ప్రశ్న: 'శంభో శివ శంభో', `వినాయకుడు` లాంటి కల్ట్ క్లాసిక్ తర్వాత, ఇప్పుడు రచయితగా మారుతున్నారు. ఈ కొత్త ప్రయాణం ఎలా అనిపిస్తోంది?
సూర్య తేజ్: చాలా సంతోషంగా ఉంది. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. 'శంభో శివ శంభో' రీ-రిలీజ్ ఘన విజయం సాధించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇప్పుడు రచయితగా నా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ఒక మైలురాయిగా భావిస్తున్నాను.
ప్రశ్న: మీ తొలి పుస్తకం 'నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి' గురించి చెప్పండి. దీని ప్రత్యేకత ఏమిటి?
సూర్య తేజ్: నాగపూర్ పవిత్ర "తేక్డి గణపతి" వైభవాన్ని, చరిత్రను పుస్తక రూపంలో నమోదు చేసిన ప్రపంచంలోనే మొదటి రచయితగా నిలవడం నా అదృష్టం. ఇది సంప్రదాయ కథనానికి భిన్నంగా రాసిన పుస్తకం. ఇది కేవలం భక్తి పుస్తకం కాదు, జీవితాన్ని చూసే ఒక ప్రాక్టికల్ దృక్పథం. "గణపతి అంటే జ్ఞానం". ఓర్పు, జ్ఞానంతో సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో చెప్పే మార్గదర్శి ఇది.
ప్రశ్న: ఈ పుస్తకం ఫస్ట్ లుక్ ఆవిష్కరణ ఎలా జరిగింది?
సూర్య తేజ్: సుచిర్ ఇండియా గ్రూప్ చైర్మన్ డాక్టర్ లయన్ కిరణ్ గారి చేతుల మీదుగా శ్రేయోభిలాషుల సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. ఆయన నా జీవితంలో అత్యంత స్ఫూర్తిదాయక వ్యక్తి, నా మెంటార్. నా రచయిత ప్రయాణం ఆయన చేతుల మీదుగా ఆశీర్వదించబడడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.