
బుల్లితెర కామెడీ షోస్లో జబర్దస్త్ ఒక ట్రెండ్ సెట్టర్. దీనికంటే ముందు ఇలాంటి షోస్ రాలేదు. ఆ తర్వాత వస్తాయని చెప్పలేం. అంతగా ఆదరణ పొందింది. సాధారణ ప్రజల నుంచి బిగ్ స్టార్స్ వరకు ఈ షోని చూసిన వాళ్లే. ఎంజాయ్ చేసినవాళ్లే. ఎవరు ఎలాంటి స్ట్రెస్ లో ఉన్నా, ఈ షో చూస్తే రిలాక్స్ కావచ్చు అనేది అందరిలోనూ పడిపోయింది. అందుకే బాగా ఇది ఆదరణ పొందింది. ఒకప్పుడు ఈ షోకి 15కిపైగా టీఆర్పీ రేటింగ్ వచ్చిన సందర్భాలున్నాయి. బుల్లితెరపై ఈ రేంజ్ టీఆర్పీ రేటింగ్ అంటే మామూలు విషయం కాదు. ఇదొక రికార్డుగా చెప్పొచ్చు. కంటిన్యూగా కొన్నాళ్లపాటు ఈ రేటింగ్ని సొంతం చేసుకుంది జబర్దస్త్.
అయితే గత మూడు నాలుగేళ్లుగా ఈ షో డౌన్ అవుతూ వస్తోంది. జడ్జ్ గా వ్యవహరించిన నాగబాబు వెళ్లిపోయినప్పట్నుంచి కాస్త డౌన్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత మరో జడ్జ్ రోజా వెళ్లిపోయింది. ఆమెకి మంత్రి పదవి రావడంతో షో నుంచి తప్పుకుంది. దీంతో షో కళే పోయింది. జడ్జ్ లుగా ఇంకా ఎవరూ సెట్ కాలేదు. చాలా మంది మారిపోయారు. ఇంద్రజ, ఖుష్బూ, భగవాన్, శివాజీ, మనో, సదా ఇలా చాలా మంది వచ్చారు వెళ్లిపోతున్నారు. రెండుగా ఉన్న షోని ఒకటి చేశారు. పాత వాళ్లని తీసుకొచ్చారు. అయినా ఈ షోకి మునుపటి క్రేజ్ మాత్రం రావడం లేదు. అందుకు మరో కారణం కూడా ఉంది. బాగా కామెడీ చేయగలిగే కమెడియన్లు కూడా వెళ్లిపోయారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, అభి ఇలా చాలా మంది షోని వీడారు. సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యేది. ఈ షోకి హైలైట్గా వీరి కాంబినేషన్ ఉండేది. అలాగే ఇమ్మాన్యుయెల్, వర్షల మధ్య కూడా అలాంటి కెమిస్ట్రీనే ఉండేది. కానీ వాళ్లు వెళ్లిపోవడం, కొందరు విడిపోవడంతో ఆ క్రేజ్ పడిపోయింది. అది షోపై ప్రభావం చూపించింది.
దీనికితోడు గ్లామర్ కి కేరాఫ్గా నిలిచిన అనసూయ కూడా ఈ షోని వదిలేసింది. షోలో అనసూయ ఉంటే ఆ రచ్చ వేరు. ఆమెపై కమెడియన్లు వేసే పంచ్ లు, డబుల్ మీనింగ్ డైలాగ్లు నవ్వులు పూయించేవి. ఆడియెన్స్ వాటిని బాగా ఎంజాయ్ చేసేవారు. ఆమె వెళ్లిపోవడంతో గ్లామర్ పాళ్లు కూడా తగ్గాయి. ఇవన్నీ జబర్దస్త్ షోకి క్రేజ్ తగ్గడానికి కారణమని చెప్పొచ్చు.
ఈ క్రమంలో దీనిపై తాజాగా జబర్దస్త్ కమెడియన్ కొమరక్క అలియాస్ కొమరం అలియాస్ కుమార్ స్పందించారు. జబర్దస్త్ షో డౌన్ కావడానికి కారణమేంటో తెలిపారు. ఒకప్పుడు జనాలకు ఎంటర్టైన్మెంట్ అంటే టీవీ, యూట్యూబ్ మాత్రమే ఉండేవి. కామెడీ షో జబర్దస్త్ ఒక్కటే ఉండేది. కానీ ఇప్పుడు చాలా మారిపోయింది. అనేక షోస్ వచ్చాయి. రీల్స్ వచ్చాయి. ప్రతి ఒక్కరు కామెడీ చేస్తున్నారు. వీడియోలు పెడుతున్నారు. జబర్దస్త్ ని మించిన కామెడీ ఇతర ఫ్లాట్ఫామ్లో దొరుకుతోంది. చిరంజీవి నుంచి సాధారణ రైతు వరకు అందరు రిలాక్స్ కోసం వాటినే చూస్తున్నారు. దీంతో ఆడియెన్స్ డివైడ్ అవుతున్నారని తెలిపారు కొమరక్క.
`నాగబాబు, రోజా, సుధీర్, హైపర్ ఆది లాంటి వాళ్లు వెళ్లిపోవడం ఓ కారణమైతే, గత పదమూడేళ్లుగా ఈ షో రన్ అవుతోంది. అప్పట్నుంచి అదే కామెడీని జనం చూస్తున్నారు. ఇంకా ఏం చేస్తారనేది, ఇంకా కొత్తగా ఏం నవ్విస్తారనేది కూడా ఆడియెన్స్ మైండ్లో ఉంది. జబర్దస్త్ షోలోనూ అదే జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్లీ నాగబాబు, రోజా జడ్జ్ లుగా రావడం కాదు కదా, చిరంజీవి వచ్చి జడ్జ్ గా చేసినా కూడా జబర్దస్త్ ని లేపలేరు` అని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు కొమరక్క. ఐడ్రీమ్కిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు.
జబర్దస్త్ షోలో ఉన్న గొడవలు మరే షోలోనూ ఉండవని, కంటెస్టెంట్లకి, డైరెక్టర్లకి, అసిస్టెంట్లకి మధ్య తరచూ గొడవలు అవుతూనే ఉంటాయని, దీంతో నిత్యం డైరెక్టర్లు మారిపోతూనే ఉంటారని తెలిపారు. అత్యంత సక్సెస్ఫుల్ షో కావడంతో ఇలాంటి సమస్య వస్తుందని వెల్లడించారు. సీరియల్స్ విషయంలోగానీ, సినిమాల్లోగానీ ఈ రేంజ్లో గొడవలు జరగవని తెలిపారు కొమరక్క. అయితే జబర్దస్త్ లో తనకు లైఫ్ ఇచ్చింది మాత్రం కిర్రాక్ ఆర్పీ అని, తాను ఈ స్థాయికి వచ్చానంటే, ఇంతటి గుర్తింపు వచ్చిందంటే అది ఆర్పీ అన్న సపోర్ట్ తోనే అని, ఐదేళ్లపాటు తనని లీడ్గా పెట్టి టీమ్ని నడిపించాడని తెలిపారు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు కొమరక్క. తాను ప్రస్తుతం జబర్దస్త్ తోపాటు అనేక ఇతర షోస్ చేస్తున్నానని, ఈవెంట్లు చేస్తున్నట్టు తెలిపారు. తనని కుమార్గా కంటే కొమరక్కగానే ఎక్కువగా ఆదరిస్తారని, ఆడియెన్స్ తనని ఓన్ చేసుకున్నారని, అది తనకు దక్కిన అదృష్టమన్నారు కొమరక్క, అలియాస్ కుమార్. ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.