
పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ చిత్ర యూనిట్ మొత్తానికి ఒక పీడ కలగా మారిపోయింది. పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ, ఛార్మి, అనన్య పాండే ఇలా ఈ చిత్రంలో ఇన్వాల్వ్ అయిన ఎవరిని వదలకుండా నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేశారు.
ఈ చిత్ర పరాజయ భారం నుంచి బయట పడేందుకు పూరి ప్రయత్నిస్తున్న తరుణంలో ఇంకా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. లైగర్ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిన బయ్యర్లు, ఎగ్జిబిటర్లు దారుణంగా నష్టాలు చవిచూశారు. వీరికి సాధ్యమైనంత అమౌంట్ సెటిల్ చేస్తానని పూరి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఇంతవరకు పూరి జగన్నాధ్ తన మాట నిలబెట్టుకోకపోవడంతో బయ్యర్లు, ఎగ్జిబిటర్లు పూరిపై పోరాటం చేసేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పూరి జగన్నాధ్ కి వ్యతిరేకంగా బయ్యర్లు కోర్టుకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. బయ్యర్ల నుంచి వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో పూరి జగన్నాధ్ ఇంటికి పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. నష్టపోయిన వారికి డబ్బు ఇచ్చేది లేదు అంటూ పూరి చెప్పినట్లుగా ఉన్న ఒక వీడియో వైరల్ కూడా అవుతోంది.
పూరి పరువు తీసేందుకు కొందరు ఇలా పనిగట్టుకుని కుట్ర చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పూరి జగన్నాధ్ అభిమాని అంటూ ఒక వ్యక్తి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూరి జగన్నాధ్ ని అండగా నిలబడేలా ఆ అభిమాని ఈ లేఖ రాశారు. పూరి జగన్నాధ్ ఖ్యాతిని, మంచితనాన్ని తెలియజేసే విధంగా ఈ లేఖ ఉంది.
'అవును డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. నిజంగా ఓ మోసగాడు. పరువు తీసేద్దాం పదండి! ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్.. మైల్ స్టోన్స్ లాంటి సినిమాలను ఇచ్చి.. ఇప్పుడు ఇలాంటి కుట్రల మధ్య నలిగిపోతున్నందుకు ఖచ్చితంగా పరువు తీసేయాలి. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరికీ, ఒక్కో మార్క్ క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు కదా.. మోసగాడు అనే ముద్ర తప్పకుండా వేయాల్సిందే. దర్శకుడిగా, నిర్మాతగా తాను వందల కోట్లు నష్టపోయినా.. ఎప్పుడూ ఎవరి పేర్లు బయట పెట్టనందుకు, ఎవరినీ బాధ్యులను చేయకుండా పల్లెత్తు మాట కూడా అనకుండా ఉన్నందుకు పక్కాగా కుటుంబంతో సహా రోడ్డుకు లాగాలి.
అవును.. తాను సమాజంలో పరువుగా బ్రతకాలని అనుకుని.. ఇన్నాళ్లు ఎవరి పరువు తీయకుండా ఉన్నందుకు బుద్దొచ్చేలా పరువు తీయాలి. తనను ఎంతోమంది మోసగించినా.. ఎన్ని ప్లాప్స్ వచ్చినా.. బ్లాక్ బస్టర్స్ తో బౌన్స్ బ్యాక్ అయ్యే డాషింగ్ డైరెక్టర్ ని ఇలాగే పరువు తీసి సత్కరించాలి.
జీవితంలో సంపాదించుకున్నవన్నీ ఓసారి కోల్పోయి.. మళ్లీ ఒకటి నుండి జీవితాన్ని స్టార్ట్ చేసి ఈ స్థాయికి ఎదిగి చూపించాడు. అలా ఆదర్శంగా నిలిచినందుకైనా మనం పూరి తాట తీసేయాలి. పదండి! ఇప్పటికైనా ఆలస్యం అయ్యింది లేదు.. గొప్ప సినిమాలు, గొప్ప హిట్స్ ఇచ్చినప్పుడు అన్నీ మూసుకొని.. ఆయన ఇంటి చుట్టూ తిరిగిన రోజులను మర్చిపోయి.. ఇప్పుడు విచక్షణ రహితంగా ప్రవర్తిద్దాం. ఎందుకంటే.. డబ్బుకున్న విలువ మనుషులకు లేని రోజుల్లో మనం బ్రతుకుతున్నాం.. అది నిజమని ప్రూవ్ చేయడానికైనా పూరి జగన్నాథ్ పరువు తీసేద్దాం.
లైగర్ సినిమాతో అందరికన్నా ఎక్కువగా నష్టపోయి.. అయినా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎక్జిబిటర్స్ కి ఎంతోకొంత అరేంజ్ చేస్తానని చెప్పిన మంచితనాన్ని నిందలు వేసి చంపేద్దాం! ఇంకోసారి ఇలా అన్ని కోల్పోయినా.. మంచితనంతో బ్రతకొద్దని, ఎవడ్ని లెక్క చేయొద్దని.. స్వార్థానికి ఎక్కువ వాల్యూ ఇవ్వుమని గుర్తుచేద్దాం. ఒక ఇడియట్, అమ్మానాన్న తమిళమ్మాయి, బద్రి, పోకిరి, దేశముదురు, బిజినెస్ మ్యాన్, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చినందుకు.. తనకు తానే సిగ్గుపడేలా తాట తీసేద్దాం!
ఆల్రెడీ పూరి చెప్పినట్లుగానే సినీ ప్రపంచంలో పెద్ద గ్యాంబ్లింగ్ నడుస్తుంది. కాకపోతే సినిమా అనేది వ్యాపారంతో కూడిన జూదం. కొన్ని సినిమాలు ఆడతాయి.. కొన్ని పోతాయి. మామూలుగా సినిమాలు పోతే డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగి ఇచ్చేవాళ్ళు చాలా అరుదు. అయితే.. లైగర్ విషయంలో నష్టపోయినందుకు డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగిచ్చేందుకు పూరి సిద్ధపడ్డాడు. ఆ విషయాన్నీ కూడా క్లియర్ గా చెప్పుకొచ్చాడు. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. సినిమా పోయిందని చెప్పి డబ్బులు తిరిగి అడుగుతున్నారు.. అదే సినిమాలు బాగా ఆడి లాభాలు వస్తే.. వచ్చిన ఎక్కువ డబ్బులను తిరిగి ప్రొడ్యూసర్లకు ఇస్తారా? ఆలోచించాలి అంటూ అభిమాని బయ్యర్లని, ఎగ్జిబిటర్లని దుమ్మెత్తి పోస్తూ పూరికి సపోర్ట్ గా ఈ లేఖ రాశారు.