
సీనియర్ సినీ నటుడు శరత్ బాబు కొద్ది సేపటి క్రితం హైదరాబాదులో ప్రైవేట్ హాస్పిటల్ లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన గురించిన విశేషాలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన కుటుంబ నేపధ్యం గురించి తెలుసుకుంటున్నారు.
శరత్ బాబు.. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస లో జన్మించారు. ఆయన అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. శరత్ బాబు కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి ఆమదాలవలసకు 1950 ప్రాంతంలో తరలివచ్చింది. శరత్ బాబుకు ఏడుగురు అన్నదమ్ములు, ఆరుగురు అక్క చెల్లెలు ఉన్నారు. అన్నదమ్ముల్లో శరత్ బాబు మూడో వారు.
సత్యన్నారాయణ దీక్షితులుగా పిలుచుకునే శరత్ బాబును ఆయన కుటుంబకులు సత్యం బాబుగా పిలుస్తారు. అయితే సినిమాల్లో మాత్రం తన పేరుని శరత్ బాబుగా మార్చుకున్నారు. తన కుటుంబ నేపధ్యంలో, తన కులం ఏమిటో అందరికీ తెలియాల్సిన అవసరం లేదని శరత్ బాబుగా మార్చుకున్నాడంటారు. అలాగే ఆయనకు బెంగాళి రచయిత శరత్ బాబు రచనలు ఇష్టం అని, అందుకే పేరు అలా పెట్టుకున్నారని చెప్పుకుంటారు. ఏది నిజం అనేది ఎప్పుడూ బయిటకు రాలేదు.
తండ్రి బిజినెస్ మ్యాన్. ఇక శరత్ బాబుకు పోలీస్ కావాలి అనేది కోరిక. అయితే.. సైట్ ప్రాబ్లెమ్తో ఈయన పోలీస్ కాలేకపోయాడు. కానీ ఎన్నో సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ వేషాలతో ఆ కోరిక తీర్చుకున్నారు. తాను కోరకున్న పోలీస్ ఉద్యోగం రాకపోవడంతో తండ్రి నుంచి వచ్చిన బిజినెస్లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే అక్కడా నిలదొక్కుకోలేదు. నటుడు అయ్యారు. 1973లో విడుదలైన ‘రామరాజ్యం’ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టారు. సైట్ ప్లాబ్లం లేకపోతే చక్కగా పోలీస్ గా రిటైర్ అవుదును అనేవారు సరదాగా.
శరత్ బాబు నటించిన తొలి చిత్రం రామ రాజ్యం.అయితే ఈ మూవీ బాక్సాఫీసు దగ్గర సరైన ఫలితం రాబట్టలేకపోయింది.అయితే శరత్ బాబును ఓ సారి చూసిన దర్శకుడు కె. బాలచందర్.ఇతనికి అవకాశం ఇవ్వాలి అనుకున్నాడు.దాంతో ఈ గ్రేట్ డైరెక్టర్ దర్శకత్వంలో ‘పట్టిన ప్రవేశమ్’ అనే మూవీలో నటించే అవకాశం దక్కించుకున్నాడు.
అలాగే సీతాకోక చిలక చిత్రంలో హీరోయిన్ అన్న పాత్రలో కనిపించాడు. విలన్ ఛాయలున్న క్యారెక్టర్ అది. భారతీరాజ దర్శకత్వంలో 1981 లో రిలీజ్ అయిన ఈ మూవీలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నంది అవార్డు అందుకున్నాడు. సంసారం ఒక చదరంగం వంటి సినిమాల్లో విభిన్నమైన పాత్రలో మెప్పించిన ఘనత శరత్ బాబుకే దక్కుతోంది.
తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 250కి పైగా సినిమాలలో నటించారు. ఆయన నటించిన సినిమాలు అనేకం విజయవంతమయ్యాయి. సాగర సంగమం, స్వాతిముత్యం, గుప్పెడు మనసు, అభినందన, నోము, యమ కింకరుడు, అమరజీవి ఇలా అనేక సినిమాల్లో నటించారు. ఆయన చివరిసారిగా వకీల్ సాబ్ సినిమాలో నటించారు.
లెజెండరీ డైరెక్టర్ కే బాలచందర్ తెరకెక్కించిన గుప్పెడు మనసు మూవీతో శరత్ బాబు వెలుగులోకి వచ్చారు. హీరోగానే కాకుండా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు పాత్రలతో అలరించారు. సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరపైనా మంచి పాత్రలు పోషించారాయన. ఈటీవీ అంతరంగాలు, జనని, అగ్నిగుండాలు సీరియల్స్తో బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు.
శరత్ బాబు దాదాపు రెండు నెలలుగా అనారోగ్యంతో బెంగుళూరు, ఆ తర్వాత హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వస్తున్న శరత్ బాబు మృత్యువుతో పోరాడుతున్నారు. ఆయన రికవరీ అయ్యి వస్తారనే అందరూ అనుకున్నారు. కానీ చివరకు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో మృతిచెందారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు.