బాలీవుడ్ సినిమా పరిశ్రమ.. ఇండియన్ సినిమాని ప్రతిబింబించేది. బాలీవుడ్ హీరోలు నటించిన సినిమాలనే ఇండియన్ సినిమాలుగా భావించేవాళ్లు అంతర్జాతీయ ఆడియెన్స్. `బాహుబలి` వరకు అదే ప్రొజెక్ట్ అయ్యింది. కానీ ఆ తర్వాత అన్ని లెక్కలు మారిపోయాయి. తెలుగు సినిమా స్థాయి పెరిగింది. హీరోల స్థాయి పెరిగింది. పరిమితులు పెరిగాయి. బాలీవుడ్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత నాలుగైదు ఏళ్లుగా ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకునే సినిమాలు లేవు. గతేడాది షారూఖ్ నటించిన మూడు సినిమాలు తప్ప, మరేవీ ఆస్థాయి ఆదరణ పొందలేదు.
గతేడాది షారూఖ్.. మళ్లీ బాలీవుడ్కి పూర్వ వైభవం తీసుకొచ్చాడు. రెండు వెయ్యి కోట్ల సినిమాలు, ఒకటి నాలుగు వందల కోట్ల సినిమాని అందించి, బాలీవుడ్ పరువు నిలబెట్టాడు. కానీ మళ్లీ మొదటికొచ్చింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క హిట్ లేదు. రాబోయే రోజుల్లోనే వచ్చే పెద్ద సినిమాలు లేవు. అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ నటించిన చిత్రాలు ఆడలేదు. మున్ముందు కూడా అక్షయ్ వరుసగా సినిమాలతో రాబోతున్నారు. కానీ దేనిపైనా బజ్ లేదు. ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో బాలీవుడ్ని శాషించాడు అక్కీ. కానీ ఆయనే హిట్ కోసం స్ట్రగుల్ అవుతున్నాడు.
Bollywood Heroes
ఈ నేపథ్యంలో హిందీలో ఈ ఏడాది భారీగా చెప్పుకునే సినిమాలు ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. మరో మూడు సినిమాలతో రాబోతున్నారు అక్షయ్. కానీ వాటిపై ఇప్పటికైతే హైప్ లేదు. అజయ్ దేవగన్ రెండు సినిమాలతో రానున్నారు, వరుణ్ ధావన్ మూవీస్ కూడా ఉన్నాయి. కానీ వాటికి ఏమాత్రం బజ్ లేదు. వచ్చినా వీకెండ్, వారం వరకు మాత్రమే పరిమితమయ్యే చిత్రాలు మాత్రమే.ఈ నేపథ్యంలో నార్త్ ఆడియెన్స్ కి వినోదాన్ని పంచే మూవీస్ లేకపోవడం గమనార్హం. షారూఖ్, అమీర్, సల్మాన్, హృతిక్ సినిమాలు లేవు. దీంతో నార్త్ లో సినిమా ఎంటర్టైన్మెంట్ లోటు గట్టిగానే ఉంది. బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ఆందోళనలలో ఉన్నారు.
అయితే ఇప్పుడు నార్త్ కి తెలుగు సినిమాలే దిక్కు కాబోతున్నాయి. తెలుగు హీరోలే వారికి కాసుల వర్షం కురిపించబోతున్నారు. తెలుగు హీరోల సినిమాల వల్లే కొన్నాళ్లపాటు సర్వైవ్ కాబోతుంది. సౌత్ హీరోలపైనే డిపెండ్ కాబోతున్నారు. ఈ ఏడాది మొత్తం తెలుగు, కోలీవుడ్ హీరోలే హిందీ చిత్ర పరిశ్రమని కాపాడాల్సి వచ్చిందని బాలీవుడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ చెప్పడం విశేషం. తెలుగు హీరోల సినిమాల కోసమే వెయి చూస్తున్నారు నార్త్ ఎగ్జిబిటర్లు, బయ్యర్లు. ఆడియెన్స్ ని థియేటర్లకి తీసుకురాగలిగే హీరోల సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో తెలుగు సూపర స్టార్స్ మాత్రమే ఇప్పుడు ఎగ్జిబిటర్ల కడుపు నింపబోతున్నారు. అందుకే తెలుగు సినిమాల థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. హిందీ సినిమాలు లేకపోవడం, తెలుగులో వస్తున్నది భారీ యాక్షన్ మూవీస్ కావడంతో నార్త్ లో బాగా డిమాండ్ ఉంది. అంతేకాదు ఈ మూవీస్ కోసం వాళ్లు వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, సూర్య, కమల్ హాసన్ సినిమాలు `కల్కి2898ఏడీ`, `పుష్ప2`, `దేవర`, `గేమ్ ఛేంజర్`, `ఓజీ`, `కంగువా`, `ఇండియన్ 2` నార్త్ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాయి. అవి మాత్రమే నార్త్ థియేటర్ హోనర్లకి ఫుడ్ పెట్టబోతున్నాయి.
