జానీ మాస్టర్ వివాదం: ఊహించని ట్విస్ట్,సుకుమార్ పేరు చెప్పాడే

First Published Sep 27, 2024, 5:12 PM IST

 ఈ కేసులో చాలా  విషయాలు డైరెక్టర్ సుకుమార్‌కు తెలుసంటూ జానీ మాస్టర్ వెల్లడించడంతో.. మరో మలుపు తిరిగినట్లైంది. 

Jani Master


స్టార్  కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారాన్ని రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఉదంతంపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు.  సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసు బృందం గోవాలోని లాడ్జిలో అతడిని అదుపులోకి తీసుకుంది.

అక్కడి కోర్టులో హాజరు పరిచి నగరానికి తీసుచ్చారు. నేరుగా ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్‌ను హాజరుపరిచి  పోలీసుల కస్టడీ విచారణ  చేస్తున్నారు. ఈ విచారణలో జానీ మాస్టర్ షాకింగ్ విషయాలను బయటపెట్టారని సమాచారం.

Jani Master


అలాగే ఈ కేసులో చాలా  విషయాలు డైరెక్టర్ సుకుమార్‌కు తెలుసంటూ జానీ మాస్టర్ వెల్లడించడంతో.. కేసు మరో మలుపు తిరిగినట్లైంది. మూడో రోజు జానీ మాస్టర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలు స్టేట్‌మెంట్‌ను ముందు ఉంచి జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు విచారించారు. అయితే పోలీసుల విచారణలో బాధితురాలే తనను వేధించిందని జానీ మాస్టర్ చెప్పినట్లు సమాచారం.

Latest Videos


Jani Master


మీడియా కథనాల మేరకు....  పోలీసుల విచారణలో జానీ మాస్టర్ ఏం చెప్పారంటే.. ‘‘నాపై బాధితురాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి. ఢీ షో ద్వారా తనకు తానే పరిచయం చేసుకుంది. మైనర్‌గా ఉన్న సమయంలో లైంగిక దాడి చేశాననేది అబద్ధం. తన టాలెంట్‌ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చాను. తనని పెళ్లి చేసుకోవాలని బాధితురాలు మానసికంగా హింసించేది... ఎన్నోసార్లు నాపై ఆమె బెదిరింపులకు దిగింది. 


నేను పడుతున్న ఇబ్బందిని డైరెక్టర్ సుకుమార్‌ (Director Sukumar) దృష్టికి కూడా తీసుకెళ్ళాను. సుకుమార్ పిలిచి మాట్లాడినా కూడా బాధితురాలిలో మార్పు రాలేదు. నాపై కుట్ర జరిగింది, వెనుక ఉండి ఎవరో నాపై కుట్ర చేశారు. నా ఎదుగుదలను ఓర్వలేకనే ఈ కేసులో నన్ను ఇరికించారు’’ అని జానీ మాస్టర్ విచారణలో పోలీసులకు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. 


ఇదిలా ఉండగా తన  భర్తను కలవడానికి జానీ మాస్టర్ భార్య నార్సింగి పోలీస్ స్టేషన్‌‌కు వచ్చారు. ఈ కేసులో నాలుగు రోజుల పాటు జానీమాస్టర్‌ను పోలీస్ కస్టడీకి రంగారెడ్డి కోర్టు అనుమతించింది. ఇప్పటికే మూడు రోజుల పాటు జానీమాస్టర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించగా.. రేపటి (శనివారం)తో జానీ మాస్టర్ కస్టడీ విచారణ ముగియనుంది. రేపు ఉదయం జానీ మాస్టర్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. 

Jani Master


బాధితురాలు ఇచ్చిన రిపోర్ట్ లో ఏముందంటే..

‘‘2017లో జానీ మాస్టర్‌ పరిచయమయ్యాడు. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరాను. ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్‌తో పాటు నేను, మరో ఇద్దరు సహాయకులం వెళ్లాం. అక్కడ హోటల్‌లో నాపై జానీ మాస్టర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పనిచేయలేవని బెదిరించాడు. దీన్ని అవకాశంగా తీసుకుని.. హైదరాబాద్‌ నుంచి ఇతర నగరాలకు సినిమా షూటింగ్ కు తీసుకెళ్లిన సందర్భాల్లో అనేకమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్‌ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్‌లో అసభ్యంగా ప్రవర్తించేవాడు.

Jani Master

లైంగిక వాంఛ తీర్చనందుకు ఒకసారి జుట్టు పట్టుకుని తలను అద్దానికి కొట్టాడు. మతం మారి.. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. వేధింపులు భరించలేక జానీ మాస్టర్‌ టీమ్ నుంచి బయటకొచ్చేశాను. అయినా సొంతంగా పనిచేసుకోనివ్వకుండా, ఇతర ప్రాజెక్టులు రాకుండా ఇబ్బందిపెట్టాడు. ఆగస్టు 28న మా ఇంటి గుమ్మానికి గుర్తుతెలియని వ్యక్తులు ఓ పార్సిల్‌ వేలాడదీశారు. ‘మగబిడ్డకు అభినందనలు. కానీ జాగ్రత్తగా ఉండు’ అని అందులో రాసి ఉంది’’ అని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.

Jani Master

 ఈ నేపధ్యంలో  జానీ మాస్టర్ కేసుపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలని కోరుతున్నారు. మరో ప్రక్క సోషల్ మీడియా ఈ విషయమై చర్చలు చేస్తూ కామెంట్స్ పాస్ చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే తెలుగు సోషల్ మీడియా ఇప్పుడు రెండుగా ఈ ఇష్యూ విషయంలో విడిపోయిందనే చెప్పాలి. యూట్యూబ్ ఛానెల్స్ సంగతి అయితే చెప్పక్కర్లేదు. 

click me!