
దసరా పండక్కి సాధారణంగా భారీ సినిమాల మధ్య పోటీ ఉంటుంది. పెద్ద హీరోల సినిమాలే పోటీ పడుతుంటాయి. కలెక్షన్లపై ప్రభావం పడుతుందన్నా, థియేటర్లు దొరకవు అన్నా నిర్మాతలు వెనక్కి తగ్గరు. కానీ ఈ సారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ విజయదశమికి ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం గమనార్హం. కాకపోతే రెండు డబ్బింగ్ చిత్రాలున్నాయి. తమిళ మూవీ `ఇడ్లీ కొట్టు`, కన్నడ మూవీ `కాంతారః చాప్టర్ 1` ఈ దసరాకి ఆడియెన్స్ ముందుకు వస్తున్నాయి. తెలుగు ఆడియెన్స్ కి ఈ రెండు డబ్బింగ్ చిత్రాలే దిక్కయ్యాయి. ఇందులో మరో విశేషమేంటంటే ఈ రెండు చిత్రాలకు హీరోలే దర్శకులు కావడం.
ధనుష్ హీరోగా, నిత్యా మీనన్ హీరోయిన్గా నటించిన తమిళ మూవీ `ఇడ్లీ కొట్టు`. దీనికి ధనుష్ దర్శకుడు కావడం విశేషం. ఈ మూవీని డాన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. దసరా కానుకగా ఈ చిత్రం ఒక్క రోజు ముందుగానే అంటే అక్టోబర్ 1న(బుధవారం) విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. హీరో నాన్న ఇడ్లీకొట్టు నిర్వహిస్తుంటాడు. మిషన్లతో అన్నీ చేసేయోచ్చని భావిస్తున్న తరుణంలో రుచి రావాలంటే మనషులే చేయాలని చెబుతాడు. నాన్న చేసే పని కాకుండా పట్నంలో పెద్ద ఉద్యోగం చేయాలని వెళ్తాడు హీరో. అక్కడ కొన్ని గొడవలు జరుగుతాయి. దీంతో తిరిగి ఇంటికి వస్తాడు. ఇడ్లీ కొట్టు నిర్వహిస్తుంటాడు. కానీ విలన్.. హీరోని టార్గెట్ చేస్తాడు. అతన్ని నాశనం చేయాలని చూస్తాడు. ఇడ్లీ కొట్టు లేకుండా చేయాలని చూస్తారు. మరి పట్నంలో ఏం జరిగింది? విలన్కి హీరోకి వైరం ఎక్కడ స్టార్ట్ అయ్యింది, చివరికి ఏం జరిగిందినేది ఈ సినిమా కథ అని ట్రైలర్ని బట్టి అర్థమవుతుంది. సినిమా మెయిన్గా ఎమోషనల్ సాగుతుందనిపిస్తుంది. మరి ఆడియెన్స్ ని ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి. ధనుష్ చివరగా `కుబేర` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో నాగార్జున, రష్మిక మందన్నా నటించగా, శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఇది మంచి ఆదరణ పొందింది.
ఇక మూడేళ్ల క్రితం వచ్చిన కన్నడ మూవీ `కాంతార` సంచలన విజయం సాధించింది. మొదట కన్నడలోనే విడుదలైన ఈ మూవీ అక్కడ మంచి ఆదరణ పొందడంతో ఇతర భాషల్లో డబ్ చేశారు. చిన్నగా ప్రారంభమైన ఈ మూవీ నెమ్మదిగా ఇండియా వైడ్గా విశేష ఆదరణ పొందింది. ఏకంగా సుమారు రూ.400కోట్లకుపైగా వసూళ్లని రాబట్టి రికార్డు సృష్టించింది. ఇప్పుడు దానికి ప్రీక్వెల్గా `కాంతారః చాప్టర్ 1`(కాంతార 2)ని తెరకెక్కించారు రిషబ్ శెట్టి. ఆయనే ఈ మూవీకి దర్శకుడు, హీరో కూడా. ఆయనకు సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించింది. కర్నాటకలోని సాంప్రదాయ పండుగలైన బూత కోల, పింజుర్లిని ప్రధానంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సారి మూవీ ఆథ్యాత్మిక అంశాల కంటే యాక్షన్ అంశాలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టుగా ట్రైలర్ని చూస్తుంటే అర్థమవుతుంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 2న(గురువారం) విడుదలవుతుంది. పాన్ ఇండియా మూవీగా దీన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యారు. దీంతో తెలుగులో మంచి బజ్ నెలకొంది.
మరి దసరాకి తెలుగు సినిమాలు లేకపోవడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ నటించిన `ఓజీ` ఇప్పటికే థియేటర్లలో సందడి చేస్తుండటం. ఈ మూవీ గత వారం విడుదలైన విషయం తెలిసిందే. దీనికి భారీ హైప్ ఉంది. పాజిటివ్ స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ఆడటానికి వారం గ్యాప్ ఉండాలనే ఉద్దేశ్యంతో ఎవరూ ఈ వారం రిలీజ్ చేసేందుకు సాహసం చేయలేదు. దీనికితోడు మరో కారణం కూడా ఉంది. దసరా టైమ్లో గ్రామాల్లో ఆడియెన్స్ సినిమా చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. నైజాంలో ఆడియెన్స్ సినిమాకి ప్రయారిటీ ఇవ్వరు. పూర్తిగా పండుగకే పరిమితమవుతారు. కేవలం సిటీలో మాత్రమే ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా థియేటర్ కి వెళ్తారు. ఈ క్రమంలో అది కూడా ఓ కారణమని చెప్పొచ్చు. ఇలా కారణం ఏదైనా ఈ వారం ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం గమనార్హం.