Puneeth Rajkumar Death:'యువరత్న'తో తెలుగు వారికి చేరువైన పునీత్.. ఆ స్టార్ హీరోలిద్దరూ నా స్నేహితులే అంటూ

First Published Oct 29, 2021, 2:58 PM IST

చిత్ర పరిశ్రమకు ఇది ఊహించని షాక్. సినీ ప్రముఖులు, అభిమానులు జీర్ణించుకోలేని విషయం. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నేడు గుండె పోటుతో ఆకస్మిక మరణం చెందారు.

చిత్ర పరిశ్రమకు ఇది ఊహించని షాక్. సినీ ప్రముఖులు, అభిమానులు జీర్ణించుకోలేని విషయం. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నేడు గుండె పోటుతో ఆకస్మిక మరణం చెందారు. కన్నడ చిత్ర పరిశ్రమలో 32 చిత్రాల్లో హీరోగా నటించిన పునీత్ రాజ్ కుమార్ అగ్ర నటుడిగా అభిమానుల్లో క్రేజ్ సొంతం చేసుకున్నారు. పునీత్ మరణ వార్తతో కర్ణాటకలో ఆయన అభిమానులు రోధిస్తున్నారు.

గురువారం ఉదయం 9.45 గంటలకు Puneeth Raj Kumar గుండె పోటుకు గురయ్యారు. దీనితో ఆయన్ని కుటుంబ సభ్యులు బెంగుళూరులోని రమణ శ్రీ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. తాజా సమాచారం మేరకు పునీత్ మరణించినట్లు తెలుస్తోంది. సెలెబ్రిటీలు కూడా పునీత్ మరణానికి సంతాపం తెలియజేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. 

తన నటన, డాన్సులతో పునీత్ అభిమానుల్లో చెరగని ముద్ర వేశారు. సౌమ్యుడిగా, వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తిగా పునీత్ గుర్తింపు తెచ్చుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ చివరగా నటించిన చిత్రం 'యువరత్న' తెలుగులో కూడా విడుదలై మంచి విజయం సాధించింది. తెలుగులో కూడా పునీత్ కి ఫాలోయింగ్ ప్రారంభమైంది ఈ చిత్రంతోనే. 

ఇక నుంచి తన చిత్రాలు కన్నడతో పాటు తెలుగులో కూడా విడుదల చేయాలనీ పునీత్ ప్లాన్ చేసుకుంటుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. పునీత్ రాజ్ కుమార్ కు తెలుగు హీరోలతో మంచి సాన్నిహిత్యం ఉంది. చాలామంది టాలీవుడ్ స్టార్ హీరోలు పునీత్ కు స్నేహితులు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీతో పునీత్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. 

యువరత్న చిత్రంలో ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ప్రస్తావన వస్తుంది.. దీనితో పునీత్ వాళ్లిద్దరూ నా స్నేహితులే అంటూ రాంచరణ్, ఎన్టీఆర్ గురించి చెబుతాడు. పునీత్ రాజ్ కుమార్ తండ్రి దివంగత లెజెండ్రీ నటుడు రాజ్ కుమార్ కు మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఇష్టమైన వ్యక్తి. పలు వేదికపై వీరిద్దరూ ప్రేమాభిమానాలు పంచుకొవడం చూశాం. దీనితో చిరు ఆయన తనయుడైన పునీత్ కు కూడా అంతే గౌరవం ఇస్తాడు. అలాగే రాజ్ కుమార్ కుటుంబానికి, నందమూరి కుటుంబానికి కూడా మంచి రిలేషన్ ఉంది. 

ఏది ఏమైనా ఎంతో భవిష్యత్తు ఉన్న పునీత్ రాజ్ కుమార్ ఇలా ఆకస్మికంగా మరణించడం జీర్ణించుకోలేని అంశం. కర్ణాటక ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. 

click me!