
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన తాజా మూవీ `ది గర్ల్ ఫ్రెండ్`. దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. రష్మిక మందన్నా నటించిన తొలి లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. ఇంటెన్స్ లవ్ స్టోరీగా రూపొందింది. అమ్మాయిలకు సంబంధించి ఒక కీలకమైన అంశాన్ని ఇందులో చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. మరో రెండు రోజుల్లో ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ నెల 7న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమా హీరోయిన్ పాత్ర ప్రధానంగా సాగుతుంది. రష్మిక మందన్నా మాత్రం ఇరగదీసిందట. ఆమె అద్బుతమైన నటన సినిమాకి పెద్ద అసెట్ అవుతుందని టీమ్ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు దర్శకుడు రాహుల్ రవీంద్రన్. రష్మిక మందన్నా కంటే ముందే ఈ చిత్రంలో మరో హీరోయిన్ ని అనుకున్నారట. ఆమె ఎవరో కాదు సమంత. నిజానికి రాహుల్ రవీంద్రన్, సమంత మంచి స్నేహితులు. రాహుల్ భార్య, సింగర్ చిన్మయి కూడా సమంతకి చాలా క్లోజ్. సమంతకి ప్రారంభం నుంచి డబ్బింగ్ చెప్పేది చిన్మయినే కావడం విశేషం.
సమంతతో ఉన్న ఆ పరిచయం, స్నేహంతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ మూవీ స్టోరీని మొదట సమంతకి చెప్పారట. స్టోరీని ఆమెకి పంపించగా, స్క్రిప్ట్ చదివి ఇది తనకు సెట్ కాదని సమంత చెప్పిందట. తన ఏజ్కి సరిపడే కథ కాదని, యంగ్ అమ్మాయి, పెళ్లి కాని అమ్మాయి అయితే బాగుంటుందని చెప్పిందట. అంతేకాదు ఈ స్క్రిప్ట్ కి రష్మిక మందన్నా అయితే బాగా సూట్ అవుతుందని కూడా సజెస్ట్ చేసిందట. దీంతో సామ్ సలహా మేరకు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ కథని నేషనల్ క్రష్కి చెప్పారట. ఆమెకి స్క్రిప్ట్ ని పంపించగా, వారం పది రోజులు టైమ్ అడిగారట. కానీ చదివిన వెంటనే కాల్ చేసిందట. రెండు రోజుల్లోనే ఈ స్క్రిప్ట్ బాగా నచ్చింది, ఈ మూవీ మనం చేస్తున్నామని రష్మిక చెప్పిందట. అలా ఈ మూవీ పట్టాలెక్కిందని తెలిపారు దర్శకుడు రాహుల్ రవీంద్రన్.
ఈ సందర్భంగా రష్మిక మందనే ఎందుకు అనేది చెబుతూ, తాను ఐదు వందల కోట్ల సినిమాలు చేయాలనుకోవడం లేదు. ఒక మంచి పాయింట్ని చెప్పాలనుకున్నాను. అది అందరికి కనెక్ట్ అయ్యే విషయం. రష్మికకి నేషనల్ వైడ్గా ఇమేజ్ ఉంది, ఆమె ద్వారా కథ చెబితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. పైగా అల్లు అరవింద్ లాంటి పెద్ద నిర్మాతలు ఉండటంతో ఈ మూవీకి రష్మికనే బెస్ట్ ఛాయిస్ అవుతుందని భావించాం. లక్కీగా ఆమెనే ఈ మూవీ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించింది. ఈ విషయంలో తాము రష్మికకి ధన్యవాదాలు తెలియజేస్తామని తెలిపారు రాహుల్ రవీంద్రన్. రష్మిక మందన్నా అద్భుతంగా చేసిందని, ఆమె తప్ప మరెవ్వరూ ఈ పాత్రకి న్యాయం చేయలేరు అనేంతగా ఆమె నటన ఉంటుందన్నారు. మొత్తంగా సమంత వల్ల రష్మిక `ది గర్ల్ ఫ్రెండ్` మూవీ చేసిందని చెప్పొచ్చు.
సమంత ప్రస్తుతం `మా ఇంటి బంగారం` అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ని స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని సామ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మయోసైటిస్ వ్యాధి తర్వాత ఆమె పూర్తి స్థాయిలో కోలుకున్నారు. ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఇంకోవైపు ప్రస్తుతం రష్మిక హిందీలో `కాక్ టైల్ 2` చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండతో రాహుల్ సాంక్రిత్యాన్ దర్శకత్వంలో మూవీ చేస్తోంది. అలాగే `మైసా` అనే మరో యాక్షన్ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది రష్మిక మందన్నా.