
ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్ లో అమూల్య.. వల్లి గురించి నర్మద, ప్రేమలకు మొత్తం చెప్పేస్తుంది. దాంతో ప్రేమకు చాలా కోపం వచ్చి ‘దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉంది. అదేంటో వల్లిని అడిగి తెలుసుకుందాం పద’ అని అంటుంది. దానికి అమూల్య మాట్లాడుతూ ‘వదినా.. మీరు ఎవరితోనూ గొడవపడమని మాటిచ్చారు. నాన్న ఏరి కోరి తెచ్చిన సంబంధం వల్లి వదిన. ఇలా చేసిందంటే నాన్న తట్టుకోలేరు. ఎన్నో సంబంధాలు చూసిన తర్వాత వల్లితో అన్నయ్యకు పెళ్లయింది. వదిన నా జీవితాన్ని ఇలా చేసిందంటే అన్నయ్య కచ్చితంగా వల్లిని వదిలేస్తాడు. నా జీవితం ఎలాగో సమస్యల్లో పడిపోయింది. వారి జీవితాలను, కాపురాల్ని సమస్యల్లో పడేయడం ఎందుకు? మీకు దండం పెడతాను. ఈ విషయం ఇంతటితో వదిలేయండి. నాన్నతో కానీ, ఇంకెవరితో గాని చెప్పారంటే నా మీద ఒట్టే’ అని అమూల్య అంటుంది. అప్పుడు నర్మద పద ఇంటికి వెళదామని అమూల్యను తీసుకువెళతారు.
ఇక్కడ నుంచి సీన్ రామరాజు ఇంటికి మారుతుంది. వల్లి వంట చేసి క్యారేజీలు సిద్ధం చేస్తూ ఉంటుంది. తనలో తాను ఈ పాటికి అమ్మానాన్న అమూల్యను బతిమిలాడేసి ఉంటారు, నా పేరు ఎక్కడా చెప్పనని అమూల్య మాటిచ్చేసి ఉంటుంది.. ఇక నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటుంది. ఈ లోపు భాగ్యం ఇడ్లీ బాబాయ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. అమూల్య ఇంట్లో లేదని, వాళ్ళ నాన్నను చూడడానికి ఆసుపత్రికి వెళ్లిందని చెబుతాడు ఇడ్లీ బాబాయ్. దీంతో వల్లి భయపడిపోతుంది. ఆస్పత్రికి వెళ్లి అమూల్య వాళ్ళ నాన్నకి ఏమి చెప్పకుండా ఆపుదాం పదండి అని ఇడ్లీ బాబాయ్ చెబుతాడు. ఈలోపు నర్మదా అక్కడికి వస్తుంది.
వల్లి వాళ్ళు ఆసుపత్రికి బయలుదేరుతూ ఉంటే నర్మద వచ్చి వాళ్ళ ఎదురుగా నిలిచి ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. దానికి వల్లి ఆసుపత్రిలో అందరూ తిండి తిప్పలు లేకుండా బాధపడుతున్నారు కదా, అందుకే వంట చేసి క్యారేజ్ పట్టుకుని వెళుతున్నాను, ఎంతైనా నాది మంచి మనసు కదా అని అంటుంది. దానికి నర్మద ‘మామయ్య గారు ఆస్పత్రి పాలవ్వడానికి కారణం నువ్వు’ అని అనగానే వల్లి, ఇడ్లీ బాబాయ్, భాగ్యం షాక్ అయిపోతారు. చేసిన పనులన్నీ చేసేసి ఏమీ తెలియని నంగనాచిలాగా అన్నం తీసుకెళ్తున్నావా అని అంటుంది నర్మద. దానికి వల్లి మాట్లాడుతూ ‘ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు? మావయ్య గారు ఆసుపత్రి పాలవ్వడానికి నేను కారణమని అంత దుర్మార్గంగా ఎలా మాట్లాడుతున్నావ్? మేము ఎలా కారణం? ఏం చేశాం?’అని అంటుంది. అప్పుడు నర్మద మాట్లాడుతూ ‘ విశ్వను ప్రేమించమని అమూల్యకు చెప్పింది నువ్వు నువ్వు కాదా?’ అని గట్టిగా అడుగుతుంది.
