నారి చేత ఓ నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుంది. అదిప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలోకి తలమానికంగా మారింది. ఎన్నో వందల సినిమాల షూటింగ్లకు, పోస్ట్ ప్రొడక్షన్స్ కి, ఫిల్మ్ ఇనిస్ట్యిటూట్కి కేరాఫ్గా నిలిచింది. మరి అది ఏంటి? ఇందులో ఉన్న ఆ చిన్నారి ఎవరు అనేది తెలుసుకుందాం.
ఈ ఫోటో.. సరిగ్గా యాభై ఏళ్ల క్రితం నాటిది. ఆగస్ట్ 13న 1975లో తీసిన ఫోటో. ఆ సమయంలో అన్నపూర్ణ స్టూడియోకి శంకుస్థాపన చేశారు అక్కినేని నాగేశ్వరరావు. అప్పుడు మద్రాస్ నుంచి చిత్ర పరిశ్రమ హైదరాబాద్కి తరలి వస్తోన్న రోజులు. మన వద్ద స్టూడియోలు లేవు. శారధి స్టూడియో ఉంది. కానీ దానికి పోటీ ఎక్కువ. దీంతో అన్నపూర్ణ స్టూడియోకి పునాది వేశారు ఏఎన్నార్. హైదరాబాద్ కేంద్రంగా తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని భావించి ఆయన ఈ స్టూడియో నిర్మించారు. ఇప్పుడది టాలీవుడ్కి చాలా ముఖ్యమైన స్టూడియోగా మారింది. హైదరాబాద్లో టాలీవుడ్ అభివృద్ధి చెందడంలో ఈ స్టూడియో పాత్ర కీలకంగా ఉంది. ఇందులో ఎన్నో వందల, వేల సినిమాలు చిత్రీకరణ ప్రారంభించుకున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటున్నాయి.
అయితే పైన చూసిన ఫోటోలో ఉన్నది ఏఎన్నార్ భార్య అన్నపూర్ణమ్మ. ఆమె చేతిలో ఉన్న చిన్నారి ఎవరో కాదు హీరో సుమంత్. నిలబడి ఉన్న వ్యక్తి నాగార్జున అన్నయ్య వెంకట్. ఇందులో నాగ్ కనిపించలేదు. ఇక భార్య అన్నపూర్ణమ్మ పేరుతోనే ఈ స్టూడియోని స్థాపించారు అక్కినేని. తాజాగా ఇది యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో నిర్వాహకులు, ఎంప్లాయిస్ తమ ఆనందాన్ని పంచుకున్నారు.
ఇక అన్నపూర్ణ స్టూడియో నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సుమంత్ హీరోగా పరిచయమై స్టార్గా ఎదిగిన విషయం తెలిసిందే. ఆయన ఏఎన్నార్ కూతురు సత్యవతి అక్కినేని, సురేంద్ర యార్లగడ్డల తనయుడు. అక్కినేని మనవడు. ఆయన అక్కినేని వద్దనే పెరిగి పెద్దవాడయ్యాడు. హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 1999లో `ప్రేమ కథ` చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు సుమంత్. `యువకుడు`, `పెళ్లి సంబంధం`, `రామ్మా చిలకమ్మా`, `స్నేహమంటే ఇదేరా` చిత్రాలతో ఆకట్టుకున్నారు. `సత్యం`తో పెద్ద బ్రేక్ అందుకున్నారు.
`గౌరీ`, `ధన 51`లతో మాస్ ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. `మహానంది`, `గోదావరి` వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుని స్టార్గా ఎదిగారు. `చిన్నోడు`, `క్లాస్ మేట్స్`, `మధుమాసం`, `పౌరుడు`,`బోనీ`, `గోల్కొండ హై స్కూల్` చిత్రాలు ఆదరణ పొందాయి. ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు ఆడలేదు. మధ్యలో `మళ్లీరావా` ఫర్వాలేదనిపించుకుంది. కానీ ఆ తర్వాత ఆయన సినిమాలు ఆడలేదు. దీంతో క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన హీరో రెండు మూడు సినిమాలున్నాయి. అదే సమయంలో అన్నపూర్ణ స్టూడియోలోనూ భాగస్వామ్యముంది. ఈ క్రమంలో సుమంత్ వందల కోట్లకు వారసుడని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అన్నపూర్ణస్టూడియోకి ఆగస్ట్ 13 1975లో శంకుస్థాపన జరగ్గా, 1976 జనవరి 14న అప్పటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అధికారికంగా ప్రారంభించారు. అప్పటి నుండి స్టూడియో క్రమంగా అభివృద్ధి చెందుతూనే ఉంది. నేడు ఇది ప్రపంచ స్థాయి పోస్ట్-ప్రొడక్షన్ సౌకర్యాలను కలిగి ఉంది. యంగ్ టాలెంట్ని ప్రొత్సహిస్తూ అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాను స్థాపించింది. ఇది నటన నుండి దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్ డిజైన్ వరకు ట్రైన్ ఇస్తున్నారు.