
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న `వారణాసి` చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పుడిది ఇండియాలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. మైథాలజీ అంశాలు, టైమ్ ట్రావెల్ కథ, సైన్స్ ఫిక్షన్, రామాయణంలోని లంకా దహణం ఇలా అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు రాజమౌళి. ఆల్మోస్ట్ ఇప్పటికే 70శాతం చిత్రీకరణ పూర్తయ్యిందని సమాచారం. ఇటీవల రాజమౌళి ఈ విషయాన్ని చెప్పారు. ఆరేడు నెలల్లో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని `అవతార్ 3` దర్శకుడు జేమ్స్ కామెరూన్తో చెప్పిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ మూవీకి సంబంధించిన క్రేజీ విషయాన్ని ప్రియాంక చోప్రా వెల్లడించింది. సినిమా బడ్జెట్ని రివీల్ చేసింది. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మూవీ దాదాపు రూ.1300 కోట్ల బడ్జెట్తో రూపొందుతుందని చెప్పింది. గతంలో వెయ్యి కోట్లతో ఈ చిత్రం రూపొందుతుందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత రైటర్ విజయేంద్రప్రసాద్ దాదాపు రూ.1200కోట్ల ఖర్చు అవుతుందన్నారు. ఇప్పుడు ప్రియాంక ఏకంగా రూ.13వందల కోట్లుగా తేల్చడం విశేషం. దీంతో ఈ సినిమా రేంజ్ ఏంటో అర్థమవుతుంది. కనీవినీ ఎరుగని రీతిలో సినిమాని రూపొందిస్తున్నారని తెలుస్తోంది.
అదే సమయంలో ఈ మూవీ కోసం మహేష్ బాబు చాలా రిస్క్ తీసుకుంటున్నారట. తన కెరీర్లో ఎప్పుడూ లేని సాహసం చేయబోతున్నారు. ఇందులో సరికొత్తగా కనిపించబోతున్నారు. ఆయన ఈ చిత్రంలో `రుద్ర` పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. హనుమంతుడికి మరో రూపంగా ఆయన పాత్ర ఉండబోతుందని తెలుస్తోంది. టైమ్ ట్రావెల్ కథ కావడంతో ఆయన నాలుగైదు టైమ్ పీరియడ్స్ లో జర్నీ చేయబోతున్నారని సమాచారం. ఇటీవల విడుదల చేసిన `వారణాసి` గ్లింప్స్ అదిరిపోయింది. విజువల్స్ పరంగానూ వండర్ని క్రియేట్ చేసింది.
ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం మహేష్ పురాతన యుద్ధ కళని నేర్చుకుంటున్నారట. కేరళాకు చెందిన యుద్ధ కళ `కలరిపయట్టు` అనే యుద్ధ విద్యలో శిక్షణ పొందుతున్నారట. హైదరాబాద్కి చెందిన ప్రముఖ కలరిపయట్టు ట్రైనర్ హరికృష్ణన్ సారథ్యంలో మహేష్ ఈ శిక్షణ తీసుకుంటున్నారు. మహేష్ బాబుతో దిగిన ఫోటోని పంచుకుంటూ తన అనుభవాలను పంచుకున్నారు. భారతీయ సినిమాకి చెందిన గ్లోబల్ స్టార్కి తాను శిక్షణ ఇస్తానని ఎప్పుడూ ఊహించలేదని, మహేష్ బాబు క్రమశిక్షణ, లైఫ్ స్టయిల్, అతిథి మర్యాదలు తనకు ఎంతో స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన నటుడు నాజర్, దర్శకుడు రాజమౌళి కి ఆయన థ్యాంక్స్ చెప్పారు.
అయితే మహేష్ బాబు నేర్చుకుంటున్న కలరిపయట్టు ఏంటనేది చూస్తే, ఇది మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, అదే సమయంలో అత్యంత శక్తివంతమైన యుద్ధ విద్యల్లో ఇది ఒకటి. ఇందులో శారీరక శిక్షణతోపాటు ఆధ్యాత్మిక శిక్షణ కూడా ఇస్తారు. కత్తులు, కర్రలతో యుద్ధం చేయడం, జంతువులను ఉపయోగించి యుద్ధంలో పాల్గొనడం వంటివి ఇందులో ప్రధానంగా ఉంటాయి. ఇది చాలా కఠినమైన యుద్ధ విద్యల్లో ఒకటి కావడం విశేషం. ఇటీవల వచ్చిన `కాంతార చాప్టర్ 1`లో దీన్ని ఉపయోగించారు. ఇప్పుడు `వారణాసి`లోనూ మహేష్ చేయబోతుండటం విశేషం. కెరీర్లో మొదటిసారి మహేష్ ఇలాంటి సాహసం చేయడం విశేషంగా చెప్పొచ్చు. ఇది సినిమాపై మరింత అంచనాలను పెంచుతుంది.
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న `వారణాసి` చిత్రంలో ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే నెగటివ్ రోల్ చేస్తున్నారు. శ్రీ దుర్గ ఆర్ట్స్ పతాకంపై కె ఎల్ నారాయణ, కార్తికేయ, ఎస్ గోపాల్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 సమ్మర్లో విడుదల చేయబోతున్నారు. దీనికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.