అప్పుడు వల్లి తమకేమీ సంబంధం లేదని, అయినా ఏ ఆధారాలు ఉన్నాయని మా మీద నిందలేస్తున్నావు అని ప్రశ్నిస్తుంది. అప్పుడు నర్మద అమూల్యను పిలుస్తుంది. గుమ్మం దగ్గర అమూల్యను తీసుకొని ప్రేమ నిలుచుని ఉంటుంది. ఆధారాలు కావాలని అడిగారు కదా చూడండి. మీరు చేసిన నీచమైన పనులను మొత్తం చెప్పేసింది అని అంటుంది నర్మద. అప్పుడు వల్లి ఇంకా నటించడం మొదలు పెడుతుంది.‘చూడు అమూల్య.. నీకూ విశ్వకు ప్రేమ రాయబారం చేసింది నేనేనని ఎంత అన్యాయంగా మాట్లాడుతుందో చూడు. వల్లి వదిన చాలా మంచిది. ఏ పాపం తెలియదని చెప్పు’ అని అంటుంది. దాంతో నర్మదకు కోపం వచ్చి వల్లిని రెండు దెబ్బలు చెంపపై లాగి కొడుతుంది. ఈలోపు భాగ్యం నా కూతురిని కొడతావా అని రాగానే ఆమెపైన కూడా చేయెత్తుతుంది నర్మద. తల్లిలాంటిదానివని వదిలేస్తున్నా... లేకుంటే నీకు కూడా పడతాయి అని వార్నింగ్ ఇస్తుంది భాగ్యం. ఈలోపు ఇడ్లీ బాబాయ్ పారిపోతాడు.
భాగ్యాన్ని చూస్తూ ‘నువ్వసలు అమ్మవేనా? ఆడదానివేనా? ఏ తల్లి అయినా కూతురికి మంచి బుద్ధులు నేర్పిస్తుంది. అత్తారింట్లో బుద్ధిగా కాపురం చేసుకోమని చెబుతుంది. నువ్వు మాత్రం నీ కూతురికి కొంపలు కూల్చడం నేర్పిస్తున్నావు. సిగ్గనిపించడం లేదా?’ అని భాగ్యానికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇక వల్లితో మాట్లాడుతూ ‘నీ పెళ్లి ఒక అబద్ధం. నీ చదువు ఒక అబద్ధం. నీ నగలు ఒక అబద్ధం. మొత్తం నీ బతుకే ఒక అబద్ధం. మీ నిజస్వరూపం గురించి, మీ మోసాల గురించి తెలిసినా కూడా మీ గురించి మావయ్య గారికి చెప్పకుండా క్షమించి వదిలేసాము. ఎందుకంటే ఎంతైనా సాటి ఆడపిల్లవని, అక్కలాంటి దానివని. ఆ క్షణం నుంచైనా బుద్ధి తెచ్చుకొని బుద్ధిగా ఉంటావనుకున్నాను. కానీ ఈ ఇంటి ఆడపిల్ల జీవితాన్ని నిప్పుల్లోకి నెట్టేస్తావనుకోలేదు. అమాయకురాలికి మాయ మాటలు చెప్పి వాడిని ప్రేమించమని రాయబారం చేసి తన జీవితాన్ని నాశనం చేస్తావా? మావయ్య గారిని చావు బతుకుల మధ్య పడేస్తావా? ఒక అక్కలాంటి నీ కాపురం కూలిపోకూడదు అని ఆలోచించి.. నువ్వు ఎన్ని తప్పులు, మోసాలు చేసిన సరే క్షమిస్తూ వచ్చాము. కానీ ఇప్పుడు నేను నిన్ను క్షమించను. ఈ రోజే నీ సంగతి తేలుస్తాను.. పదవే’ అని వల్లిని లాక్కొని వెళ్లడానికి ప్రయత్నిస్తుంది నర్మద.
కానీ అమూల్య అడ్డుకుంటుంది. గొడవ వద్దని అప్పుడే చెప్పాను కదా అని అంటుంది అమూల్య. దానికి ప్రేమ మాట్లాడుతూ ‘అబద్ధం, మోసంతో ఇంట్లో కోడలుగా అడుగు పెట్టానన్న సిగ్గు కూడా లేకుండా ఈ ఇంటి ఆడపిల్ల భవిష్యత్తు నాశనం కావడానికి కారణం అయ్యింది. ఇలాంటి దాన్ని క్షమించి వదిలేస్తే అంతకన్నా తప్పు, పాపం మరొకటి ఉండదు. అందరి ముందు దాని అంతు చూద్దాం’ అని అంటుంది. అయినా కూడా అమూల్య అడ్డుపడుతుంది. ‘తన గురించి చెప్తే నా జీవితం బాగవుతుందా? నాకు జరిగింది తిరిగి వస్తుందా? ఇప్పుడు వల్లి కాపురం కూలిపోతుందే తప్ప ఏం ప్రయోజనం ఉండదు. అసలు ఆసుపత్రిలో ఉన్న నాన్న తన పెద్ద కోడలు ఇలా చేసిందంటే తట్టుకోగలరా? ఆ బాధలో నాన్నకు ఏమన్నా అయితే నాన్నను తిరిగి తెచ్చుకోగలమా? జరిగిందేదో జరిగింది నా తలరాత ఇలా తగలబడింది. తన కాపురాన్ని సమస్యల్లో పడేయడం ఎందుకు? మీకు దండం పెడతాను. వదిలేయండి వదిన ప్లీజ్’ అని చాలా బతిమిలాడుతుంది.
