
సహజమైన నటనకు, అందానికి కేరాఫ్ సౌందర్య. ఆమెని చూస్తే తెలుగు సాంప్రదాయం ఉట్టిపడుతుంది. సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. కానీ అందులోనూ ట్రెడిషనల్ లుక్లో కనిపిస్తూ మెప్పించింది సౌందర్య. అందం ఎక్స్ పోజింగ్లో కాదు మన తీరులో ఉంటుందని నిరూపించింది. అసలైన అందానికి కొత్త నిర్వచనం చెప్పింది. చీరలో ఎక్కువగా కనిపించి ఆ చీరకే అందాన్ని తీసుకొచ్చింది. తెలుగు, తమిళం, కన్నడలో టాప్ హీరోలందరితోనూ కలిసి నటించి మెప్పించింది. స్టార్ హీరోయిన్గా రాణించిన సౌందర్య 31ఏళ్ల వయసులోనే, చిన్న ఏజ్లోనే కన్నుమూయడం అత్యంత బాధాకరం.
సౌందర్య మరణం అత్యంత విషాదకరం. ఆమె హెలికాఫ్టర్ ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. 2004 ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లి వస్తూ ఆమె ఏప్రిల్ 17న ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో తన సోదరుడిని కూడా కోల్పోయింది సౌందర్య. ఆమె మరణం తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు, యావత్ భారతీయ సినిమాకి తీరని లోటుగా చెప్పొచ్చు. ఆ లోటు ఇప్పటికీ కనిపిస్తోంది. ఆమె మరణించి 21 ఏళ్లు పూర్తయినా తన సినిమాలతో మన ముందు కనిపిస్తూనే ఉంది. మన మధ్యలోనే ఉందనిపిస్తోంది. సౌందర్య ఎవర్ గ్రీన్ స్టార్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.అయితే ఇప్పుడు కూడా ఆమె బతికే ఉంటే, ఆమె వైభవాన్ని ఇప్పటితరం కూడా ఆస్వాధించేవారని, ఇంకా ఆడియెన్స్ ని అలరిస్తూనే ఉండేదని చెప్పొచ్చు.
అయితే సౌందర్య మరణానికి కారణం మోహన్ బాబు అంటుంటారు. ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఆమె ఆస్తులను మోహన్ బాబు లాక్కున్నాడంటూ ఆ మధ్య ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవి ఆధారాలు లేని, కోర్ట్ లో నిలవలేని కేసులుగా, ఆరోపణలుగా చెప్పొచ్చు. కానీ సౌందర్య నటించిన చివరి సినిమా దర్శకుడు ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. మోహన్ బాబు ఆ మిస్టేక్ చేయకపోతే నిజంగానే సౌందర్య మన మధ్య ఉండేదన్నారు.
సౌందర్య తెలుగులో చివరగా `శివ శంకర్` అనే చిత్రంలో నటించారు. ఇందులో మోహన్ బాబు హీరో. దీనికి కాపుగంటి రాజేంద్ర దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే సౌందర్య పర్మిషన్ తీసుకుని ఎన్నికల ప్రచారానికి వెళ్లింది. వెళ్లి వస్తూ ఈ ప్రమాదానికి గురయ్యింది. మోహన్ బాబు కారణంగానే సౌందర్య మనకు లేకుండా పోయిందని సంచలన కామెంట్ చేశారు దర్శకుడు రాజేంద్ర. ఆయన చేసిన మిస్టేక్ సౌందర్య కొంప ముంచిందన్నారు.
`శివ శంకర్` సినిమాకి నిర్మాత మోహన్ బాబు. ఆయన సౌందర్యకి పర్మిషన్ ఇవ్వకపోయి ఉంటే ఇప్పుడు ఆమె మన ముందు బతికి ఉండేదని తెలిపారు. `షూటింగ్ సమయంలో నిర్మాత మోహన్బాబు ఎవరికీ సెలవిచ్చేవారు కాదు. ఎన్నికల ప్రచారం ఉండటంతో సౌందర్యకి మాత్రం సెలవిచ్చారు. ఒకవేళ ఆయన అనుమతి నిరాకరించి ఉంటే ఆమె బతికేవారేమో. సౌందర్య మరణం కారణంగా సినిమా సరిగా తీయక పరాజయం చెందింది` అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు రాజేంద్ర. ఆయన కామెంట్స్ వైరల్ అవుతుండటం విశేషం.
సౌందర్య తెలుగులోకి `మనవరాలి పెళ్లి` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. 1993లో ఇది విడుదలైంది. ఆ తర్వాత `రాజేంద్రుడు గజేంద్రుడు`, `మాయలోడు` చిత్రాలతో విజయాలు అందుకుంది. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా `నంబర్ వన్`, `హలో బ్రదర్`, `అల్లరి ప్రేమికుడు`, `సూపర్ పోలీస్`, `మావూరి మారాజు`, `మేడం`, `టాప్ హీరో`, `అమ్మదొంగ`, `చిలకపచ్చ కాపురం`, `రాజాసింహం`, `పెదరాయుడు`, `భలే బుల్లోడు`, `అమ్మోరు`, `రిక్షావోడు`, `ఇంట్లో ఇళ్లాలు వంటింట్లో ప్రియురాలు`, `పవిత్రబంధం`, `దొంగాట`, `పెళ్లి చేసుకుందాం`, `ప్రియరాగాలు`, `ఆరో ప్రాణం`, `తారక రాముడు`, `పెళ్లి పీఠలు`, `రాయుడు` వంటి సినిమాలు చేసింది.
వీటితోపాటు `చూడాలనివుంది`, `శ్రీరాములయ్య`, `సూర్యుడు`, `అంతఃపురం`, `రాజా`, `ప్రేమకు వేళయేరా`, `అనగనగా ఒక అమ్మాయి`, `అన్నయ్య`, `రవన్నా`, `పోస్ట్ మ్యాన్`, `మూడు ముక్కలాట`, `నిన్నే ప్రేమిస్తా`, `అజాడ్`, `జయం మనదేరా`, `దేవీపుత్రుడు`, `ఎదురులేని మనిషి`, `అధిపతి`, `కొండవీటి సింహాసనం`, `సీతయ్య`, `స్వేతనాగు` వంటి చిత్రాలతో విజయాలు అందుకుంది. తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. వీటిలో కొన్ని సినిమాలు ఆడకపోయినా నటిగా సౌందర్య ఎప్పుడూ ఫెయిల్ కాలేదు.