
బిగ్ బాస్ తెలుగు 9 షో ఐదో వారం రన్ అవుతోంది. అయితే గతంలో మాదిరిగా అంతగా ఇంట్రెస్టింగ్గా అనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. కంటెస్టెంట్లు డల్గా ఉండటంతో కావాల్సిన కంటెంట్ రావడం లేదని, గట్టిగా ఎవరూ ఫైట్ చేయడం లేదని, చాలా సైలెంట్గా గేమ్స్ ఆడుతున్నారని నెటిజన్లు, వీక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్కి మంచి పేరొచ్చింది. ఎనిమిదో సీజన్ కాస్త డల్గా ఉందన్నారు. ఇప్పుడు తొమ్మిదో సీజన్ మరింత డల్ గా ఉందనే కామెంట్ వినిపిస్తోంది. కాకపోతే షోపై ఆసక్తిని పెంచేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు, హోస్ట్ నాగార్జున చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఏమాత్రం ఆసక్తిని పెంచలేకపోతున్నారు. ట్విస్ట్ లు, టర్న్ లు చాలా చేస్తున్నా, అవి ఆడియెన్స్ కి కిక్ ఇవ్వలేకపోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించిన ప్లాన్ జరుగుతోంది. ఈ ఆదివారం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండబోతున్నాయట.
బిగ్ బాస్ తెలుగు 9 సెప్టెంబర్ 7న 15 మంది కంటెస్టెంట్లతో షో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో సెలబ్రిటీల కేటగిరిలో శ్రష్టి వర్మ, భరణి, సంజనా గల్రానీ, ఫ్లోరా సైనీ, ఇమ్మాన్యుయెల్, తనూజ, రాము రాథోడ్, సుమన్ శెట్టి, రీతూ చౌదరీలు.. కామన్ మేన్ కేటగిరిలో డీమాన్ పవన్, హరిత హరీష్, శ్రీజ దమ్ము, ప్రియా శెట్టి, కళ్యాణ్, మర్యాద మనీష్ హౌజ్లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియాశెట్టి, హరీత హరీష్ ఇప్పటి వరకు ఎలిమినేట్ అయ్యారు. మధ్యలో దివ్య నిఖిత వైల్డ్ కార్డ్ ద్వారా మిడ్ వీక్ ఎంట్రీ ఇచ్చారు. కామన్ మేన్ కేటగిరిలో వచ్చిన దివ్య ఆట విషయంలో గట్టిగానే ఆడుతోంది. మంచి కంటెంట్ ఇస్తోంది. ఇక ఇప్పుడు వైల్డ్ కార్డ్ టైమ్ వచ్చింది. ఐదో వారంలో కొత్తగా ఆరుగురు కంటెస్టెంట్లని వైల్డ్ కార్డ్ ద్వారా హౌజ్లోకి తీసుకురాబోతున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన గేమ్ హౌజ్లో స్టార్ట్ అయ్యింది. `ఫైర్ స్టోర్మ్` పేరుతో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీలను ఆపేందుకు ప్రయత్నించాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. కంటెస్టెంట్లు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. వీరు ఆపే కంటెస్టెంట్లని బట్టి కొత్తగా ఎంత మంది ఎంట్రీ ఇస్తారనేది ఆధారపడి ఉంది.
