ఐకాన్ స్టార్ Allu Arjun నటించిన పుష్ప చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 17 శుక్రవారం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయింది. చాలా ప్రాంతాల్లో ప్రీమియర్, బెనిఫిట్ షోలకు రంగం సిద్ధం అవుతోంది. అయితే ఏపీలో మాత్రం అదనపు షోలు ప్రదర్శించే అవకాశం లేనట్లు వార్తలు వస్తున్నాయి. టికెట్ ధరలు, అదనపు షోల విషయంలో ఏపీలో ప్రభుత్వ నిబంధనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా సినిమా మేకింగ్ విషయంలో కూడా Pushpa చిత్రం అనేక అడ్డంకులు, సవాళ్లు ఎదుర్కొంది. అడవుల్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడం పెద్ద కష్టం ఏమీ కాదు. కానీ పుష్ప చిత్ర కథా నేపథ్యమే అడవులు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం కోసం ఆర్ట్ డైరెక్టర్స్ ద్వయం రామకృష్ణ, మోనిక పడ్డ కష్టం మాటల్లో వర్ణించలేనిది.
తాజాగా ఇంటర్వ్యూలో రామకృష్ణ, మోనికా పుష్ప చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సుకుమార్ 'రంగస్థలం' చిత్రానికి కూడా వీరిద్దరే ఆర్ట్ డైరెక్టర్స్. ఆ చిత్రంలో ఆర్ట్ వర్క్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. పుష్ప చిత్రం కోసం తామిద్దరం మూడేళ్ళ పాటు అడవుల్లోనే గడిపినట్లు రామకృష్ణ, మోనిక అన్నారు. సినిమా అడవుల్లో కాబట్టి మాకేం పని ఉంటుంది అని సుకుమార్ ని అడిగాం.. చాలా ఉంది అని అన్నారు.
రాజమండ్రి దగ్గర మారేడుమల్లి అడవుల్లో చాలా భాగం చిత్రీకరణ జరిగింది. కానీ కథకు అవసరమైన ఎర్రచందనం చెట్లు అక్కడలేవు. దీనితో కృత్రిమంగా ఎర్రచందనం చెట్లని, కొండలని సృష్టించాల్సి వచ్చింది. తొలిరోజు షూటింగ్ లోనే 1500 మంది పాల్గొన్నారు. దీనితో వేల సంఖ్యలో ఎర్రచందనం దుంగలు అవసరమయ్యేవి. ఫోమ్, ఫైబర్ కలిపి కృత్రిమంగా దుంగల్ని తయారు చేశాం.
వందలాది మంది చిన్న ఫ్యాక్టరీ తరహాలో వీటి కోసం పనిచేయాల్సి వచ్చింది. అడవుల్లో లారీల సన్నివేశం కోసం ఏకంగా రోడ్లువేయాల్సి వచ్చింది. ఇలాంటి సినిమాని మైత్రి సంస్థ తప్ప మరెవరూ చేయలేరేమో అనిపించింది. కొంత భాగం కేరళలో షూటింగ్ జరిగింది. దీనితో మేము తయారు చేసిన కృత్రిమ ఎర్ర చందనం దుంగల్ని అక్కడకు తీసుకు వెళ్లాల్సి వచ్చింది.
తిరిగి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మేము ఎర్ర చందనం దుంగల్ని రవాణా చేస్తున్నాం అనే అనుమానంతో పోలీసులు అడ్డుకున్నారు. అప్ నిజమైన ఎర్ర చందనం కాదని, తాము సినిమా వాళ్ళం అని చెప్పనా నమ్మలేదు. అవి కృత్రిమమైనవి అని నిరూపించాక వదిలిపెట్టారు. కృత్రిమ దుంగల్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు అని రామకృష్ణ, మోనిక అన్నారు.