కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు 5 (Bigg Boss telugu 5)లో చివరి దశలో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం ఎపిసోడ్ లో అనూహ్యరీతిలో హౌస్ నుంచి యాంకర్ రవి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. రవి ఎలిమినేషన్ అతడి సపోర్టర్స్ కి ఊహించని షాక్ గా మారింది.
Ravi కనీసం టాప్ 5 లో ఉంటాడని అంతా అంచనా వేశారు. ఆదివారం రోజు నామినేషన్స్ లో రవి, కాజల్ మిగిలారు. సన్నీ ఎవిక్షన్ ప్రీ పాస్ ని కాజల్ కోసం ఉపయోగించాడు. కానీ ఆమె ఆల్రెడీ రవి కంటే ఎక్కువ ఓట్స్ సాధించిందని.. దీనితో సన్నీ ఏవిక్షన్ ప్రీ పాస్ ఉపయోగం లేకుండా పోయిందని నాగ్ తెలిపారు.
రవి కంటే కాజల్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయంటే అతడి సపోర్టర్స్ కి నమ్మశక్యం కావడం లేదు. దీనితో బిగ్ బాస్ ఓటింగ్ ని ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది. తాజాగా పరిస్థితులు మరింత హీటెక్కాయి. రవి ఎలిమినేట్ కావడంతో అతడి అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. సోమవారం ఉదయం Annapurna Studios వద్ద ఉద్రిక్తకర పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
తెలంగాణ జాగృతి కార్యకర్తలు బిగ్ బాస్ కి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. బిగ్ బాస్ ఓటింగ్ లో కుట్ర జరిగిందని అందుకే రవి ఎలిమినేట్ అయ్యాడని వారు ఆరోపిస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా తెలంగాణ జాగృతి అధ్యక్షుడు నవీన్ గౌడ్ పాల్గొన్నారు. నిర్వాహకులు బిగ్ బాస్ షోకి వస్తున్న ఓట్లని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
పథకం ప్రకారమే రవిని ఎలిమినేట్ చేశారు. రవి కంటే వీక్ కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నారు. వారిని ఎందకు ఎలిమినేట్ చేయలేదు. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తేలాల్సిన అవసరం ఉంది అని డిమాండ్ చేశారు. ప్రేక్షకాదరణ కలిగిన బిగ్ బాస్ షోని పారదర్శకంగా నడిపించాల్సిన అవసరం ఉంది అని అన్నారు.