Varanaasi Story : గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో మహేష్–రాజమౌళి చిత్రం ‘వారణాసి’ టైటిల్ ప్రకటించారు. మహేష్ రుద్ర పాత్ర, 30 నిమిషాల యాక్షన్ సీన్ సినిమాలో హైలైట్ గా ఉంటాయని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.
గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్… అభిమానులతో రామోజీ ఫిల్మ్ సిటీలో హంగామా
సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వస్తోన్న భారీ యాక్షన్ అడ్వెంచర్ ప్రాజెక్ట్పై దేశవ్యాప్తంగా అంచనాలు పెరిగిపోయాయి. నవంబర్ 15న హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్లో అభిమానులు వేలాదిగా హాజరై వేడుకను అంగరంగ వైభవంగా మార్చారు. ఈ ఈవెంట్లోనే చిత్ర యూనిట్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైటిల్ను అధికారికంగా ప్రకటించింది. ముందే ఊహించినట్లుగా ఈ గ్లోబల్ ప్రాజెక్ట్కు ‘వారణాసి’ అనే శక్తివంతమైన పేరును ఖరారు చేశారు.
ఫస్ట్ లుక్ లోనే పృథ్వీరాజ్ సుకుమారన్ (కుంభ), ప్రియాంక చోప్రా (మందాకిని) పాత్రలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. ‘సంచారి’ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా చార్ట్ బస్టర్గా మారడంతో సినిమా హైప్ మరింత పెరిగింది.
24
మహేష్ బాబు ‘రుద్ర’గా… త్రిశూలంతో టైటిల్ గ్లింప్స్
టైటిల్ ప్రకటనతో పాటు మహేష్ బాబు పాత్రను కూడా అధికారికంగా ప్రకటించారు. ‘రుద్ర’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపిస్తున్న మహేష్, తాజాగా విడుదలైన గ్లింప్స్లో త్రిశూలం చేతబట్టి కనిపించడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో షేరై ట్రెండింగ్లోకి వెళ్లిపోయింది. పురాతన, మైథలజీ, శక్తివంతమైన వీరుని గాథను గుర్తు చేసే ఈ లుక్ను అభిమానులు ‘మహేష్ కెరీర్లో బెస్ట్’గా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
34
టైమ్ ట్రావెల్ నేపథ్యమా? విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన బిగ్ హింట్
సోషల్ మీడియాలో ‘వారణాసి’ కథ గురించి ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. పురాతన ప్రపంచం, ఆధునిక యుగం మధ్య ప్రయాణించే టైమ్ ట్రావెల్ అడ్వెంచర్ కాన్సెప్ట్ చుట్టూ కథ తిరుగుతుందనే అభిప్రాయం వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో ఈవెంట్లో పాల్గొన్న సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక కీలక అప్డేట్ ఇచ్చారు.
ఆయన మాట్లాడుతూ.. “ఈ సినిమాలో 30 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ చూశాను. సీజీ లేదు, బీజీఎం లేదు, కానీ మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ మంత్రంలా కట్టిపడేసింది. కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు, కొన్ని దేవతలు చేయిస్తారు. రాజమౌళి హృదయంలో హనుమాన్ ఉంచుకుని ఈ కథ రాశారు” అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు చూసి కథలో మైథలజీ, మిస్టిసిజం, టైమ్-ట్రావెల్ అంశాలు కలిసి ఉంటాయన్న చర్చకు బలం చేకూరింది.
మహేష్ విశ్వరూపం… 30 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్పై భారీ అంచనాలు
విజయేంద్ర ప్రసాద్ చెప్పిన వివరాల ప్రకారం, 30 నిమిషాల పాటు సాగే యాక్షన్ బ్లాక్ ఇప్పటికే చిత్రీకరించారు. సీజీ, గ్రాఫిక్స్, బీజీఎం కలిస్తే అది ఎలాంటి విజువల్ వండర్గా మారుతుందోనని అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో లెక్కలు వేస్తున్నారు. ఇది క్లైమాక్స్ అయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
సినిమా నిర్మాణ విలువలు చూస్తే ఈ ప్రాజెక్ట్ ప్రపంచ స్థాయి మార్కెట్ను లక్ష్యంగా పెట్టినట్టు స్పష్టమవుతోంది. మైథలజీ, సైన్స్ ఫిక్షన్, టెక్నాలజీ, చరిత్ర–పురాణాల కలయికతో రాజమౌళి మరోసారి ఓ కొత్త జానర్ను తెరమీదకు తీసుకురానున్నారని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్తో కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.