చిరంజీవి వర్సెస్‌ బాలయ్య..మరోసారి బాక్సాఫీసు వార్‌కి సిద్ధం.. ఈ దసరాకి రచ్చ రచ్చే

First Published Jul 2, 2022, 6:00 PM IST

టాలీవుడ్‌ టాప్‌ స్టార్స్ చిరంజీవి, బాలయ్య బాక్సాఫీసు వద్ద పోటీ పడితే ఆ పోటీ యమ రంజుగా ఉంటుందని చెప్పొచ్చు. మరోసారి ఈ అగ్ర హీరోల మధ్య వార్‌ జరగబోతుంది. అందుకు విజయదశమి వేదిక కాబోతుంది. 

పెద్ద హీరోల మధ్య పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. నువ్వా నేనా అనేలా సాగుతుంది. ముఖ్యంగా అభిమానుల మధ్య పోటీ తారాస్థాయికి చేరుతుంది. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని, మా హీరో సినిమా అదిరిపోయిందంటే, మా హీరో సినిమా దుమ్ములేపుతుందంటూ వార్‌కి దిగుతుంటారు ఫ్యాన్స్. కలెక్షన్ల, సినిమా సక్సెస్‌ టాక్‌, డైలాగ్‌లతో సహా పోల్చి చూస్తుంటారు. నెట్టింట రచ్చ చేస్తుంటారు. 

ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi), నందమూరి నటసింహం బాలయ్య(Balakrishna) మధ్య మరోసారి పోటీ నెలకొనబోతుంది. ఈ దసరాకి ఈ ఇద్దరు బరిలోకి దిగబోతుండటం విశేషం. ఇద్దరు స్టార్ల మధ్య వార్‌ తారాస్థాయికి చేరబోతుందని చెప్పొచ్చు. జనరల్‌గా చిరు, బాలయ్యని అభిమానులు వేరుగా చూస్తుంటారు. ఇద్దరికి పడదు అని, ఇద్దరి మధ్య పోటీ ఉంటుందనే యాంగిల్‌లో చూస్తుంటారు. అదే ఒకేసారి ఇద్దరి సినిమాలు విడుదలైతే ఆ పోటీ మరింత పీక్‌లో ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

ఐదేళ్ల క్రితం చిరంజీవి కమ్‌ బ్యాక్‌ `ఖైదీ నెంబర్‌ 150` సినిమా, బాలయ్యప్రతిష్టాత్మక మూవీ `గౌతమి పుత్ర శాతకర్ణి` చిత్రాలు సంక్రాంతికి ఒక్క రోజు గ్యాప్‌తో విడుదలయ్యాయి. భారీ విజయాన్ని సాధించాయి. ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు. కాకపోతే కమర్షియల్‌గా చిరంజీవి మూవీ ఎక్కువ కలెక్ట్ చేసింది. తొమ్మిదేళ్ల గ్యాప్‌తో చిరు చేసిన సినిమా కావడంతో దానికి ఆయన అభిమానులు బ్రహ్మరథం పట్టారని చెప్పొచ్చు. 
 

అంతకు ముందు ఇద్దరి కెరీర్‌లో దాదాపు అటు ఇటు 15సార్లకుపైగా పోటీ పడ్డారు. ఎక్కువగా సంక్రాంతి పోటీ ఉండేది. ఇప్పుడు దసరా పోటీ మరింత రంజుగా మారబోతుంది. చిరంజీవి నటిస్తున్న `గాడ్‌ ఫాదర్‌`(God Father), బాలయ్య నటిస్తున్న `ఎన్బీకే107`(NBK107) చిత్రాలు ఒకేసారి విడుదల కాబోతుంది. దసరా పోటీలో నువ్వా నేనా అని తేల్చుకోబోతున్నాయి. ఇదే ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

చిరంజీవి చివరగా నటించిన `ఆచార్య` పరాజయం చెందింది. దీంతో `గాడ్‌ఫాదర్‌`పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు చిరు. ఇది మలయాళ హిట్‌ `లూసీఫర్‌` కి రీమేక్‌. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, సత్యదేవ్‌, సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని విజయదశమి కానుకగా అక్టోబర్‌ 5న విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్‌ చేస్తుంది. 

మరోవైపు బాలయ్య చివరగా `అఖండ`తో బ్లాక్‌ బస్టర్‌ అందుకుని ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. రెట్టింపు ఉత్సాహంతో ఆయన గోపీచంద్‌ మలినేనితో `ఎన్బీకే 107` చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు గోపీచంద్‌ కూడా చివరగా `క్రాక్‌`తో విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈచిత్రాన్ని కూడా అక్టోబర్‌ మొదటి వారంలోనే దసరా కానుకగా విడుదల చేయాలని భావిస్తుంది యూనిట్‌. ఆ దిశగా చిత్రీకరణ పనులు జరుపుకుంటున్నారు. 

ఒకేసారి ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు విడుదల అంటే ఆద్యంత ఆసక్తి నెలకొంది. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇప్పట్నుంచే సంబరాలకు రెడీ అవుతున్నారు. ఇద్దరికి భారీ ఫాలోయింగ్‌ ఉంటుంది. దీంతో థియేటర్ల వద్ద రచ్చ మామూలుగా ఉండదని చెప్పొచ్చు. ఒకేచోట రెండు సినిమాలు విడుదలయ్యే థియేటర్ల వద్ద ఆ హంగామా, సందడి పీక్‌లో ఉంటుందని చెప్పొచ్చు. అదే సమయంలో రెండింటిలో ఏ సినిమా తేడా కొట్టినా అదే రేంజ్‌లో మరో హీరో అభిమానులు కామెంట్లతో విరుచుకు పడటం, ట్రోల్స్ తో రెచ్చిపోవడం చేస్తుంటారు. ఏదేమైనా చిరు, బాలయ్య సినిమాలు ఒకేసారి విడుదల కావడం ఓ సందడి వాతావరణం క్రియేట్‌ అవుతుందని, టాలీవుడ్‌ కళకళలాడుతుందని చెప్పొచ్చు. 

click me!