అల్లు అర్జున్, రష్మిక కాంబినేషన్ లో సుకుమార్ రూపొందించిన చిత్రం ‘పుష్ప2’ (Pushpa 2 The Rule). మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 5న విడుదలై సూపర్ హిట్టైంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
తాజాగా నెట్ఫ్లిక్స్ ఓటీటీలోనూ అడుగెట్టి దుమ్ము దులుపుతోంది. ఈ సందర్భంగా చిత్ర టీమ్ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. సినిమా కోసం పనిచేసిన టీమ్ కి షీల్డ్లు అందించింది. అల్లు అర్జున్ ఈ మీట్ లో ఎమోషనల్ గా మాట్లాడారు. ఆ పూర్తి స్పీచ్ ఇక్కడ ఇస్తున్నాం.
అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘‘ మైత్రీ మూవీ మేకర్స్ లేకుండా ఇలాంటి మూవీ తీయడం సాధ్యం కాదు. ప్రతి విభాగం ఎంతో కష్టపడి పనిచేసింది. సాంగ్స్కు మిలియన్ వ్యూస్ చూసినప్పుడు ఎలా వస్తాయా? అనుకునేవాడిని. దేవిశ్రీ వాటిని బిలియన్స్లో చూపించాడు. చాలా మంది కొరియోగ్రాఫర్లు హీరోలకు స్టెప్స్ నేర్పుతారు. కానీ, గణేశ్ ఆచార్య మాత్రం హావభావాలు ఎలా పలికించాలో చూపించారు. దర్శకుడు విజన్ను తెరపై తీసుకురావడంలో ఆయన ప్రతిభ కనపడుతుంది.
ఏదైనా ఫైట్ సీన్లో ఒకట్రెండు రోప్షాట్స్ ఉంటాయి. కానీ, నవకాంత్ చేసిన క్లైమాక్స్ ఫైట్ను 18-20 రోజులు తీస్తే, దాదాపు అన్నీ రోప్షాట్స్ పెట్టారు. అన్ని రోజులు తీసినా, నాకు చిన్న గీత కూడా పడలేదు. అది ఆయన సామర్థ్యం. ‘పుష్ప’ ఉన్న ప్రతీ చోటా రష్మిక ఉంటుంది. అలాగే ఫహద్ ఫాజిల్ ఈ సినిమాకు ఎంతో బలాన్నిచ్చారు. ‘పుష్ప2’ వస్తోందని, హిందీ సినిమా విడుదల తేదీని కూడా మార్చుకుంది. ప్రతి ఇండస్ట్రీ చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు’’
‘‘ఒక సినిమాకు సంబంధించి అందరూ బాగా చేయొచ్చు. కానీ, హిట్ ఇచ్చేది మాత్రం దర్శకుడు ఒక్కడే. నటీనటులు ఎంత కష్టపడినా దర్శకుడు సరిగా చేయకపోతే, అది హిట్ కాదు. అలాగే నటీనటులు సరిగా చేయకపోయినా దర్శకత్వం బాగుంటే, ఆ సినిమా కచ్చితంగా ఆడుతుంది. ఇన్ని వేల మంది పనిచేశాం. మనం థ్యాంక్స్ చెప్పాల్సింది సుకుమార్కే.
‘పుష్ప’లో నటనకు గానూ చాలా మంది నుంచి ప్రశంసలు వచ్చాయి. ఒక సినిమాలో పాట, ఫైట్, డ్యాన్స్ ఇలా ఏది బాగున్నా, దర్శకుడు దానికి అవకాశం ఇవ్వడం వల్లే వచ్చింది. నేను బాగా నటించానంటే, అందుకు కారణం సుకుమారే. సరైన మార్గనిర్దేశం లేకుండా ఏ నటుడు మంచి నటుడు కాలేడు. అతడు ఎంత గొప్ప స్టార్ అయినా కూడా. నన్ను గైడ్ చేసినందుకు థ్యాంక్స్’’
‘‘ఆయన కలల నుంచి పుట్టిన పాత్రలమే మేమంతా. థియేటర్లో ఒక్క మనిషే మాట్లాడతాడు. అతడే దర్శకుడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ మిమ్మల్ని చూసి గర్వపడుతోంది. సుకుమార్ పర్సన్ కాదు.. ఎమోషన్. కొవిడ్లాంటి క్లిష్ట పరిస్థితులను దాటుకుని సినిమాను షూట్ చేశాం. వందల, వేల మంది దర్శకుడు సుకుమార్ ఏది చెబితే ఫాలో అయ్యాం. అందుకే షూటింగ్ చివరి రోజు దేవుడికి ఒక్కటే నమస్కారం పెట్టుకున్నా.
ఇంత మంది కష్టానికి అర్థవంతమైన గుర్తింపు ఉండాలని, ఈ సినిమా కచ్చితంగా హిట్ కావాలని కోరుకున్నా. మా అందరి జీవితాలను అర్థవంతం చేసినందుకు సుకుమార్కు ధన్యవాదాలు. ఐదేళ్ల షూటింగ్ అసలు ఈ సినిమా అవుతుందా? అనిపించింది. ఈ విజయాన్ని నా అభిమానులకు అంకితం చేస్తున్నా. నా ఆర్మీని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటా. మిమ్మల్ని మరింత గర్వపడేలా చేస్తా. ‘పుష్ప3’.. అదేంటో నాకు, మీకు (సుకుమార్) తెలియదు. కానీ, అదొక అద్భుతమైన ఎనర్జీలా ఉంది. అదెప్పుడు కార్యరూపం దాలుస్తుందో చూడాలి’’ అని అన్నారు.