
ఇండియన్ సినిమాలో 80 స్టార్స్ కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ సమయంలో వరుస సినిమాలతో ఓ ఊపు ఊపేసి స్టార్స్. ఓ గోల్డెన్ ఎరాని చూసిన ఆర్టిస్ట్ లు. వారంతా ప్రతి ఏడాది కలుసుకుని ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటారు. అప్పట్లో తమ మధ్య జరిగిన ఫన్నీ విషయాలను చర్చించుకుంటారు. సరదాగా ఎంజాయ్ చేస్తారు. డాన్సులు వేస్తారు. డిన్నర్ చేస్తారు. ఆటాపాటలతో ఆద్యంతం ఎంటర్టైన్ అవుతారు. రీ ఫ్రెష్ అవుతారు. ప్రతి ఏడాది ఈ స్టార్స్ అంతా రీ యూనియర్ అవుతారు. అందుకు ఒక్కో ఏడాది ఒక్కో స్టార్ ఆతిథ్యం ఇస్తారు.
80 స్టార్స్ రీయూనియన్లో చిరంజీవి, వెంకటేష్, రమ్యకృష్ణ, మోహన్లాల్, శరత్ కుమార్, రాధిక, రాధ, నదియా, శోభన, మీనా, సుహాసిని, సుమలత, రేవతి, రమేష్ అరవింద్, జాకీ ష్రాఫ్, రెహ్మాన్, భానుచందర్, సురేష్, ఖుష్బు, సుమన్, ప్రభు, జయరాం, నరేష్, జగపతిబాబు, జయసుధ, జయప్రద, నాగార్జున, అర్జున్ వంటివారు కలుస్తుంటారు. ఇందులో టాలీవుఢ్, కోలీవుడ్, శాండల్వుడ్, మాలీవుడ్తోపాటు ఒకరిద్దరు బాలీవుడ్ స్టార్స్ కూడా ఉంటారు. ప్రతి ఏడాది తప్పకుండా వీరంతా కలుస్తుంటారు. తమ పాత గుర్తులను నెమరేసుకుంటారు. తమ సంతోషాలను పంచుకుంటారు. బాధలను షేర్ చేసుకుంటారు. ఒకరికొకరు భరోసా ఇచ్చుకుంటారు. తమ మధ్య బాండింగ్ని తెలియజేస్తుంటారు.
అయితే 80 స్టార్స్ లో కొందరు మిస్ అయిన వాళ్లు కూడా ఉన్నారు. వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది భానుప్రియ. ఆమె ఆ సమయంలో స్టార్ హీరోయిన్గా రాణించింది. దాదాపు అందరు హీరోలతోనూ నటించింది. చాలా వరకు ట్రెడిషనల్ రోల్సే చేసింది. అడపాదడపా గ్లామర్ పాత్రల్లోనూ మెరిసింది. అయితే భానుప్రియ ప్రారంభంలో ఈ రీయూనియన్లో అంటెండ్ అయ్యింది. కానీ ఆ తర్వాత రావడం మానేసింది. ఆమె ఎందుకు మిస్ అయ్యింది? ఎందుకు రావడం లేదనేది తాజాగా సీనియర్ నటుడు భానుచందర్ ఐడ్రీమ్కిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
భానుప్రియ ఫ్యామిలీలో గొడవల కారణంగా రాలేకపోయిందని వెల్లడించారు భానుచందర్. ఆ తర్వాత చాలా ప్రయత్నించినా కుదరలేదన్నారు. తను చాలా డిస్టర్బ్ గా ఉండిపోయిందని, కలవలేకపోయిందన్నారు. ఆమెని చాలా మిస్ చేస్తున్నట్టు తెలిపారు భానుచందర్. అయితే భానుప్రియ 1998లో డిజిటల్ గ్రాఫిక్స్ ఇంజనీర్ ఆదర్శ్ కౌశల్ని వివాహం చేసుకుంది. 2002లో వీరికి కూతురు అభినయ జన్మించింది. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన భాను ప్రియ కూతురు పెరిగాక యూఎస్ నుంచి ఇండియా వచ్చేసింది. చెన్నైలో ఉంటూ మళ్లీ సినిమాల్లో నటించడం స్టార్ట్ చేసింది. అలా మంచి రోల్స్ వచ్చాయి. అయితే ఆ సమయంలో తన ఫ్యామిలీలో గొడవలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆమె రాలేకపోయింది. ఇక 2018లో భానుప్రియ భర్త కౌశల్ మరణించారు. ఆ తర్వాత మరింతగా కుంగిపోయిందామే.
ఇదిలా ఉంటే ఈ 80 స్టార్స్ రీయూనియన్లో కేవలం నటీనటులు మాత్రమే హాజరవుతారు. ఫ్యామిలీ మెంబర్స్ కనిపించరు. అయితే దీని వెనుక ఓ రూల్ ఉందట. ఇందులో ఫ్యామిలీకి అనుమతి లేదట. అప్పటి హీరోహీరోయిన్లు కాబట్టి ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. అందులో లవ్ ట్రాక్లు కూడా ఉంటాయి. ఫ్యామిలీ, పిల్లలు వస్తే ఫ్రీగా మూవ్ అయ్యే ఫ్రీడమ్ ఉండదు. సరదాగా ఉండలేమని, అందుకే ఫ్యామిలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు భానుచందర్.