సౌత్ సినిమా పరిశ్రమలో ప్రతిభ ఉంటే చాలు, అందం ముఖ్యం కాదని నిరూపించిన నటుల్లో ధనుష్ ఒకరు. కెరీర్ బిగినింగ్ లో నటించినప్పుడు ఆయన రూపంపై విమర్శలు వచ్చాయి. ప్రేక్షకులు ఆయన్ని పట్టించుకోరని చాలామంది బహిరంగంగానే విమర్శించారు. ఆ విమర్శలను అధిగమించి తనకు నప్పే కథలను ఎంచుకుని నటించి నేడు కోలీవుడ్లో స్టార్ హీరోగా ఎదిగాడు, 40 కోట్ల పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగారు.
తన నటనా ప్రతిభతో కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ దాటి హాలీవుడ్ సినిమాల్లోనూ నటించిన ఘనత ధనుష్ది. ధనుష్ ఎదుగుదలలో ఆయన మాజీ భార్య ఐశ్వర్య పాత్ర కీలకం. ఐశ్వర్యే ధనుష్కి చాలా విషయాల్లో అండగా నిలిచారు. ధనుష్ ఇంగ్లీష్ని అనర్గళంగా మాట్లాడటానికి కూడా ఐశ్వర్యే కారణం.
ఐశ్వర్య ధనుష్ కంటే మూడేళ్లు పెద్దదైనా, ఆయన్ని ప్రేమించి 2004లో పెళ్లి చేసుకున్నారు. వీరికి యాత్ర, లింగా అనే ఇద్దరు పిల్లలు. పెళ్లై 18 ఏళ్ల తర్వాత ఇద్దరి మధ్య భేదాభిప్రాయాల కారణంగా 2022లో విడిపోతున్నట్లు ప్రకటించారు. విడాకుల గురించి ప్రకటించిన తర్వాత కూడా వీరిద్దరూ కోర్టుకు వెళ్లకపోవడంతో పిల్లల కోసం తిరిగి కలిసి జీవిస్తారని అనుకున్నారు.
కొన్ని వర్గాల ప్రకారం ధనుష్, ఐశ్వర్యల మధ్య సమస్యను పరిష్కరించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, కానీ ఐశ్వర్య విడాకుల విషయంలో మొండిగా ఉన్నారని తెలిసింది. అంతే కాదు కోర్టులో విడాకుల ప్రయత్నాలు కూడా చేశారు.
ఈ వివాదాలకు తెరదించుతూ, ఐశ్వర్య గత ఏడాది కుటుంబ న్యాయస్థానంలో విడాకుల కోసం దావా వేశారు. ఈ కేసు ఇప్పటివరకు మూడుసార్లు విచారణకు వచ్చింది. రెండుసార్లు ఐశ్వర్య, ధనుష్ ఇద్దరూ కోర్టుకు హాజరుకాలేదు. దీంతో విడాకుల కేసు వాయిదా పడింది. నవంబర్ 21న ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ కోర్టుకు హాజరై న్యాయమూర్తి ముందు విడాకులు తీసుకోవాలనే తమ నిర్ణయంలో స్థిరంగా ఉన్నట్లు తెలిపారు.
దీని తర్వాత నేడు వారి విడాకులపై తుది తీర్పు వెల్లడించారు. విడాకులను కోర్టు అంగీకరించిందని, 2004లో జరిగిన వారి పెళ్లి రద్దు అయినట్టుగా తీర్పునిచ్చింది. దీంతో ఐశ్వర్య, ధనుష్ ఇద్దరూ తమ వైవాహిక బంధం నుంచి పూర్తిగా విడిపోయారు.