
గతంతో పోల్చితే ఇప్పుడు సినిమాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఒక సినిమాకి ముందు వారం వచ్చినా, ఆ తర్వాత వారం వచ్చినా కాంపిటీషన్గా భావించేవారు. ఎందుకంటే అప్పట్లో లిమిటెడ్ థియేటర్లలో సినిమాలు విడుదలయ్యేవి. కానీ ఇప్పుడు ఒకే వారం వస్తే పోటీగా భావిస్తున్నారు. ఎందుకంటే ఒకేసారి అన్ని థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. అయితే 2005లో సీనియర్లతో పోటీగా వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టారు ప్రభాస్. `ఛత్రపతి`తో ఆయన బాక్సాఫీసుని షేక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయనతో బాలయ్య, మోహన్ బాబు, రాజశేఖర్, రవితేజ వంటి బిగ్ స్టార్స్ పోటీ పడటం విశేషం. కానీ వారి సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి.
ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మూవీ `ఛత్రపతి`. వీరి కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రమిదే. ఇందులో శ్రియా శరణ్ హీరోయిన్గా నటించింది. భాను ప్రియా మదర్ రోల్ చేసింది. ఆర్తి అగర్వాల్ ఐటెమ్ సాంగ్ చేసిన ఈ చిత్రం 2005 సెప్టెంబర్ 29న విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచింది. అప్పట్లో ఇది రూ.25కోట్లు వసూలు చేయడం విశేషం. ప్రభాస్కి బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చిన మూవీ ఇది. ఇక తిరుగులేదు అనే భరోసా ఇచ్చింది. ఈ చిత్రంతోనే ఆయన సూపర్ స్టార్ అయిపోయారు.
`ఛత్రపతి`కి పోటీగా ముందు వారం, ఆ తర్వాత వారం ఐదు సినిమాలు వచ్చాయి. అదే రోజు మోహన్ బాబు, ఛార్మి నటించిన `పొలిటికల్ రౌడీ` సినిమా విడుదలయ్యింది. ఆది నారాయణ దర్శక్వంలో రూపొందిన ఈ మూవీకి మోహన్ బాబు నిర్మాత. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. ప్రభాస్ `ఛత్రపతి` దెబ్బకి అడ్రస్ లేకుండా పోయింది.
ఇక `ఛత్రపతి`కి వారం ముందు వచ్చిన చిత్రం యంగ్ హీరో రోహిత్ నటించిన `గుడ్ బాయ్`. జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోహిత్ సరసన మాజీ ఎంపీ, నటి నవనీత్ కౌర్ హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 22న విడుదలైంది. ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది. `ఛత్రపతి` దెబ్బకి అడ్రస్ లేకుండాపోయింది.
`ఛత్రపతి`కి రెండు వారాల ముందు విడుదలైన మరో సినిమా `నాయకుడు`. యాంగ్రీ యంగ్ మేన్ రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రమిది. అప్పట్లో రాజశేఖర్ హీరోగా పీక్లో ఉన్నారు. బిగ్ స్టార్స్ లో ఒకరు. దీంతో ఈ చిత్రంపై భారీ హైప్ ఉంది. పైగా కోడి రామకృష్ణ దర్శకుడు కావడం వివేశం. నమిత హీరోయిన్గా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 15న విడుదలైంది. మిశ్రమ స్పందనతో లాగుతూ వచ్చింది. కానీ `ఛత్రపతి` దెబ్బకి కోలుకోలేకపోయింది.
`ఛత్రపతి` మూవీకి వారం గ్యాప్తో బాలయ్య దిగాడు. ఆయన జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో నటించిన `అల్లరి పిడుగు` అక్టోబర్ 5న విడుదలైంది. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఆయనకు జోడీగా కత్రినా కైఫ్, ఛార్మి కౌర్ హీరోయిన్లుగా నటించారు. యాక్షన్ ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. `ఛత్రపతి` ప్రభావంతో డిజాస్టర్గా నిలిచింది.
`ఛత్రపతి`కి రెండు వారాల గ్యాప్తో మాస్ మహారాజా రవితేజ నటించిన `భగీరథ` విడుదలైంది. రసూల్ ఎల్లోర్ దర్శకత్వంలో ఈ యాక్షన్ డ్రామా చిత్రం రూపొందింది. ఇందులో శ్రియా శరణ్ హీరోయిన్గా నటించింది. డ్యామ్ నిర్మాణం ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 13న విడుదలైంది. ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఆ నెల మొత్తం `ఛత్రపతి` హవా నడిచింది. అది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇలా ప్రభాస్ తో ముందు,వెనకా పోటీ పడి ఐదు సినిమాలు, పైగా పెద్ద హీరోల సినిమాలు అడ్రస్ లేకుండా పోవడం గమనార్హం.