Sobhita Dhulipala: సాధారణంగా సినిమా వాళ్లు పొలిటికల్ కామెంట్స్ చేయడానికి ఇష్టపడరు. వారి కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందని ఆలోచిస్తారు. కానీ రిసెంట్ గా అక్కినేనివారి కోడలు శోభిత చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే?
ప్రముఖ నటి, అక్కినేని నాగచైతన్య సతిమణి శోభితా ధూళిపాళ ఇటీవల తన పొలిటికల్ ఐడియాలజీపై చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్గా మారాయి. తనకు వామపక్ష భావజాలంపై బలమైన నమ్మకం ఉందని, భవిష్యత్తులో కమ్యూనిజమే విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేయడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
24
శోభితకు సపోర్ట్ గా ఒక వర్గం ప్రేక్షకులు
సాధారణంగా చిత్ర పరిశ్రమకు చెందిన తారలు తమ కెరీర్కు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని రాజకీయ అభిప్రాయాలను బహిరంగంగా పంచుకోవడానికి వెనుకాడుతుంటారు. కానీ శోభితా ఎటువంటి సంకోచం లేకుండా తన అభిప్రాయాన్ని నిర్భయంగా వెల్లడించడం పట్ల ఒక వర్గం నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కమ్యునిజం ఇష్టపడే వారు ఆమె మాటలకు సపోర్ట్ చేస్తున్నారు. ఆమె నిజాయితీని, భావ ప్రకటన స్వేచ్ఛను అభినందిస్తున్నారు.
34
సోషల్ మీడియాలో విమర్శలు..
మరోవైపు, ఈ వ్యాఖ్యలపై కొంత మంది నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. గ్లామర్ రంగంలో ఉంటూ, అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి కమ్యూనిజం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నేటి ఆధునిక సమాజంలో ఇటువంటి సిద్ధాంతాలు ఆచరణకు ఎంతవరకు సాధ్యమంటూ ప్రశ్నిస్తున్నారు. అనుభవిస్తున్న లగ్జరీ లైఫ్స్టైల్కు, చెప్తున్న సిద్ధాంతాలకు పొంతన లేదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
సినిమా కెరీర్ విషయానికి వస్తే, నాగచైతన్యతో వివాహం తర్వాత కొద్దిరోజులు నటనకు విరామం ఇచ్చిన శోభితా.. ఆ తర్వాత మళ్లీ వరుస ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. ఇటీవల 'చీకటిలో', 'క్రాస్ రోడ్స్' వంటి వైవిధ్యమైన ప్రాజెక్టులతో డిజిటల్ ప్లాట్ఫామ్లపై ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె 'సిల్ బట్టా', 'వెట్టువం' వంటి వినూత్న కథాంశాలతో తెరకెక్కుతున్న చిత్రాల్లో నటిస్తూ నటిగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.