
నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తిరుగులేని స్టార్గా రాణిస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు. ఇటీవల బ్యాక్ టూ బ్యాక్ నాలుగు హిట్స్ అందుకుని సక్సెస్ జోరులో ఉన్నారు. ఒకప్పుడు మాత్రం బాలయ్యకి కూడా స్ట్రగుల్స్ తప్పలేదు. పెద్ద కాంబినేషన్స్ లో సినిమా చేసినా బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డారు. అయితే ఓ సారి మాత్రం అందగాడు సుమన్ దెబ్బకొట్టడం గమనార్హం. అది మామూలు దెబ్బ కాదు, ఊహించని దెబ్బ. ఆ కథేంటో చూస్తే.
బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్కి మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన `ఆదిత్య 369` చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. దీంతోపాటు `భైరవద్వీపం` కూడా బాగానే ఆడింది. అలాంటి నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి ఈ ఇద్దరి కాంబినేషన్లో `శ్రీకృష్ణార్జునవిజయం` మూవీ తెరకెక్కింది. ఈ మైథలాజికల్ మూవీలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. కృష్ణుడిగా, అర్జునుడిగా కనిపించారు. తన యాక్టింగ్తో అదరగొట్టారు. ఆయనతోపాటు రోజా, రంభ, ప్రియా రామన్, నరేష్, శ్రీహరి, శుభలేఖ సుధాకర్ వంటి వారు నటించారు. 1996 మే 15న ఈ సినిమా విడుదలైంది. ప్రారంభంలో డీసెంట్గానే ఆడింది. కానీ ఆ తర్వాత కోలుకోలేని దెబ్బతినాల్సి వచ్చింది.
బాలయ్య `శ్రీకృష్ణార్జున విజయం` విడుదలైన రెండు వారాల గ్యాప్తో సుమన్ నటించిన `నాయుడిగారి కుటుంబం` సినిమా విడుదలైంది. ఇందులో కృష్ణంరాజు ముఖ్య పాత్ర పోషించారు. రెబల్ స్టార్, సుమన్ అన్నాదమ్ములుగా నటించారు. సంఘవి హీరోయిన్గా చేసింది. బోయిన సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి రామానాయుడు నిర్మించారు. 1996 మే 30న ఈ చిత్రం విడుదలైంది. ప్రారంభం నుంచి మంచి పాజిటివ్ టాక్ని తెచ్చుకుంది. కుటుంబ కథా చిత్రం కావడం, సుమన్, కృష్ణంరాజు వంటి వారు అప్పుడు మంచి ఫామ్లో ఉండటంతో ఈ సినిమాని జనం ఎగబడి చూశారు.
సుమన్ `నాయుడిగారి కుటుంబం` మూవీ పెద్ద విజయం సాధించింది. 18 సెంటర్లలో వంద రోజులు ఆడింది. సినిమా లాభాల పంటపండటంతో నిర్మాత రామానాయుడు తన సిబ్బందికి నెల జీతం బోనస్గా ఇచ్చారు. అంతేకాదు పోలీస్ సంక్షేమ నిధికి అప్పట్లోనే రూ.25వేలు విరాళంగా ఇచ్చారు. అయితే ఈ మూవీ బాలయ్య `శ్రీకృష్ణార్జున విజయం` మూవీని కోలుకోలేని దెబ్బ కొట్టిందని చెప్పొచ్చు. అసలే మిశ్రమ స్పందనతో మూవీ రన్ అవుతుండగా, సుమన్ `నాయుడిగారి కుటుంబం` విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో బాలయ్య మూవీని జనం పట్టించుకోలేదు. దీంతో డిజాస్టర్ అయ్యింది. ఆడియెన్స్ మొత్తం సుమన్, కృష్ణంరాజుల సినిమాకి క్యూ కట్టారు. అది బ్లాక్ బస్టర్గా నిలిచింది. అలా బాలయ్య మైథలాజికల్ మూవీని సుమన్ చావు దెబ్బ కొట్టారని చెప్పొచ్చు.
ప్రస్తుతం బాలయ్య `అఖండ 2`లో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. శివతత్వం ప్రధానంగా చేసుకుని తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. సెప్టెంబర్ 25న విడుదల కావాల్సిన ఈ మూవీని ఇటీవలే వాయిదా వేశారు. మరోవైపు గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేయబోతున్నారు బాలయ్య. ఇక సుమన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. చాలా సెలక్టీవ్గా ఆయన సినిమాలు చేస్తున్నారు.