
Folk Song : ఒకప్పుడు జానపదాలు అంటే పల్లెటూరు మొరటు మనుషుల పాటలు... అనాగరికంగా ఉంటాయనే అపవాదు ఉండేది. కానీ ప్రస్తుతం అవే సాంగ్స్ ఈ నాగరిక సమాజాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి... నేటి జెన్ జి లను కూడా ఆకట్టుకుంటున్నాయి. అందుకే 'రాను బొంబైకి రాను' అన్నా, 'ఓ పిలగ యెంకటేశు' అన్నా యూట్యూబ్ షేక్ అవుతోంది. కోట్ల వ్యూస్ తో తెలుగు జానపదాలు దూసుకుపోతున్నాయి.
అయితే ఈ తెలంగాణ జానపదాలను ఆంధ్రా టచ్ యాడ్ అయితే... అది తెలుగు ప్రజలందరికీ దగ్గరవుతుంది. ఇదే బుల్లెట్ బండి పాట విషయంలో జరిగింది. కాబోయేవాడికి తన వ్యక్తిగత వివరాలను ఓ అమ్మాయి వర్ణిస్తూ సాగే పాట ఇది... తెలంగాణ మాండలికంలో సాగే ఈ పాటకు ఆంధ్రా అమ్మాయి అందం తోడయ్యింది. దీంతో ''బుల్లెట్ బండెక్కి వచ్చెత్తప్పా డుగ్గుడుగ్గని'' అంటూ సాగే ఈ పాట కోట్లాది మంది మనసులు తట్టింది... ఏ పెళ్లిలో చూసినా ఇదే పాట వినిపించింది. స్వయంగా పెళ్లి కూతుళ్లు ఈ పాటపై డ్యాన్స్ చేయడం ట్రెండ్ గా మారింది. ఇలా ప్రజల్లోకి దూసుకెళ్ళిన ఈ సాంగ్ యూట్యూబ్ లో ఏకంగా 486 మిలియన్స్ అంటే 48 కోట్ల 65 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది.
మోహన్ భోగరాజు ప్రముఖ టాలీవుడ్ సింగర్. ఈమే బుల్లెట్ బండి సాంగ్ ను పాడటమే కాదు అద్భుతమైన డ్యాన్స్ తో ఆకట్టుకుంది. తెలంగాణ పల్లె పడుచులా మారి హావభావాలు అద్భుతంగా పండించింది... కానీ నిజానికి ఈమె ఆంధ్రా అమ్మాయి.
మోహన భోగరాజు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. అయితే ఈ చిన్నప్పుడే తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వలసవచ్చి స్థిరపడ్డారు... దీంతో ఆమెకు తెలంగాణ కల్చర్ అబ్బింది. అందుకే తెలంగాణ ఫోక్ సాంగ్ ను ఇంత అద్భుతంగా పాడి, ఆ పదాలకు అనువుగా పాదం కదిపి యావత్ తెలుగు ప్రజలను ఆకట్టుకుంటోంది.
ఓ పెళ్ళికూతురు భావాలను బుల్లెట్ బండి సాంగ్ లో పలికించారు రచయిత లక్ష్మణ్. దీనికి అంతే అద్భుతంగా మ్యూజిక్ అందించారు ఎస్కే బాజి. ఇక తరుణ్ కుమార్ అంతే చక్కగా కొరియోగ్రఫి చేశారు. వీటన్నింటికి మోహన భోగరాజు గాత్రం, అందం, అభినయం యాడ్ అయి ఈ పాటను మరో మెట్టు ఎక్కించాయి. అందుకే ఎప్పుడో ఐదారేళ్ళ కింద 2021 యూట్యూబ్ లో విడుదలైన ఈ పాటు ఇప్పటికీ జనాల నోళ్ళలో నానుతోంది... పెళ్లి వేడుకల్లో వినిపిస్తోంది.
పట్టు చీరను కట్టుకుని.. టికిలీ బొట్టు పెట్టుకుని... నడుముకు వడ్డాణం పెట్టుకుని... దిష్టి చుక్క దిద్దుకుని..పెళ్లికూతురులా ముస్తాబై ఉన్నా... నువ్వు ఎక్కడినుండి వస్తావో అని ఎదురుచూస్తున్నా...నీ చేతికి చెయ్యి ఇచ్చి అడుగులో అడుగు వేస్తాను.
నేను మెచ్చినవాడివి, నన్ను మెచ్చేవాడివి కాబట్టి నీ వెంట వస్తాను
నీ బుల్లెట్ బండి ఎక్కి డుగ్గుడుగ్గు అంటూ వచ్చేస్తా..
అందాల దునియాను చూపిస్తాను అంటూ ఓ పెళ్లికాబోయే అమ్మాయి భావాలతో పల్లవి సాగుతుంది.
మొదటి చరణం..
''చేమంతి, మల్లె దండలు అల్లుకున్నాను... నువ్వు నన్ను ఏలుకున్నావు కాబట్టి నీ మెడలో ఈ దండ వేస్తాను... నీ వేలు పట్టుకుని మల్లెలు జడలో పెట్టుకుంటాను... మట్టి మనుషుల్లో పుట్టాను కాబట్టి మంచి మర్యాదలు కలిగివున్నాను'' అంటూ తనగురించి చెప్పుకుంటుంది అమ్మాయి.
రెండో చరణం...
''అవ్వ చాటు ఆడపిల్లను.. మా నాన్న గుండెల్లో ప్రేమను...
ఏడు గడపలల్ల ఒక్కదాన్ని... అన్నదమ్ములకు నేనంటే ప్రాణం...పండు వెన్నెల్లో ఎత్తుకుని, వెన్న ముద్దలు పెడుతూ... మారాలు చేస్తున్నా గారాబంగా పెంచారు.
చేత్తులో పెట్టుకుని అల్లారుముద్దుగా చూసుకున్నారు.
ఇలా పెరిగిన నేను నన్నేనేనుగా నీ చేతికి ఇచ్చేసుకుంటున్నా..'' అంటూ ఆడపిల్లను తల్లిదండ్రులు ఎంత ప్రేమగా పెంచుతారో... కుటుంబసభ్యులు ప్రేమను ఎలా పంచుతారో వివరించారు.
''నా కుడికాలు నీ ఇంట్లో పెడితే సిరిసంపదలు, సంబరాలు కలుగుతాయి. నిన్ను కన్నవాళ్లను అంటే అత్తామామలను నా తల్లిదండ్రుల్లా భావిస్తా... నీ కష్టాల్లో భాగం పంచుకుంటా..
సుక్క పొద్దుకే అంటే పొద్దుపొద్దునే నిద్రలేచి, సుక్కల ముగ్గు వాకిట్లో వేసి...ఆ చుక్కలే నిన్నునన్ను చూసి మురిసిపోయేలా ఉంటా... నా ఏడు జన్మాలు నీకు ఇచ్చుకుంటా... నీ తోడులో నన్ను నేనే మెచ్చుకుంటా'' అంటూ అత్తవారింట్లో ఓ అమ్మాయి ఎలా ఉండాలో వివరించింది.
ఇలా బుల్లెట్ బండి సాంగ్ ఓ అమ్మాయి పుట్టిట్లో ఎలా ఉండాలి, అత్తవారింట్లో ఎలా ఉండాలి... తనకు కాబోయేవాడికోసం ఎంతలా తపిస్తుందో వివరిస్తూ సాగుతుంది. కాబట్టి ఈ పాట అమ్మాయిలకే ప్రతి ఒక్కరికి అంతలా నచ్చింది.