
కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో దక్షిణమూర్తి తాత ఎలాంటివాడో నాకు తెలియదు. కానీ ఈ రోజు ఒక ప్రాణాన్ని కాపాడి నువ్వు అంతకంటే గొప్ప స్థానంలో ఉన్నావు తాత అంటాడు కార్తీక్. నువ్వు రక్తం ఇచ్చేది దక్షిణమూర్తి తాతకు అని తెలిసినా, నువ్వు వెనక్కి వెళ్లిపోయేవాడివి కాదని నా నమ్మకం తాత అంటాడు కార్తీక్. ఈ రోజు నువ్వు ఒక ప్రాణం కాపాడి తప్పు చేశావు కార్తీక్ అని చెప్పు... నా వ్యక్తిత్వాన్ని నీ కాళ్ల దగ్గరే ఉరి తీసి ఇక్కడి నుంచి వెళ్లిపోతాను అంటాడు కార్తీక్. సైలెంట్ గా ఉంటాడు శివన్నారాయణ. నవ్వుకుంటుంది జ్యోత్స్న.
నువ్వు మౌనంగా ఉన్నావంటే నేను తప్పు చేశాననే అర్థం. తప్పు చేసిన వ్యక్తికి నీ ముందు నిలబడే అర్హత లేదు. నేను వెళ్లిపోతున్నాను అని కార్తీక్ ముందుకు అడుగువేయగానే, చేయి పట్టుకొని ఆపుతాడు శివన్నారాయణ. దీంతో పారు, జ్యోత్స్న షాక్ అవుతారు. ఇప్పుడు నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతే ఇన్నాళ్ల శివ నారాయణ ఆదర్శానికి పాడె కట్టినట్లే అంటాడు శివన్నారాయణ. నా ఆవేశం, కోపం నాలోని మంచితనాన్ని చంపేశాయని ఎమోషనల్ అవుతాడు శివన్నారాయణ.
నువ్వు మనుమడిగా నా ధర్మాన్ని కాపాడావు. తండ్రినే కాదు తాతను కూడా సరిదిద్దావ్. కాంచన.. నీ పెంపకాన్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందని లోపలికి వెళ్లిపోతాడు శివన్నారాయణ. ఆ తర్వాత శ్రీధర్, కార్తీక్ ని గట్టిగా పట్టుకొని గర్వంగా ఫీల్ అవుతాడు. దీప జాగ్రత్త... మన చుట్టూ మంచి చేసే వాళ్లకన్నా, కీడు కోరుకునే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్లకు బుద్ధి రావడం లేదని చెప్పి వెళ్లిపోతాడు శ్రీధర్. కోపంగా వెళ్లిపోతారు పారు, జ్యోత్స్న.
మరోవైపు స్వప్న కోసం వేడి నీళ్లు తీసుకువెళ్తుంటుంది కావేరి. అప్పుడే వచ్చిన కాశీ.. ఎందుకు అత్తయ్య అని అడుగుతాడు. స్వప్నకు జ్వరం వచ్చింది. కాళ్లకు వేడినీళ్లతో కాపడం పెడితే కాస్త రిలాక్స్డ్ గా ఉంటుందని తీసుకెళ్తున్నాను అని చెప్తుంది. నేను తీసుకెళ్తాను అని వేడి నీళ్లు తీసుకుని స్వప్న దగ్గరకు వెళ్లి కాళ్లకు కాపడం పెడతాడు కాశీ. భర్త ప్రేమను చూసి ఎమోషనల్ అవుతుంది స్వప్న. కాసేపు భార్యాభర్తలిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటారు.
ఇంకోవైపు జ్యోత్స్న, పారు మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తీక్ ని ఇరికించాలన్న ప్లాన్ బెడిసి కొట్టినందుకు చిరాకు పడుతుంది జ్యోత్స్న. వాడు మాయలోడే మాటలతో మీ తాతను మార్చేశాడు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటుంది పారు. ఈ గొడవకు కారణం నువ్వే కదా.. చిన్న తప్పు దొరికినా వాడు నిన్ను వదిలిపెట్టడు అంటుంది పారు. నా వైపు వేలెత్తి చూపేందుకు ఒక్క కారణం కూడా లేదు అంటుంది జ్యో. నాకేదో భయంగా ఉంది అంటుంది పారు. అప్పుడే సూరజ్ ఎంట్రీ ఇస్తాడు.
సూరజ్ ను చూసిన కార్తీక్ ఏంటి బ్రదర్ ఈ సడెన్ సర్ ప్రైజ్? అని అడుగుతాడు. ఈ ఇంటి పెద్దాయనతో మాట్లాడాలి. ఫుడ్ స్టాల్ నష్ట పరిహారం కోసం వచ్చాను అని చెప్తాడు కార్తీక్. వెంటనే తాతను పిలుస్తాడు కార్తీక్. ఫ్యామిలీ మొత్తం వస్తారు. సూరజ్ ను చూసి షాక్ అవుతుంది జ్యోత్స్న. మా ఇంటికి నువ్వు ఎందుకు వచ్చావురా అని కాస్త హడావిడి చేస్తుంది జ్యోత్స్న. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. నీ వల్ల నాకు నష్టం జరిగింది అంటాడు సూరజ్.
నువ్వు చెప్పు బాబు ఏం జరిగిందో.. తప్పు ఎవ్వరిదైనా శిక్ష కచ్చితంగా ఉంటుంది అంటాడు శివన్నారాయణ. నా పేరు సూరజ్. మార్కెట్ రోడ్ లో సూరజ్ హెల్తీ ఫుడ్స్ పేరుతో స్టాల్ రన్ చేస్తున్నాను. నా దగ్గర బిజినెస్ చేయడానికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. అయినా నా స్టాల్ పై మున్సిపాలిటీ ఆఫీసర్లు రైడ్ చేశారు. నా స్టాల్ ని నాశనం చేశారు. ఇదంతా చేయించింది జ్యోత్స్ననే. నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది అంటాడు సూరజ్. ఏంటా సాక్ష్యం అని అడిగితే కార్తీక్ ని చూపిస్తాడు సూరజ్. ఇదంతా జరిగినప్పుడు కార్తీక్ అక్కడే ఉన్నాడు. జ్యోత్స్ననే ఇదంతా చేయించిందని ఆమె స్వయంగా నాతో చెప్పింది అని చెప్తాడు సూరజ్.
సూరజ్ చెప్పేది నిజమేనా? అని కార్తీక్ ని అడుగుతాడు శివన్నారాయణ. నిజమే అంటాడు కార్తీక్. స్టాల్ తొలగించే టైంలో జ్యోత్స్న మాట్లాడిన వీడియోను కూడా అందరికీ చూపిస్తాడు సూరజ్. బ్రదర్ ఆ వీడియోల కింద ఎలాంటి కామెంట్స్ పెట్టారో చదువు అని కార్తీక్ తో చెప్తాడు సూరజ్. ఇది అన్యాయం, మిస్ హైదరాబాద్ కి పొగరు ఇంకా తగ్గలేదు. అమ్మానాన్నలు గాలికి వదిలేశారు అంటూ అక్కడ ఉన్న కామెంట్స్ చదువుతాడు కార్తీక్. జ్యోత్స్నవైపు కోపంగా చూస్తారు కుటుంబమంతా. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.