బిగ్ బాస్ 6 ప్రారంభంలోనే కంటెస్టెంట్ల విషాద, కన్నీటి గాథలను రివీల్ చేశాడు బిగ్ బాస్. కొందరి బ్యాక్గ్రౌండ్లను దాచేశారు. దీంతో మొదటి రోజే వారి చేతి ఆ కన్నీటి గాథలను రివీల్ చేయించారు. ట్రాష్ గా నిలిచిన ఇనయా సుల్తానా, సింగర్ రేవంత్, గీతూ రాయల్ తాము గొప్ప అనే విషయాన్ని చాటే క్రమంలో ఏ విషయంలో తాము స్ట్రాంగ్గా ఉన్నారో తెలియాల్సి ఉంది. ఎవరికీ సందేశాన్ని పంపించాలనుకుంటున్నారో, ఆ కథేంటో చెప్పాల్సందిగా బిగ్ బాస్ షరతు పెట్టగా ఇందులో ఇనయ సుల్తానా గాథ కన్నీళ్లు పెట్టించింది.
తండ్రికి సందేశాన్ని పంపిస్తూ, సినిమాల్లో రాణించాలనేది ఆయన డ్రీమ్ అని, కానీ కుటుంబం కోసం తన డ్రీమ్ని త్యాగం చేశాడని, చివరికి తన కోరిక తీరకుండానే ఈ లోకాన్ని విడిపోయాడదని చెప్పింది ఇనయా. తండ్రి కోరికని నెరవేర్చడం కోసం తాను సినిమా రంగంలోకి వచ్చానని తెలిపింది. అయితే తాను ఇండస్ట్రీకి రావడం ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదట. చివరికి వాళ్ల అమ్మ కూడా అడ్డుకుందట. దీంతో ఇంట్లో నుంచి పారిపోయి ఇండస్ట్రీకి వచ్చానని చెప్పింది ఇనయా సుల్తానా.
హైదరాబాద్లో ఉంటూ అనేక కష్టాలు పడ్డానని, చాలా తిండి లేకుండా పస్తులుండాల్సిన రోజులను కూడా ఫేస్ చేసిందట. ఆలస్యంగా వస్తే హాస్టల్ లో ఫుడ్ అయిపోయేదని, కొన్ని సార్లు అన్నం మాత్రమే ఉండేదని, దీంతో అందులో వాటర్ పోసుకుని తిని కడుపు నింపుకునేదాన్ని అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. హౌజ్లో ఉన్న వాళ్లచేత కన్నీళ్లు పెట్టించింది. తండ్రి కోరికని తాను నెరవేర్చి, తన పేరులో తండ్రి పేరుగా మార్చుకుని ఇనయ సుల్తానాగా పాపులర్ కావాలని కోరుకుంటున్నట్టు చెప్పింది ఇనయ.
ఇది విని మరో కంటెస్టెంట్ కీర్తి కన్నీటి పర్యంతమయ్యింది. ఓ యాక్సిడెంట్లో వాళ్ల కుటుంబాన్ని మొత్తం ఆమె కోల్పోయిన విషయం తెలిసిందే. అయిన వాళ్లు మోసం చేశారని, దీంతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్నట్టు తెలిపింది. తన వాళ్లు లేరనే విషయం గుర్తొచ్చిన ఆమె ఎమోషనల్ అయ్యింది.
అనంతరం సింగర్ రేవంత్ సైతం తన భావోద్వేగ గతాన్ని వెల్లడించారు. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడట. ఆ విషయం తాను 6వ తరగతి వచ్చేంత వరకు తెలియదని, ఎవరూ చెప్పలేదని తెలిపాడు. నాన్న అమెరికాలో ఉండేవాడని, ఆయన తిరిగొస్తాడని వేచి చూసేవాడనని, కానీ ఎప్పుడూ రాలేదని తెలిపి గుండె బరువెక్కించాడు. అమ్మ, ఫ్యామిలీ సపోర్ట్ తో తాను ఈ స్థాయికి వచ్చానని, వారి కోసం సందేశం పంపిస్తున్నట్టు తెలిపారు రేవంత్.
ట్రాష్ గ్రూప్లో ఉన్న మరో కంటెస్టెంట్ గీతూ రాయల్.. తన గతాన్ని చెప్పేందుకు చాలా ఇబ్బంది పడింది. తాను ఇలాంటి పరిస్థితి ఫేస్ చేయలేనని, పదేపదే బాత్ రూమ్కి వెళ్లడం విశేషం. చివరగా ఆమె చెబుతూ, తనని చిన్నప్పట్నుంచి అంతా చులకనగా చూసేవారని, నీ వల్ల కాదని, అందరూ దూరం పెట్టేవారని చెప్పింది. తానేంటో నిరూపించుకుని ఓ స్టార్ గుర్తింపు వచ్చేంత వరకు తనని ఎవరూ పట్టించుకోలేదని, ఆ తర్వాత అందరూ తన చుట్టూ చేరారని తెలిపింది గీతూ. తాను ఈ స్థాయికి రావడానికి కారణం ఫాలోవర్స్ అని, వారికి సందేశం పంపింది గీతూ.
అయితే ఈ క్రమంలో గీతూ రాయల్ చేసిన యాక్షన్ మరీ ఓవర్గా ఉందనే విమర్శలు వినిపించాయి. కంటెస్టెంట్లే ఆమె వ్యవహార శైలిపట్ల అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. డామినేటెడ్ యాటిట్యూడ్తో, అంతా తానే ఉండాలనే యాటిట్యూడ్తో ఆమె ఉందని, అందరిపై ఆధిపత్యం చెలాయించేలా ఆమె వ్యవహరిస్తుందనే విమర్శలు వస్తుండటం గమనార్హం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఆదివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. 21 మంది కంటెస్టెంట్లతో హౌజ్ నిండుగా ఉంది. ఇక తొలి రోజు నుంచే హౌజ్లో మంటలు పెట్టాడు బిగ్ బాస్. కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టి హీటు రాజేశాడు. బాత్ రూమ్లో వెంట్రుకల విషయంలో గీతూ రాయల్, ఇనయా సుల్తానాలు గొడవ పడ్డారు. కాసేపు ఇద్దరు హౌజ్ని వేడెక్కించారు. ఆ తర్వాత ఇంటి సభ్యులకు టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.
దీని ప్రకారం హౌజ్లోని వారిని మూడు గ్రూపులుగా విడగొట్టాడు. ఇందులో క్లాస్, ట్రాష్, ఈ రెండు కాని వీళ్లు మాస్. అందరు తమ అభిప్రాయాన్ని చెప్పగా, క్లాస్ లో ఆదిత్య, సూర్య, శ్రీహాన్ నిలవగా, ట్రాష్లో ఇనయా, రేవంత్, గీతూ రాయల్ నిలిచారు. వీరే తమ గతాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. అనంతరం కొబ్బరి బొండా టాస్క్ ఇచ్చారు. తొలి రోజు తొలి టాస్క్ ఇది. ఇందులో ఇద్దరు కంటెస్టెంట్లు కొబ్బరి బోండాలోని నీళ్లు కింద పడకుండా ఒకరినొకరు కొట్టుకోవాలని తెలిపారు. టాస్క్ ముగిసే సమయానికి ఎవరి బోండాలో ఎక్కువ నీళ్లు ఉంటాయో వాళ్లే విన్నర్. ఇందులో ఆది రెడ్డి, ఇనయా పాల్గొన్నారు. ఆదిరెడ్డి విన్నర్ అయ్యారు.