
Most Educated Indian Cricketer : టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ మహేంద్రసింగ్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఉద్యోగాన్ని కలిగివున్నారు... యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ ఏకంగా రిజర్వ్ బ్యాంక్ ఇండియా (RBI) అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం చేస్తున్నారు… ఇక మన హైదరబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ తెలంగాణ పోలీస్ శాఖలో డిఎస్పి ఉద్యోగాన్ని కలిగివున్నారు. ఇలా చాలామంది క్రికెటర్లు ఉన్నతస్థాయి ప్రభుత్వ ఉద్యోగాలను కలిగివుంటారు... దీంతో వీళ్లంతా పెద్దపెద్ద చదువులు చదివారని అనుకుంటే పొరబడినట్లే. వీళ్లంతా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను పొందినవారే.
సాధారణంగా ఏ పిల్లాడైనా స్పోర్ట్స్ లో మంచి ప్రతిభ చూపిస్తున్నాడు అంటే చదువులో వెనకబడ్డాడనే అనుకుంటారు. ఎందుకంటే ఆటపై పెట్టిన శ్రద్ద చదువుపై పెట్టరని భావిస్తారు. కానీ ప్రజల్లోని ఈ ఆలోచనను కొందరు క్రికెటర్లు మార్చే ప్రయత్నం చేస్తున్నారు... ఇందులో ముందున్నాడు యువ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్. అతడు ఆటను, చదువును బ్యాలెన్స్ చేస్తున్నాడు.... అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదిగినా చదువును నిర్లక్ష్యం చేయడంలేదు. ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లలో ఎక్కువ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగివుంది ఇతడే... ఏం చదువుతున్నాడో తెలుసా?
భారత్లో క్రికెట్ ఒక ఆట మాత్రమే కాదు, అదొక మతం. అందుకే మన ప్లేయర్లను అభిమానులు నెత్తిన పెట్టుకుంటారు… ఓడితే కూడా అలాగే విమర్శిస్తారు. స్టార్ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వాళ్లు ఎన్నో రికార్డులు సృష్టించారు... ఇలా పరుగుల వరద పారించడంలో టాప్లో ఉన్న వీళ్లు చదువులో మాత్రం కాస్త వెనకబడ్డారు. టీమిండియా ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ మాత్రం అటు ఆట, ఇటు చదువు రెండింటిలోనూ సూపర్స్టార్ గా నిలిచాడు.
క్రికెట్ ఫీల్డ్లో స్టార్గా ఉన్న అయ్యర్, త్వరలో తన పేరు ముందు 'డాక్టర్' అని కూడా చేర్చుకోబోతున్నాడు. గత కొన్నేళ్లుగా అతడు ఫైనాన్స్లో పీహెచ్డీ (PhD) చేస్తున్నాడు... అయితే ఇంకా అది పూర్తి కాలేదు. వెంకటేశ్ అయ్యర్ ఇంతకుముందే ఫైనాన్స్లో ఎంబీఏ (MBA) పట్టా పొందాడు. ఎంబీఏ తర్వాత అతనికి ప్రముఖ 'డెలాయిట్' (Deloitte) కంపెనీలో ఉద్యోగం వచ్చింది… కానీ క్రికెట్పై ఉన్న ఇష్టంతో ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాడు. అంతేకాదు ఇతను చార్టర్డ్ అకౌంటెంట్ (CA) ఇంటర్మీడియట్ పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో వెంకటేశ్ అయ్యర్ ఒకరు. 2021లో ఐపీఎల్లోకి అడుగుపెట్టాడు… అప్పుడు అతడికి కోల్ కతా నైట్ రైడర్స్ (KKR) టీం కేవలం రూ.20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. తొలి సీజన్లోనే అదరగొట్టి కెకెఆర్ జట్టును ఫైనల్స్కు తీసుకెళ్లడంలో అయ్యర్ కీలకంగా వ్యవహరించాడు. దీంతో మరుసటి ఏడాదే అతని జీతాన్ని కెకెఆర్ యాజమాన్యం రూ.20 లక్షల నుంచి రూ.8 కోట్లకు పెంచింది. ఇది దాదాపు 3,900% పెరుగుదల.
2025లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో వెంకటేశ్ అయ్యర్ను కొనేందుకు చాలా జట్లు పోటీపడ్డాయి. ఈ వేలంలో ఏకంగా రూ.23.75 కోట్లు చెల్లించి మరీ అతడిని జట్టులోనే ఉంచుకుంది కెకెఆర్. కానీ 2026 సీజన్కు ముందు కెకెఆర్ అతన్ని వదిలేసింది... దీంతో కేవలం రూ.7 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) దక్కించుకుంది. ఇలా అతను ఇప్పటివరకు ఐపీఎల్ ద్వారా రూ.55 కోట్లు సంపాదించాడు.
ప్రస్తుతం ఐపిఎల్ లో అద్భుత ప్రదర్శన చేస్తున్న వెంకటేశ్ అయ్యర్ టీమిండియాలో చోటు కోసం ప్రయత్నిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్ లోనూ నిలకడగా రాణిస్తున్నాడు... మధ్యప్రదేశ్ జట్టుకు ఆల్రౌండర్గా అద్భుతంగా ఆడి ఎన్నో విజయాలు అందించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలవడంలో ఇతను కీలక పాత్ర పోషించాడు.
వెంకటేశ్ అయ్యర్ లాగే మాజీ క్రికెటర్ ఆవిష్కర్ సాల్వి కూడా పిహెచ్డి చేశారు.అయ్యర్ ఫైనాన్స్ లో చేస్తుంటే ఈయన ఏకంగా ఆస్ట్రోఫిజిక్స్ లో పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు. వీరి స్థాయిలో పిహెచ్డిలు చేయకున్నా డిగ్రీలు చదివిన క్రికెటర్లు చాలామందే ఉన్నారు. మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే మెకానికల్ ఇంజనీరింగ్, జవగల్ శ్రీనాథ్ ఇంన్స్ట్రుమెంటల్ టెక్నాలజీ పూర్తిచేశారు. రవిశంద్రన్ అశ్విన్ కూడా బిటెక్ చదివాడు. ఇప్పుడున్న యువ క్రికెటర్లు కూడా చదువును, ఆటను బ్యాలెన్స్ చేస్తున్నవారే… చాలామంది హయ్యర్ ఎడ్యుకేషన్ పూర్తిచేశారు.