మహేష్ దాదాపు 12ఏళ్ల తర్వాత త్రివిక్రమ్తో సినిమా చేస్తున్నాడు. SSMB28 వర్కింగ్ టైటిల్తో రూపొందుతుంది. `అతడు`, `ఖలేజా` చిత్రాలు వీరి కాంబినేషన్లో వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు థియేటర్లో పెద్దగా ఆడలేదు. కానీ టీవీలో మాత్రం దుమ్ములేపాయి. మంచి టీఆర్పీని సాధించాయి. ముఖ్యంగా `అతడు` అత్యధికంగా టెలివిజన్లో టెలికాస్ట్ అయిన చిత్రంగా నిలిచింది.
తాజాగా మహేష్ తన 28వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. యాక్షన సీక్వెన్స్ తో తొలి షెడ్యూల్ని చేశారు. `కేజీఎఫ్`కి పనిచేసిన అన్బుమణి, అరివుమణి(అన్బరివ్) మాస్టర్స్ సారథ్యంలో ఈ ఫైట్ సీక్వెన్స్ తెరకెక్కించినట్టు తెలుస్తుంది. అయితే ఈ యాక్షన్ విషయంలో దర్శకుడు, హీరో సంతృప్తిగా లేరనే టాక్ వినిపించింది. అయితే మరోసారి కూడా వాళ్లకే ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారట.
ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ఇచ్చాడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఈ సినిమా `అతడు`, `ఖలేజా`లను మించి ఉంటుందట. ఓ ఊహించని కాన్సెప్ట్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారు. మహేష్ ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడని తెలిపారు. సినిమా సైతం ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని, ఆడియెన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకుని వచ్చినా సరే దాన్ని మించి ఉంటుందని చెప్పారు నాగవంశీ. తాను ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెబుతున్నారని అనుకోవచ్చు, కానీ ఇదే నిజమంటూ మహేష్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే విషయం చెప్పారు.
అంతేకాదు మరో క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ఇందులో ఐటెమ్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మహేష్ సినిమాలో ప్రాపర్ ఐటెమ్ సాంగ్లు లేవు. ఈ సారి ప్లాన్ చేస్తున్నారట. ఎలాగైనా త్రివిక్రమ్ని ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు నిర్మాత. త్రివిక్రమ్-మహేష్ సినిమాలో ఐటెమ్ సాంగ్ అంటే ఆ లెక్క వేరే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో. త్రివిక్రమ్ క్లాస్కి, మాస్ తోడైతే థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే ని చెప్పొచ్చు.
మరోవైపు సినిమా షూటింగ్ విషయంలో కొంత సందిగ్దం నెలకొంది. జనరల్గా రెండో షెడ్యూల్ని దసరా తర్వాత ప్లాన్ చేశారు. కానీ మహేష్బాబు మదర్ ఇందిరాదేవి మరణించిన నేపథ్యంలో షెడ్యూల్ కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ సినిమాని హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి `అ` సెంటిమెంట్ని ఫాలో అవుతున్నారట త్రివిక్రమ్. `అయోధ్యలో అర్జునుడు` అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.