
సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూసింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఈ సందర్బంగా ఆమె జీవితాన్ని తరచి చూస్తే చాలా అవమానాలు, ఒంటరి పోరాటం, జీవితం కోసం అనేక ఆటుపోట్లని ఫేస్ చేసింది. ఫ్యామిలీనే వెలేసిన పరిస్థితి. పెళ్లైన మూడేళ్లకే భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవితాన్ని లాక్కొచ్చింది. కూతురు చిన్నప్పుడే అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెని కాపాడుకునే క్రమంలో ఆర్థికంగా, మానసికంగా చాలా నష్టపోయింది. అయినా వెండితెరపై తనదైన నటనతో అలరించే ప్రయత్నం చేసింది. నవ్వులు పూయించింది.
పావలా శ్యామల 1951 లో గుంటూరు జిల్లా, అమరావతిలో జన్మించింది. ఈమె అసలు పేరు నేతి శ్యామల. గణేష్ పాత్రో రచించిన `పావలా` నాటకంలో నటన ద్వారా ఈమె పేరు పావలా శ్యామలగా స్థిరపడిపోయింది. ఈమె హైస్కూలు చదువు అమరావతిలోనే జరిగింది. శ్యామల తండ్రి వ్యాపారం చేస్తుండేవారు. దాంతో ఆయన సమీప పట్టణాలైన గుంటూరు, విజయవాడ, ఏలూరు ఇలా తరచూ వెళ్తుండేవారు. ఈమె బాల్యం అంతా అమరావతిలోనే గడచింది. తనలోని సృజనాత్మకత కూడా అక్కడే అరంగేట్రం చేయసాగింది. దాంతో ఈమె లఘునాటికలు రాయగలిగేది. శ్యామలలోని టాలెంట్ని గుర్తించిన లయన్స్క్లబ్ వారు ఆమెని ప్రోత్సహించి అవకాశాలిచ్చారు. వాటిని ఉపయోగించుకొని ఆమె నాటకాలు ప్రదర్శించింది. నాటకాల్లో అభిరుచి పెంచుకొన్న శ్యామల జీవితం చిన్నతనంలోనే నాటకీయంగా మలుపుతిరిగింది.
చిన్నప్పుడు శ్యామల నాన్న ఆచార, సంప్రదాయాలు బాగా పాటించే వారు. బయటకు వెళ్ళివస్తే స్నానం చేయకుండా ఇంట్లో అడుగు పెట్టనిచ్చేవారు కాదు. ఆడపిల్లలపై ఆంక్షలు ఎక్కువగా ఉండేవి. దాంతో పదో తరగతి పూర్తి చేసిన వెంటనే(13ఏళ్లకే) శ్యామలకి పెళ్లి చేశారు. చిన్నతనం నుంచే చిన్న చిన్న నాటికలు, రేడియో నాటికలు రాసేది. కాని వాళ్ల నాన్న తిట్టేవారు. ఆయనకు తెలియకుండా 'వనితావాణి'కి రాసేది. పెళ్లైన రెండు మూడేళ్ళకే, అంటే కూతురు మాధవి పుట్టిన తర్వాత భర్త ఘోరప్రమాదంలో కన్నుమూశారు. కుటుంబపోషణ కోసం ఈమె నాటకాన్ని వృత్తిగా స్వీకరించింది. 44 ఏళ్లుగా అనేక నాటకాలు, సినిమాలు, టి.వి.సీరియళ్లలో నటించిన ఈమె కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేసింది. భర్త లేకపోవడంతో ఒంటరైపోయింది. నాటకాల్లో చేస్తున్నానని బంధువులందరూ వెలి వేశారు.
