Niharika allu arjun
అల్లు అర్జున్,మెగా కాంపౌండ్ మధ్య వివాదం ఇప్పుడిప్పుడే చల్లారేలా లేదు. ఆ వివాదాన్ని ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు ఆగ్నికి ఆజ్యం పోసినట్లు కామెంట్స్ తో ఎగదోస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన కొన్ని గంటల్లోనే మెగా హీరో సాయిధుర్గ తేజ్ తీసుకున్న నిర్ణయంతో సినిమా అభిమానులు ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను సోషల్ మీడియాలో ఆయన అన్ఫాలో చేశారు.
ఈ క్రమంలో మెగా vs అల్లు కాంపౌండ్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. అయితే సాయి దుర్గ తేజ్ తప్ప.. మిగతా మెగా హీరోలందరూ అల్లు అర్జున్ను ప్రస్తుతానికి ఫాలో అవుతున్నారు. అయితే మిగతా వారు మనస్సులో ఏముంది ..వాళ్లు కూడా అల్లు అర్జున్ ని వదిలేద్దామనే నిర్ణయానికి వచ్చారా అనేది మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఈ వివాదాన్ని మొదట్లో ట్వీట్ తో మొదలెట్టిన నాగబాబు కుమార్తె నీహారిక స్టాండ్ ఏమిటి అనేది ఆసక్తికరమైన విషయం.
Allu Arjun
"మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే" అంటూ కొణిదెల నాగబాబు చేసిన ట్వీట్ నెల క్రితం సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారనేదానిపై ఏ క్లారిటీ ఇవ్వలేదు. దాంతో ఎవరికి తగినట్లుగా వారు అర్థాలు చెప్పుకుంటున్నారు. మాగ్జిమం మీడియాతో సహా చాలా మంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను ఉద్దేశించి నాగబాబు కోపంతో ఈ ట్వీట్ చేశారని అభిప్రాయపడ్డారు.
Allu Arjun
ఈ గొడవలకు కారణం ఏపీ ఎన్నికల ప్రచారం చివరిరోజు.. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు వెళ్లారు. భార్యతో కలిసి నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్.. నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. అయితే అంతకు ఒక్కరోజు ముందే ట్విటర్ వేదికగా పవన్ కళ్యాణ్కు అల్లు అర్జున్ మద్దతు ప్రకటించారు. మరుసటి రోజే శిల్పారవి ఇంటికి వెళ్లి ఆయనకు సంఘీభావం ప్రకటించారు. అయితే ఈ క్రమంలోనే విలేకర్లతో మాట్లాడుతూ శిల్పారవికి మద్దతుగా ట్వీట్ చేస్తే సరిపోదని.. అందుకే ఇంటికి వచ్చి మద్దతు ప్రకటిస్తున్నానని అన్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్, పవన్ ఫ్యాన్స్ మధ్య రచ్చ మొదలైంది.
వాస్తవానికి మెగా - అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చిందని కొంతకాలం వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఇష్యూతో ఈ రూమర్లు జోరందుకున్నాయి. ఇక అల్లు అర్జున్ను సోషల్ మీడియా అకౌంట్లలో మెగా యంగ్ హీరో అన్ఫాలో చేయడం హాట్ టాపిక్గా మారింది. ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో అల్లు అర్జున్ను సాయిధరమ్ తేజ్ (సాయి దుర్గ తేజ్) అన్ఫాలో చేసేశారు. అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డిని కూడా అన్ఫాలో చేసేశారు. దీంతో సోషల్ మీడియాలో దీనిపై చర్చ మొదలైంది. ఏపీ మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే.. సాయి తేజ్ ఇలా చేయడం మరింత ఇంట్రెస్టింగ్గా మారింది.
అల్లు అర్జున్ను సాయి ధరమ్ తేజ్ అన్ఫాలో చేసిన విషయంపై సోషల్ మీడియాలో చర్చ... రచ్చ గా మారింది. మరోసారి మెగా - అల్లు అభిమానులు కొందరు సోషల్ మీడియాలో యుద్దం చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ను కావాలనే నెగెటివ్ చేస్తున్నారని అతడి ఫ్యాన్స్ కొందరు ఆరోపిస్తుంటే.. ఆయన చేసిన పనులు అలా ఉన్నాయని మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇలా మెగా - అల్లు అంశం మరోసారి సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.
Allu Arjun
పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మంత్రిగా రీసెంట్ గా ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు మెగా కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, అల్లు కుటుంబం నుంచి ఒక్కరు కూడా రాలేదు. అల్లు అర్జున్, అల్లు అరవింద్, అల్లు శిరీష్ సహా అల్లు ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరు హాజరు కాలేదు. దీంతో మెగా - అల్లు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయనే వాదనలకు మరింత బలం చేకూరింది. అల్లు అర్జున్ను సాయి ధరమ్ తేజ్ అన్ఫాలో కావడం దానికి ఆజ్యం పోసింది.
తాజాగా ఈ వివాదం గురించి నిహారిక ని ప్రశ్నించారు మీడియా వారు. దానికి ఆమె కాస్త జాగ్రత్తగా రియాక్ట్ అయింది. 'కమిటీ కుర్రోళ్లు' అనే సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన నిహారికను ఇదే విషయం గురించి ఒక విలేకరి ప్రశ్నించగా ఆమె స్పందించింది. అల్లు అర్జున్, సాయిదుర్గ తేజ్ విషయం గురించి తనకు ఇంకా తెలియదని చెప్పింది. అయినా, ఎవరి కారణాలు వారికి ఉంటాయని ఆమె చెప్పింది. దాంతో అసలు నీహారిక ఈ ఇష్యూ విషయంలో స్టాండ్ ఏమిటనే విషయం బయిటకు వస్తుందని లాగుదామనుకునే మీడియావారికి నిరాశ ఎదురైంది.