నందమూరి బాలకృష్ణ, నాగార్జున మధ్య గ్యాప్ ఉందని అంతా అంటుంటారు. ఈ ఇద్దరు కలవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఆ గ్యాప్ పెరిగిపోతూనే ఉంది. మరి దానికి కారణం ఏంటనేది ఎవరికీ తెలియని, అర్థం కానీ విషయం. ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అయితే నిజంగానే ఇద్దరి మధ్య గ్యాప్ ఉందా అనేది కూడా ఓ ప్రశ్ననే.
ఏదేమైనా ప్రచారంలో ఉన్న మాట మాత్రం బాలయ్యకి, నాగ్కి పడదు అనేది. అది కొనసాగుతూనే ఉంది. వీరిద్దరు ఎప్పుడూ ఫ్రీగా కలవకపోవడం కూడా ఆ ప్రచారానికి బలం చేకూరినట్టవుతుంది. బాలయ్య తనతోటి హీరో చిరంజీవితో అడపాదడపా కలుస్తూనే ఉంటారు. అలాగే వెంకీతో ఎవరికీ ఏ గొడవ లేదు. కానీ బాలయ్య, నాగ్ మధ్యనే ఆ గ్యాప్ ఉండిపోయింది.
అయితే ఈ ఇద్దరు కలిసి నటించాలని చాలా సార్లు అనుకున్నారట. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బాగా ఉన్నప్పుడు ప్లాన్ చేశారట. కానీ కుదరలేదు. ఏఎన్నార్ అంటే బాలయ్యకి ఇష్టం. చిన్నాన్నగా భావిస్తారు. ఆ రిలేషన్తోనే నాగ్తోనూ కలిసి నటించాలనుకున్నారు. కానీ కుదరలేదు. అయితే ఒక సినిమాలో మాత్రం ఈ ఇద్దరు మెరిశారు. ఇండస్ట్రీని అలరించారు. ఫ్యాన్స్ పండగ చేసుకునేలా చేశారు. మరి ఆ మూవీ ఏంటనేది చూస్తే..
`త్రిమూర్తులు` సినిమాలో బాలకృష్ణ, నాగార్జున కలిసి కనిపించడం విశేషం. కాకపోతే జస్ట్ గెస్ట్ రోల్స్ చేశారు. ఇది వెంకటేష్ హీరోగా రూపొందిన మూవీ. అర్జున్, రాజేంద్రప్రసాద్ మిగతా హీరోలు. కె మురళీ మోహనరావు దర్శకత్వం వహించారు. 1987లో ఈ మూవీ విడుదలైంది. ఇందులో ఇండస్ట్రీకి చెందిన అగ్ర హీరోలంతా, హీరోయిన్లంతా కలిసి కనిపించారు. ఓ సీన్ కోసం ఇండస్ట్రీని దించారు దర్శకుడు. అలా చిరంజీవి, బాలయ్య, నాగార్జునతోపాటు కృష్ణంరాజు, కృష్ణ, శోభన్బాబు, విజయశాంతి, చంద్రమోహన్, మురళీ మోహన్, పరుచూరి బ్రదర్స్, గొల్లపూడి, పద్మనాభం, రాధ, భాను ప్రియ, రాధికతోపాటు శారద, జయమాలిని, అనురాధ, వై విజయ వంటి వారు గెస్ట్ లుగా మెరిశారు.
అంతేకాదు ఇందులో అప్పటి టాప్ హీరోలు చిరంజీవి, బాలయ్య, నాగ్, వెంకీలు కలిసి కనిపించడం కూడా విశేషం. ఇదొక కనువిందు చేసే అరుదైన సందర్భం. ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కానీ ఈ మూవీ ఆడలేదు. ఇండస్ట్రీలో సగానికిపైగా యాక్టర్స్ ఇందులో కనిపించినా, సినిమా ఆడకపోవడం గమనార్హం. కథ, కథనాలు తెలుగు ఆడియెన్స్ కి ఎక్కలేదు. దీంతో జస్ట్ బిలో యావరేజ్ మూవీగా నిలిచింది. ఇలా ఇప్పుడు శత్రువులుగా కనిపిస్తున్న బాలయ్య, నాగ్ 37ఏళ్ల క్రితమే కలిసి కనిపించడం విశేషం.
ఇక ప్రస్తుతం బాలకృష్ణ.. బాబీ దర్శకత్వంలో `ఎన్బీకే109` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో `బీబీ 4` చేయబోతున్నారు. త్వరలోనే ఇది ప్రారంభం కానుంది. మరోవైపు నాగార్జున సోలోగా తన నెక్ట్స్ మూవీ ఇంకా ప్రకటించలేదు. కానీ `కుబేర`లో ధనుష్తో నటిస్తున్నారు. అలాగే `కూలీ`లో రజనీకాంత్తో కలిసి మల్టీస్టారర్ చేస్తున్నారట.