
పవన్ కళ్యాణ్ కి హిట్ పడితే, తన రేంజ్ మూవీ పడితే అది ఏ స్థాయిలో బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుందో `ఓజీ` మూవీ నిరూపించింది. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తోంది. మూడో వారంలో కూడా ఈ మూవీ ప్రభావం చూపించడం ఓ విశేషమైతే, ఓ వైపు థియేటర్లలో `కాంతార 2` సందడి చేస్తున్నా కూడా `ఓజీ` సినిమాకి ఆదరణ దక్కుతుండటం మరో విశేషంగా చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.310కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఇది అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లని రాబట్టిన సినిమాగా నిలిచి రికార్డు సృష్టించింది. ఈ ఏడాదికిగానూ ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలవడం విశేషం. ఇదే పవన్కి సాలిడ్ హిట్ పడితే అది ఏ స్థాయిలో కలెక్షన్లని రాబడుతుందో అని చెప్పడానికి నిదర్శనం.
ఆ మధ్య `ఓజీ` సక్సెస్ సెలబ్రేషన్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ `ఓజీ` యూనివర్స్ పై ఆసక్తిని చూపించారు. `ఓజీ` ప్రీక్వెల్, సీక్వెల్ చేసేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని, `ఓజీ` యూనివర్స్ కోసం అతృతగా ఉన్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే పవన్ ఓ విషయంపై క్లారిటీ ఇచ్చారు. `ఉస్తాద్ భగత్ సింగ్` తర్వాత సినిమాలు మానేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాను మున్ముందు కూడా సినిమాలు చేస్తాననే విషయాన్ని ఆయన కన్ఫమ్ చేశారు . అభిమానులు ఖుషీ అయ్యే వార్తని తెలిపారు. దీంతో త్వరలోనే `ఓజీ 2` ఉండబోతుందనే ఆశలు అభిమానుల్లో రేకెత్తాయి. పైగా `ఓజీ` మూవీకి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఏర్పడ్డారు. మూవీలో చాలా విషయాలను సస్పెన్స్ లో పెట్టారు. ప్రీక్వెల్, సీక్వెల్లో చాలా పెద్ద కథ ఉంది. ఓజాస్ గాంభీర గతానికి సంబంధించిన చాలా విషయాలు మిస్టరీగా చూపించారు దర్శకుడు సుజీత్. వాటి విషయంలో ఆడియెన్స్, పవన్ ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు. `ఓజీ 2` కోసం వెయిట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఒక షాకిచ్చే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. పవన్ కొత్త సినిమాకి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. పవన్ నెక్ట్స్ సురేందర్రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్నట్టు సమాచారం. ఇదే ఇప్పుడు క్రేజీగా మారింది. పవన్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ మూవీని గతంలోనే ప్రకటించారు. కరోనాకి ముందు ఈ సినిమాని అనుకున్నారు. అప్పటి నుంచి వాయిదా పడుతూ వచ్చింది. పవన్ పూర్తిగా రాజకీయాల్లో ఫోకస్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ పక్కకు వెళ్లింది. రీమేక్ మూవీస్ త్వరగా కంప్లీట్ అవుతాయని భావించి వరుసగా రీమేక్ చేస్తూ వచ్చారు. దీంతో స్ట్రెయిట్ సినిమాలను పక్కన పెట్టారు. రీమేక్ లు అయిపోవడంతో కమిట్ అయిన ఒరిజినల్ స్టోరీస్ చేసుకుంటూ వచ్చారు. ఆ మధ్య `హరి హర వీరమల్లు`తో ఆయన ఆడియెన్స్ ముందుకు వచ్చారు. కానీ సినిమా ఆడలేదు. ఇటీవల `ఓజీ`తో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఓజీ యూనివర్స్ చేసేందుకు ఆసక్తిని చూపించారు పవన్.
కానీ ఇప్పుడు గతంలో కమిట్ అయిన సురేందర్రెడ్డి మూవీ తెరపైకి వచ్చింది. పవన్ ముందుగా ఈ సినిమానే చేయబోతున్నారట. ఆయనకు ఏమాత్రం టైమ్ దొరికినా, సినిమాలు చేయాలనే ఆసక్తి ఉన్నా, చేయడానికి సాధ్యమైనా సురేందర్రెడ్డితో సినిమానే చేయనున్నట్టు పవన్ వర్గాలు తెలిపాయి. ఇది సురేందర్ రెడ్డి మార్క్ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతుందని, `కిక్`, `రేసుగుర్రం` తరహాలో సినిమా ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని రామ్ తల్లూరి తన ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించనున్నారు. రామ్ తల్లూరి.. పవన్ కళ్యాణ్కి మంచి స్నేహితుడు. అంతేకాదు జనసేన పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో పవన్ ముందు చేయాల్సి వస్తే, ముందుగా కమిట్ అయిన సురేందర్రెడ్డి సినిమానే చేయబోతున్నారట. దీంతో `ఓజీ` యూనివర్స్ ఇప్పట్లో రాబోదని టాక్. `ఓజీ 2` రావడానికి చాలా టైమ్ పడుతుంది. అసలు ఉంటుందా? లేదా అనేది కూడా చెప్పలేని పరిస్థితి ఉందని సమాచారం. పవన్ కి టైమ్ దొరకాలి, పరిస్థితులు అనుకూలించాలి, మంచి కథ కుదరాలి, ఇవన్నీ జరిగితేనే సినిమా వస్తుంది. పవన్ నెక్ట్స్ సినిమా చేస్తున్నారనేది అభిమానులను హ్యాపీ చేసే విషయమే అయినా, `ఓజీ2` మూవీ ఇప్పట్లో లేదనేది మాత్రం ఓజీ లవర్స్ కి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.
మరోవైపు పవన్ కళ్యాణ్తో ఓ సినిమా చేసేందుకు నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నారు. ఇది ప్రాథమిక దశలో ఉందని సమాచారం. మరి ఇది ఎంత వరకు ముందుకు వెళ్తుందనేది చూడాలి.
ఇదిలా ఉంటే దర్శకుడు సుజీత్ ఇప్పుడు నానితో సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ ప్రారంభమైంది. త్వరలోనే ఇది రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం నాని `పారడైజ్` చిత్రంలో నటిస్తున్నారు. శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ మూవీ తర్వాత సుజీత్ సినిమా ఉండబోతుందని చెప్పొచ్చు. సురేందర్ రెడ్డితో సినిమా అయిపోయిన తర్వాతనే `ఓజీ 2` ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి.