
అన్ స్టాపబుల్ సీజన్ 2 బాలయ్య(Balakrishna) సారథ్యంలో దూసుకుపోతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. బాలయ్య హోస్ట్ గా అదరగొడుతున్నారు. ఎంటర్టైనింగ్ గా నడిపిస్తున్నారు. ఇతర టాక్ షోలకు భిన్నంగా గెస్ట్స్ జీవితాల్లోని కాంట్రవర్సీలు తెరపైకి తేవడం ఆడియన్స్ ని ఆకర్షిస్తుంది. బాలయ్య షో అంటే డిప్లొమాటిక్, పాలిష్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తో సాగదనే నమ్మకం ఏర్పడింది. మనకు తెలియని కొత్త విషయాలు తెలుస్తాయనే విశ్వాసం ప్రేక్షకుల్లో ఏర్పడింది.
అయితే బావ చంద్రబాబు(Chandrababu)ను, అల్లుడు లోకేష్ లను షోకి ఆహ్వానించి అన్ స్టాపబుల్ షోని రాజకీయ వేదికగా మార్చేశాడు బాలయ్య. అలా అని ఎంటర్టైన్మెంట్ వదల్లేదు. చంద్రబాబులోని రొమాంటిక్ యాంగిల్ బయటకు లాగాడు. కాలేజీ రోజుల్లో నేనేమీ తక్కువ కాదు... రోడ్ సైడ్ రోమియో వేషాలు వేశానని బాబు స్వయంగా చెప్పి తన ఫ్యాన్స్ ని అలరించాడు.
ఇక చంద్రబాబును షోకి పిలవడం వెనుకున్న అసలు కారణం చర్చకు తెచ్చారు. ఆగస్టు సంక్షోభం జరిగి పాతికేళ్ళు దాటిపోయింది. చంద్రబాబు వెన్నుపోటు అపవాదు మోస్తూనే ఉన్నాడు. ఎన్నాళ్లీ జంజాటం ఎక్కడో ఓ చోట ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. అసలు మనమే మాట్లాడితే పోలా అనుకున్నారు. ఎన్టీఆర్ ని పదవీచ్యుతుడ్ని చేసిన ఘట్టం వెనుక ప్రజా ప్రయోజనమే కానీ, సొంత ఎజెండా, పదవీ వ్యామోహం లేవని చెప్పాలనుకున్నారు.
మొత్తంగా వెన్నుపోటు ఘట్టం బాలకృష్ణ అన్ స్టాపబుల్(Unstoppable) షోలో చర్చకు తెచ్చారు. తన జీవితంలో అతిపెద్ద నిర్ణయం ఆగస్టు సంక్షోభమని చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుకున్నాను, వినలేదు. అప్పుడు ఏం జరిగిందో నీకు కూడా తెలుసుగా అని, చంద్రబాబు బాలయ్యను వెన్నుపోటు పర్వంలో వాటాదారుణ్ని చేశారు. బాలయ్య అవునని ఒప్పుకున్నారు. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది అన్నారు. నేను చేసింది తప్పా? అని బాలకృష్ణను నేరుగా అడిగారు. రాష్ట్రం కోసం రాజకీయ చాణక్యం ప్రదర్శించాను, ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవలేదని చెప్పకనే చెప్పాడు. పరోక్షంగా ఎన్టీఆర్ అసమర్థుడు అయ్యారు, అందుకే ఆయన పదవి లాక్కున్నాను, అది మీకు కూడా తెలుసు కదా అని బాలయ్య సమక్షంలో వెన్నుపోటు మరక కడిగేశారు.
ఇక బాలయ్య-చంద్రబాబు ప్రయత్నం ఏ మేరకు ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తొలగించిందో తెలియదు. ఇదే తరహా సీన్ పవన్ ఎపిసోడ్లో చోటు చేసుకోనుంది. వ్యక్తిగతంగా మూడు పెళ్లిళ్లు, రాజకీయంగా ప్యాకేజీ... పవన్ పై ఉన్న సీరియస్ అలిగేషన్స్. ప్రత్యర్ధులు ఆయనపై సంధిస్తున్న అస్త్రాలు. ఈ ఆరోపణలకు ప్రజలు నమ్మదగిన వివరణలు ఇవ్వాలి. దానికి అన్ స్టాపబుల్ వేదిక అయ్యింది.
మూడు పెళ్లిళ్ల ప్రశ్నపై పెద్దగా ఆసక్తి లేదు. ఇటీవల పవన్(Pawan kalyan) బహిరంగంగా వివరణ ఇచ్చారు. ఇద్దరు భార్యలతో వైవాహిక బంధం సవ్యంగా సాగకపోవడంతో చట్ట ప్రకారం భరణం ముట్టజెప్పి విడాకులు తీసుకున్నాను, అన్నారు. ఐతే బాలయ్య ఈ విషయంలో అడగాల్సిన డేరింగ్ ప్రశ్న... పెళ్ళికి ముందే రేణు దేశాయ్ తో పిల్లల్ని కన్నారా? అని, అది జరగదు. ఎందుకంటే పవన్ దగ్గర దానికి ఆన్సర్ ఉండదు.
ప్యాకేజీ ప్రక్షాళన మాత్రం జరగనుంది. చంద్రబాబు దగ్గర ప్యాకేజి తీసుకొని ఆయనకు అనుకూలంగా పవన్ రాజకీయాలు చేస్తున్నారనే అపవాదు తొలగాలి. పవన్ ఎవరికి మద్దతు తెలిపినా ప్రజా ప్రయోజనం కోసమే అని జనం నమ్మాలి. టీడీపీతో ఎప్పుడు, ఎలా ఆయన దోస్తీ పెట్టుకున్నా దాన్ని గొప్ప నిర్ణయంగా ప్రజలు భావించాలి. అది జరగాలంటే పవన్ మీదున్న ప్యాకేజీ నింద తొలగాలి.
2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మరలా టీడీపీతో పొత్తు పెట్టుకున్నా సాధారణ జనాల్లో, జన సైనికుల్లో వ్యతిరేక భావన రాకూడదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ తీసుకున్న కఠిన నిర్ణయం అనుకోవాలి. పవన్ పై జనాల్లో ఉన్న అపవాదులు వదిలించుకొని కడిగిన ముత్యంలా వచ్చి పొత్తు పెట్టుకుంటేనే రాజకీయ ప్రయోజనాలు ఒనగూరుతాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకి గెస్ట్ గా రావడం వెనుకున్న అసలు కారణం ఇదే అని రాజకీయ విశ్లేషకుల వాదన. ఒకవేళ పవన్ కళ్యాణ్ నిజంగా టీడీపీతో పొత్తు పెట్టుకుంటే వారి అంచనా నిజమైనట్లే. ఇక పవన్ నిజంగా డబ్బులు తీసుకొని రాజకీయాలు చేస్తున్నారా అంటే... నో అనే చెప్పాలి. కారణం ఆధారాలు లేకుండా చేసే ఆరోపణలకు విలువ ఉండదు కాబట్టి.