మొదటగా ప్రభాస్ రాబోతున్నారు. ఆయన నటిస్తున్న `కల్కి2898ఏడీ` మూవీతో వస్తున్నారు. ప్రభాస్కి నార్త్ లో మంచి మార్కెట్ ఉంది. `సలార్`తోనే దుమ్ముదుళిపారు. ఇప్పుడు `కల్కి`తో రికార్డులు షేక్ చేయబోతున్నారు. నాగ్ అశ్విన్ రూపొందించిన ఈచిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికాపదుకొనె, దిశా పటానీ నటిస్తున్నారు. అంటే నార్త్ ఆడియెన్స్ కి ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. ఈ మూవీ మే 30, లేదంటే జూన్లో రిలీజ్ కాబోతుంది.
మరోవైపు జూన్లో ఇండియన్ 2 రాబోతుందట. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో వస్తోన్న `భారతీయుడు 2` మూవీని జూన్లో విడుదల చేయబోతున్నారు. ఇందులో కాజల్, సిద్ధార్థ్, రకుల్ నటిస్తున్నారు. పైగా నార్త్ లో కమల్కి మంచి మార్కెట్ ఉంది. దీంతోపాటు కాస్టింగ్ కూడా బాగానే ఉంది. దీంతో ఆటోమెటిక్గా ఈ మూవీ జనాన్ని థియేటర్ కి రప్పిస్తుంది.సినిమా బాగుంటే దుమ్ములేపుతుంది.
ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న `పుష్ప2` రాబోతుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్. ఆమె ఇప్పటికే బాలీవుడ్లో సక్సెస్ సాధించి ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. పైగా `పుష్ప` పెద్ద హిట్. కావడంతో నార్త్ ఆడియెన్స్ `పుష్ప2` కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ నార్త్ బిజినెస్ రెండు వందల కోట్లు అని టాక్.
సెప్టెంబర్లో `ఓజీ` రాబోతుంది.పవన్ కళ్యాణ్ నటించిన చిత్రమిది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇమ్రాన్ హష్మి ఇందులో నెగటివ్రోల్ చేస్తున్నారు. శ్రియా రెడ్డి కీలక పాత్రలో కనిపిస్తుంది. వీరికి నార్త్ మార్కెట్ ఉంది. పైగా పవన్ మొదటిసారి చేస్తున్న పాన్ ఇండియా మూవీ. దీనిపై భారీ అంచనాలున్నాయి. పవన్ కి నార్త్ మార్కెట్ లేదు. కానీ అక్కడ ఈ మూవీతో సత్తాచాటుతాడని అంటున్నారు.
అక్టోబర్లో ఎన్టీఆర్ `దేవర` చిత్రంతో వస్తున్నారు ఎన్టీఆర్. ఇది పాన్ ఇండియా మూవీ. దీనిపై బజ్ గట్టిగానే ఉంది. బిజినెస్ కూడా బాగా అయ్యింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ కావడం విశేషం. దీంతో మరింత ఆసక్తి ఏర్పడింది. `దేవర` అక్టోబర్ 10కి రిలీజ్ కానుంది. ఆ నెల మొత్తం థియేటర్లకి ఫీడ్ ఇవ్వబోతుంది. దీంతో ఈ చిత్రంపైనా కూడా అక్కడ బజ్ బాగానే ఉంది.
ఇంకోవైపు నవంబర్, డిసెంబర్లో రామ్ చరణ్ వస్తారట. శంకర్ దర్శకత్వంలో ఆయన `గేమ్ ఛేంజర్` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని నవంబర్లోగానీ, డిసెంబర్లోగానీ విడుదల చేయబోతున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. పైగా నార్త్ లో చరణ్కి కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. దీంతో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు.
సూర్య కూడా ఈ ఏడాది భారీ సినిమాతో రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన శివ టీమ్తో కలిసి `కంగువా` మూవీ చేస్తున్నారు. భారీ యాక్షన్ గా ఇది తెరకెక్కుతుంది. బాబీ డియోల్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ నవంబర్, డిసెంబర్లో రానుంది. ఇలా మే, జూన్ నుంచి ప్రతి నెల ఒక్కో సినిమా రిలీజ్ కానుంది. బాలీవుడ్కి మంచి స్టఫ్ ఇవ్వబోతుంది. థియేటర్లకి ఆడియెన్స్ ని తీసుకురాబోతుంది. కాసుల వర్షం కురిపించబోతున్నాయి. ఈవన్నీ భారీ పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. సౌత్ సినిమాలు ఇక్కడే కాదు, నార్త్ ని కూడా శాషిస్తున్నాయని చెప్పొచ్చు.