చదువుకునే వయసులో పావలా శ్యామల కూతురు మేడపై నుంచి కిందపడింది. దాంతో తలకి పెద్ద గాయమై, పెద్ద నరం చిట్లిపోయింది. దీంతో జ్ఞాపకశక్తి కోల్పోయింది. వైజాగ్లో ఉన్న ఒక్క ఇంటినీ అమ్మేసి పాపకు ట్రీట్మెంట్ చేయించినా పూర్తిగా కోలుకోలేదు. చదివితే కండ్లు మసకబారిపోతాయి. పావుగంటకు ఓ సారి కండ్లు తిరిగి పడిపోతుంది. చివరకు మందులు కూడా పని చేయలేదు. ఆమె బాగోగులు కూడా శ్యామలే చూసుకోవాల్సి వచ్చింది. ఆమె ట్రీట్మెంట్కే తన ఆస్తులన్నీ ఖర్చు చేసింది. ఆ తర్వాత అనేక ఇబ్బందులు పడింది. పాపని చూసుకునే క్రమంలో బయటకు వెళ్లలేకపోయింది. దీంతో సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయట. పాప దిగులుతో తన ఆరోగ్యం కూడా పాడైపోయింది. అయితే నాటకాల్లో చేసేటప్పుడు వెలివేసిన బంధువులు సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు దగ్గరయ్యారు. మళ్ళీ కష్టాలు మొదలవ్వడంతో మొహం చాటేశారట. మొన్నటి వరకు ఇంటి అద్దెకట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఇది తెలిసి అప్పటి సీఎం కేసీఆర్ పదివేల పెన్షన్, డబుల్ బెడ్ రూమ్ ఇంటిని కేటాయించారు. కాకపోతే ఇళ్లు రాలేదు. ఆ పెన్షన్తోనే ఇన్నాళ్లు బతికింది. దీనికితోడు దిల్రాజు, పవన్ కల్యాణ్ ఇలా చాలా మంది ఆమెకి సహాయం చేస్తూ వచ్చారు.
ఒంటరిగా తాను ఫేస్ చేసిన కష్టాల గురించి ఓ ఇంటర్వ్యూలో శ్యామల మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో ఓ స్త్రీ ఒంటరిగా బతకడమంటే చాలా కష్టం. అదీ ఓ చంటి పిల్లతో. ఒకవేళ మనం బతకాలనుకున్నా ఈ సమాజం బతకనివ్వదు. పట్టుకుని పీడిస్తారు. సినిమా వాళ్ళకు ఇల్లు ఇవ్వమంటారు. 'నీ భర్త ఏం చేస్తున్నాడు' అంటారు. లేడు అంటే ఇల్లు లేదు పొమ్మంటారు. ఇలా చాలా అవమానాలు తట్టుకున్నాను. నటిగా ఇంత అనుభవం ఉండి ఇలాంటి పరిస్థితిని భరించలేకపోయాను. ఒక్కో సారి చనిపోవాలనిపించేది. కానీ పాప నా కాళ్ళకు సంకెళ్ళు వేసింది. తనకోసమే బతుకుతున్నాను. ఆనారోగ్యం వల్ల ఎప్పుడు పోతానో నాకే తెలియదు. నేను పోతే పాపకు దిక్కులేదు. తన గురించే నా దిగులంతా. ముఫ్పై ఏండ్లు నాటకాల్లోనే ఉండిపోయాను. అక్కడ పెద్దగా వచ్చే ఆదాయం ఏమీ ఉండేది కాదు. వచ్చింది కాస్తా మేం బతకడానికి సరిపోయేది. ఇక సినిమాల్లోకి వచ్చేసరికి యాభై ఏండ్లు వచ్చాయి. అన్నీ ముసలి పాత్రలే కాబట్టి ఇక్కడ కూడా పెద్దగా మిగుల్చుకోవడానికి అవకాశం లేదు. సినీ ఫీల్డ్ అంటే కొంత మెయింటెన్ చేయాలి. ఎంత పిచ్చి వేషమైనా కొద్దో గొప్పో గ్లామర్గా కనిపించాలి. పైగా నాకు ఇంత ఇస్తేనే వస్తాను అని డిమాండ్ చేసే పరిస్థితి నాకు లేదు. నేను కాదంటే వేరే వాళ్ళను పెట్టుకుంటారు. పైగా మా అమ్మాయి ఆరోగ్యం వల్ల ఎవరైనా పిలిస్తేనే వెళ్ళేదాన్ని. ఇప్పుడు అవకాశాలే తగ్గాయి. వస్తున్న పెన్షన్ ఎప్పుడు ఆగిపోతుందో అని నేనూ, నా కూతురు గుండె చేతుల్లో పెట్టుకొని బతుకుతున్నాం` అని తన దయనీయ స్థితిని చెబుతూ ఆ మధ్య కన్నీళ్లు పెట్టుకుంది పావలా శ్యామల.