అయితే మనకు తెలుస్తోన్న సమాచారం మేరకు బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్లోకి ఆరుగురు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారట. వారిలో ఇద్దరు సెన్సేషనల్, క్రేజీ స్టార్స్ ఉండటం విశేషం. మిగిలిన నలుగురు సాధారణ కంటెస్టెంట్లు ఉన్నారు. క్రేజీ కంటెస్టెంట్లలో మీడియా సెన్సేషన్ దివ్వెల మాధురీ ఉంది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీ జంట ఏపీలో ఎంతగా పాపులర్ అయ్యారో తెలిసిందే. వీరిద్దరు నిత్యం రీల్స్, వీడియోస్ చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. అదే సమయంలో తమ అన్యోన్యమైన బంధాన్ని మీడియా ముఖంగా వెల్లడిస్తూ రచ్చ చేస్తున్నారు. ఆ మధ్య వరుసగా మీడియా ఇంటర్వ్యూలతో తెగ హంగామా చేశారు. వీరి రచ్చ దెబ్బకి ఏపీ రాజకీయాలు కూడా పక్కకు వెళ్లాయని చెబితే అతిశయోక్తి కాదు. అంతగా తమ వ్యవహార శైలితో అందరి అటెన్షన్ తమవైపు తిప్పుకున్నారు. సోషల్ మీడియాలో తెగ రచ్చ చేశారు. ఇప్పుడు దివ్వల మాధురీ బిగ్ బాస్ హౌజ్లోకి రాబోతుందని తెలుస్తోంది. ఆమె ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యిందట.
ఇక మరో సోషల్ మీడియా సెన్సేషనల్ స్టార్ అలేఖ్య చిట్టి పికిల్స్ బ్యూటీ రమ్య మోక్ష కూడా ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం. ఆమె ప్రారంభంలోనే రాబోతుందన్నారు. ఎప్పుడో కన్ఫమ్ అయ్యిందనే టాక్ వచ్చింది. కానీ ఆమె ఎంట్రీ ఇవ్వలేదు. కాకపోతే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా ఆమెని బిగ్ బాస్ హౌజ్లోకి తీసుకురాబోతున్నారట. అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా రమ్య పాపులర్ అయిన విషయం తెలిసిందే. పికిల్స్ రేట్ అడిగిన నెటిజన్ కి బూతులతో సమాధానం ఇచ్చి వార్తల్లో నిలిచారు రమ్య సిస్టర్స్. అందులో రమ్య కాస్త గ్లామరస్గా, అందంగా ఉంది. జిమ్ వీడియోలు, గ్లామర్ ఫోటోలు పంచుకుంటూ సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. అలా అందరి దృష్టిని ఆకర్షించింది. అదే క్రేజ్ ఆమెకి బిగ్ బాస్ ఆఫర్ తెచ్చిందని సమాచారం. ఆ క్రేజ్ని వాడుకోవాలని బిగ్ బాస్ నిర్వాహకులు చూస్తున్నారు. మరి ఆమె ఎంత వరకు కంటెంట్ ఇస్తుందనేది చూడాలి.
వీరితోపాటు మరో గ్లామర్ బ్యూటీ అయేషా జీనత్ రాబోతుంది. ఆమె టీవీ, సినీ నటిగా గుర్తింపు పొందింది. కేరళాకి చెందిన జీనత్ తెలుగులో `సావిత్రిగారి అబ్బాయి`, `ఊర్వశివో రాక్షసివో` వంటి సీరియల్స్ లో నటించింది. ఆ మధ్య `కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్` షోలోనూ సందడి చేసింది. ఆమెని వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ షోకి తీసుకురాబోతున్నారట. అలాగే సీరియల్ యాక్టర్స్, యూట్యూబర్స్, ఇన్ప్లూయెన్సర్ నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా, శ్రీనివాస వంటి వారు కూడా రాబోతున్నారట. ఇలా ఆరుగురిని వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకురాబోతున్నారని సమాచారం. కమెడియన్ ప్రభాస్ శ్రీను పేరు కూడా వినిపించింది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రారంభంలో సీరియల్స్ యాక్టర్స్ దీపికా, కావ్య శ్రీ, సుహాసిని, దేబ్ జానీ, శివకుమార్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ వాళ్లెవరూ రాలేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అయినా వాళ్లు వస్తారని ఆశించిన వారిని నిరాశ తప్పదని చెప్పొచ్చు. మరి బిగ్ బాస్ నిర్వహకులు చివరి నిమిషంలో ఏదైనా ట్విస్ట్ ఇస్తారేమో చూడాలి.