ఉన్ముక్త్ చంద్ సంచలన నిర్ణయం... టీమిండియాకి రిటైర్మెంట్ ప్రకటన..

First Published Aug 13, 2021, 4:59 PM IST

2012 అండర్-19 వరల్డ్‌కప్ గెలిచి, అందరి దృష్టినీ ఆకర్షించిన యంగ్ సెన్సేషనల్ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్. అయితే నేమ్, ఫేమ్ వచ్చినంత ఈజీగా ఉన్ముక్త్ చంద్‌కి సరైన అవకాశాలు దక్కలేదు, దక్కిన అవకాశాలను చక్కగా వినియోగించుకోలేకపోయాడు. 9 ఏళ్లుగా టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న ఉన్ముక్త్ చంద్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియాకి రిటైర్మెంట్ ప్రకటించి, యూఎస్ తరుపున క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 130 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 111 పరుగులు చేసి అజేయంగా నిలిచిన ఉన్ముక్త్ చంద్... దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. 

ఉన్ముక్త్ చంద్ కెప్టెన్సీలో అండర్19 వరల్డ్‌కప్ ఆడిన హనుమ విహారి, భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు, సందీప్ శర్మ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ప్రధాన బౌలర్‌గా మారాడు. కానీ ఉన్ముక్త్ చంద్ మాత్రం ఇటు టీమిండియాలోకి రాలేక, అటు ఐపీఎల్‌కి కూడా దూరమయ్యాడు..

ఉన్ముక్త్ చంద్‌తో కలిసి 2012 అండర్-19 వరల్డ్‌కప్ ఆడిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ స్మిత్ పటేల్, కొన్నాళ్ల కిందటే టీమిండియాకి రిటైర్మెంట్ ప్రకటించి, కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు.  
 

ఆ సమయంలోనే ఉన్ముక్త్ చంద్ కూడా ఇండియా నుంచి వెళ్లిపోతున్నాడని టాక్ వినిపించింది. అయితే అప్పుడు ఆ వార్తలను కొట్టేసిన ఉన్ముక్త్, మరోదారి లేక టీమిండియాలో పెరిగిపోతున్న విపరీతమైన పోటీని తట్టుకోలేక అమెరికా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు.

2012 అండర్ 19 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత వచ్చిన క్రేజ్ కారణంగానే మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనా, విరాట్ కోహ్లీలతో కలిసి పెప్సీ యాడ్‌లో కలిసి నటించాడు ఉన్ముక్త్ చంద్.... అండర్ 19 వరల్డ్‌కప్ జట్లకి సారథ్యం వహించిన మహ్మద కైఫ్, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, పృథ్వీషా వంటి వాళ్లు భారత జట్టులో అద్భుతంగా రాణిస్తే, ఉన్ముక్త్ చంద్‌కి టీమిండియా నుంచి పిలుపు కూడా రాలేదు...

ఢిల్లీలో జన్మించిన ఉన్ముక్త్ చంద్, అండర్19 వరల్డ్‌కప్ విజయం తర్వాత ఇండియా ఏ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహారించాడు. అలాగే దేశవాళీ క్రికెట్‌లో కూడా ఢిల్లీ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహారించేవాడు. అయితే 2016 ఏడాదిలో అతని జీవితం ఒక్కసారిగా అతలాకుతలం అయిపోయింది.


‘ఢిల్లీ వన్డే టీమ్‌ నుంచి నన్ను తొలగించడం నాకు ఇప్పటికీ చాలా పెద్ద షాక్. ఇండియా ఏ జట్టుకి కెప్టెన్‌గా ఉన్న నేను, బాగానే పరుగులు చేస్తున్నా, జోనల్ టీ20 క్రికెట్ ఆడుతున్నా. ఆ సమయంలో వన్డే జట్టు నుంచి తప్పించింది ఢిల్లీ క్రికెట్ బోర్డు

శిఖర్ ధావన్, గౌతమ్ గంభీర్‌లతో క్రికెట్ ఆడుతున్న నన్ను, టీమ్ నుంచి తప్పించిన సెలక్టర్లు... ‘నీకోసం వేరేది ఎదురుచూస్తోంది. అందుకు నువ్వు ప్రిపేర్ అవ్వాలి. అందుకే టీమ్ నుంచి తొలగించాం’ అని చెప్పారు. నన్ను టీమిండియాకి సెలక్ట్ చేయబోతున్నారేమోనని ఆశపడ్డాను... కానీ ఆ తర్వాత వరుసగా నా కెరీర్ పతనం అవ్వడం మొదలైంది...’ అంటూ నిరాశగా చెప్పుకొచ్చాడు ఉన్ముక్త్ చంద్.

‘ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరుపున ఆడినప్పుడు మొదటి మూడు మ్యాచుల్లో మా జట్టు ఓడిపోయిన తర్వాత నాకు టీమ్‌లో అవకాశం దక్కింది. ఆ తర్వాత రెండు మ్యాచుల్లో 75, 80 పరుగులు చేసి రెండుసార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు కూడా గెలుచుకున్నాను.. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చాను. సీజన్లు గడుస్తున్నా, జట్టులో ఆడే అవకాశం మాత్రం రాలేదు. నన్ను అలాగే రిటైన్ చేస్తూ వచ్చారు... బేస్ ప్రైజ్‌కి అయినా వేరే జట్టు తరుపున ఆడితే చాలనుకున్నా... కానీ ఆ తర్వాత ఐపీఎల్ వేలంలో నన్ను ఎవ్వరూ కొనుగోలు చేయలేదు.  అది నా కెరీర్‌ను నాశనం చేసింది.’ అంటూ చెప్పుకొచ్చాడు ఉన్ముక్త్ చంద్

‘2017లో మొట్టమొదటిసారిగా ఇండియా ఏ జట్టు నుంచి దూరమయ్యాను. అదే ఏడాది ఐపీఎల్ నుంచి కూడా... అదృష్టం నాకెప్పుడూ దూరంగానే ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు ఉన్ముక్త్ చంద్. 

ఢిల్లీ నుంచి దూరమైన తర్వాత 2019లో ఉత్తరాఖండ్‌కి వెళ్లిన ఉన్ముక్త్ చంద్, ఆ జట్టుకి కెప్టెన్‌గా కూడా వ్యవహారించాడు. అయితే వరుస పరాజయాల తర్వాత అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించింది ఉత్తరాఖండ్. 

ఇక్కడ అవకాశాలు, అదృష్టం కలిసిరాకపోవడంతో యూఎస్ క్రికెట్ లీగ్‌లో పాల్గొనేందుకు ఉన్ముక్త్ చంద్, అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.. ‘అమెరికాలో మా బంధువులను కలిసేందుకు వెళ్తున్నా, యూఎస్ లీగ్‌లో పాల్గొనబోతున్నాననే వార్తల్లో నిజం లేదు’ అంటూ కొన్నాళ్ల కిందట కామెంట్ చేసిన ఉన్ముక్త్ చంద్, కొన్ని రోజులకే నిర్ణయం మార్చుకున్నాడు.

click me!