
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తుచేసారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వాటిపై సరదాగా స్పందించారు. నాటి ప్రభుత్వ హయాంలో చంద్రబాబుని సీఐడీ అధికారులు స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అంతకంటే ముందు విచారణ నిమిత్త ఆయనను విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తరలించారు.
ఈ నేపథ్యంలో బాబును కలిసేందుకు పవన్ ప్రయత్నించారు. ఇందులో భాగంగా రోడ్డుమార్గంలో విజయవాడకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతాయని చెబుతూ ఏపీ పోలీసులు గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ఆయనను అడ్డుకున్నారు. దీంతో... పోలీసులకు, జనసేన కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ నుంచి నడుచుకుంటూ మంగళగిరి వెళ్లాలని పవన్ నిశ్చయించుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆయనను అనుమంచిపల్లిలో అడ్డుకోవడంతో నిరసనగా రోడ్డుపైనే పడుకున్నారు పవన్. అప్పట్లో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. అయితే... తాజాగా శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన బాబు నాటి ఘటనను గుర్తుచేశారు. ఇందులో భాగంగా... ఎప్పుడూ సినిమాల్లో హీరోగా కొట్టడమే తెలిసిన పవన్ కల్యాణ్ కూడా రోడ్డుపై పడుకోవాల్సి వచ్చిందని బాబు అన్నారు.
ఇదే సమయంలో... అదే సినిమాల్లో అయితే పడుకునేవారు కాదని.. అక్కడే పైకి ఎగిరి కొట్టేవారని అన్నారు. చంద్రబాబు అలా అనడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూసాయి. డిప్యూటీ సీఎం పవన్ కూడా చిరునవ్వు నవ్వారు.
అసెంబ్లీలో జగన్ పాలనలో శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో పవన్ పడిన ఇబ్బందులపై సరదా వ్యాఖ్యలు చేశారు. అవును... ఏపీలో గత ప్రభుత్వ హయాంలో పరిస్థితిపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా... 2019-24 మధ్య కాలంలో ప్రభుత్వమే హింసను ప్రేరేపించిందని, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే ఏమిటో గత ప్రభుత్వం కళ్లకు కట్టినట్లు చూపించిందని ఆయన విమర్శలు గుప్పించారు.
కాగా మహిళల మనోభావాలు దెబ్బతినేలా.. వ్యక్తిగత వ్యాఖ్యలు చేయొద్దని చంద్రబాబు హెచ్చరించారు. కుటుంబాలను రాజకీయాల్లోకి లాగొద్దని కూటమి సభ్యులకు కూడా కోరుతున్నా అన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ చేస్తే సహించేది లేదన్నారు. రూల్స్ను స్ట్రిక్ట్గా అమలు చేసేందుకు అవసరం అయితే.. సపరేట్ వింగ్ కూడా పెడతానన్నారు చంద్రబాబు.
పవన్ కల్యాణ్ ... ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో గట్టిగా వినిపిస్తున్న పేరు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీచేసిన అన్నిసీట్లలో విజయం సాధించింది పవన్ సారథ్యంలోకి జనసేన పార్టీ. ఇలా వందశాతం సక్సెస్ రేట్ తో పార్టీని గెలిపించుకోవడమే కాదు... మిత్రపక్షాలు టిడిపి, బిజెపి విజయంలోనూ పవన్ కీలకపాత్ర పోషించారు. గతంలో 151 సీట్లతో గెలిచిన వైసిపిని 11 సీట్లకు పరిమితం చేసిన క్రెడిట్ పవన్ కే దక్కింది. దీంతో రీల్ పవర్ స్టార్ కాస్త రియల్ పాలిటిక్స్ లో పవర్ ఫుల్ స్టార్ అయిపోయారు. కేవలం రాజకీయాల్లోనే కాదు పాలనలోనూ తనదైన మార్క్ చూపిస్తూ ప్రజల్లో మరింత గొప్పపేరు సంపాదించుకుంటున్నారు పవన్.