అప్పుడు నర్మద మాట్లాడుతూ ‘నిన్ను పూర్తిగా క్షమించి వదిలేయడం లేదు. మామయ్య గారు ఆసుపత్రి నుంచి కోలుకొని వచ్చాక, అమూల్య సమస్యకు పరిష్కారం దొరికాక అప్పుడు నీ సంగతి చెబుతాము. అప్పటివరకు నీ పరిస్థితి ఏమవుతుంది అన్న భయంతో చస్తూ బతుకు’ అని వార్నింగ్ ఇస్తుంది నర్మద.
ఇక్కడి నుంచి సీన్ ఆస్పత్రికి మారుతుంది. నర్మద తండ్రి ప్రసాద రావు ఆస్పత్రికి వస్తాడు. రామరాజును ఐసీయూలో చూసి వేదవతిని పరామర్శిస్తాడు. ఆ సమయానికే నర్మద, ప్రేమ ఆసుపత్రికి వస్తారు. నర్మదా తన తండ్రిని చూసి చాలా ఆనంద పడుతుంది. ప్రసాద్ రావు మాట్లాడుతూ ‘ఆడపిల్ల లేచిపోయి పెళ్లి చేసుకుంటే ఏ తండ్రి పరిస్థితి అయినా ఇదేనమ్మా. ఆరోజు నీ తండ్రి పరిస్థితి కూడా ఇదేనమ్మా. నువ్వు అర్థం చేసుకున్నావా? లేదు కదా. ప్రేమించడాలు, పెళ్లి పీటల మీద నుంచి తీసుకుపోవడాలు, పెళ్లి చేసుకుని ఏదో సాధించామని కొడుకు కోడల్ని పెద్ద మనసు ఉన్నట్టు ఇంట్లోకి రానివ్వడాలు.. ఇవన్నీ చూడటానికి నలుగురిలో గొప్పగానే ఉంటాయేమో.. ఆ బిడ్డ తండ్రి బాధ ఇప్పుడు అతనికి తెలుస్తుంది. కర్మ ఎంత గొప్పదో చూశావా అమ్మ’ అని అంటాడు. దాంతో నర్మదకు కోపం వచ్చి నువ్వు ఎందుకు వచ్చావు? గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? నువ్వు ఇక్కడ ఉండడం కన్నా వెళ్లిపోవడం మంచిది అని అంటుంది. నర్మద మీరు ఏదైనా అనాలనుకుంటే నన్ను అనండి, మావయ్య గురించి నా కుటుంబం గురించి అంటే మాత్రం నేను ఊరుకోను అంటుంది. నర్మద తండ్రి సాగర్ ను తీసుకుని బయటికి వెళ్తాడు.
నర్మద తండ్రి మాట్లాడుతూ ‘సాగర్ నువ్వు ఫోన్ ఎత్తడం లేదట. ఆ ఏజెంట్ నాకు ఫోన్ చేశాడు. ఇప్పుడు ఇలా జరిగిందని తెలిసి ఆసుపత్రికి వచ్చాను. రేపే ఆఖరి రోజు అని చెప్పాడు. మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. అందుకే ఆ ఏజెంట్ అడిగిన డబ్బులు రెడీ చేసుకున్నావా? గవర్నమెంట్ జాబ్ వదులుకుంటే మళ్లీ దొరకదు. రేపు పది గంటల్లోపు ఆ డబ్బులు ఇచ్చి ఆఫర్ లెటర్ తీసుకో’ అని చెబుతాడు నర్మద తండ్రి ప్రసాదరావు. రేపు డబ్బులు తీసుకొని రా, నేను అక్కడే ఉంటాను అని చెబుతాడు. దాంతో సాగర్ ఆలోచనలో పడతాడు. సాగర్ దగ్గరికి నర్మదా వస్తుంది. నాన్నగారు ఏమన్నారు అని అడుగుతుంది. ఏమీ లేదని చెబుతాడు సాగర్. నర్మద, ప్రేమ అందరినీ భోజనానికి పిలుస్తారు. ఒక్క ముద్దయినా తినమని బతిమిలాడతారు. చందు, తిరుపతి, ధీరజ్ అందరూ భోజనం చేయలేమని చెప్పేస్తారు. ఈ లోపు రామరాజుకు స్పృహ వస్తుంది. అందరూ ఆనందపడతారు. కుటుంబమంతా రామరాజుని చూసేందుకు లోపలికి వెళ్తారు. ఇక్కడితో ఎపిసోడ్ ముగిసిపోతుంది.