ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు.. జరుగుతున్న క్రమంలో కూడా అత్యంత చర్చనీయాంశమేమైనా ఉందా..? అంటే అది కచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ రిటైర్మెంట్ గురించే అని చెప్పక తప్పదు. బ్రాడ్కాస్టర్ల అత్యుత్సాహమా లేక ధోని ఇస్తున్న హింట్సో తెలియదు గానీ ఈ విషయంలో తీవ్ర చర్చ జరుగుతున్నది.
Image credit: PTI
ఐపీఎల్ -16 తర్వాత ధోని రిటైర్ అవుతాడని, వాస్తవానికి గత సీజన్ లోనే మహి ఆటకు గుడ్ బై చెప్పాలని భావించినా చెన్నై దారుణంగా విఫలమవడం.. పాయింట్ల పట్టికలో ఆ జట్టు 9 వ స్థానంలో నిలవడంతో ధోని మసను మార్చుకున్నాడని కూడా చర్చ జరిగింది.
ప్రస్తుత సీజన్ లో ఎలాగైనా సీఎస్కేను గెలిపించి రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఐపీఎల్ -16 ప్రారంభం నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే చెన్నై కూడా ఈ సీజన్ లో పుంజుకుంది. ఈ ఎడిషన్ లో చెన్నై 9 మ్యాచ్ లు ఆడితే ఐదింటిలో గెలిచి నాలుగు ఓడింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్ రేసులో పోటీ పడుతోంది.
కాగా తాజాగా పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ తర్వాత కూడా ఇదే చర్చ (ధోని రిటైర్మెంట్) మళ్లీ మొదలైంది. దీనిపై తాజాగా సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. అసలు అలాంటిదేమీ లేదని, దానిపై ధోని తమ (టీమ్ మేనేజ్మెంట్) కు ఇంతవరకూ ఏమీ సమాచారం ఇవ్వలేదని చెప్పాడు.
పంజాబ్ తో మ్యాచ్ ముగిశాక ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ‘లేదే. అతడు (ధోని) మాకు అలాంటి సమాచారమేమీ చెప్పలేదు. అది బయట జరుగుతున్న చర్చనే..’అని చెప్పాడు. ఐపీఎల్ -16లో ధోని ఆఖరి ఓవర్లలో బ్యాటింగ్ కు వస్తున్నా అదరగొడుతున్నాడని, రిటైర్మెంట్ అనేది ధోని వ్యక్తిగత అభిప్రాయమని సీఎస్కే వర్గాలు తెలిపాయి.
ఇటీవల ఈడెన్ గార్డెన్ లో కేకేఆర్ తో మ్యాచ్ సందర్భంగా స్టేడియానికి వచ్చిన అభిమానులను ఉద్దేశించి ధోని స్పందిస్తూ.. ‘ఇక్కడికి వచ్చినవారందరికీ కృతజ్ఞతలు. చాలా మంది సీఎస్కే జెర్సీలు వేసి కనిపిస్తున్నారు. కానీ వీరిలో చాలా మంది తర్వాత మ్యాచ్ లో కేకేఆర్ జెర్సీలు వేసుకుంటారు. వాళ్లు నాకు ఫేర్వెల్ ఇవ్వడానికి ఇలా వచ్చారు. ఏదేమైనా అందరికీ నా కృతజ్ఞతలు..’ అని చెప్పాడు.