Ind Vs SA: కేప్టౌన్ పిచ్ ఎలాంటిదో మాకు తెలుసు.. అక్కడ టీమిండియాకు భరతనాట్యమే.. సఫారీ సారథి ఎల్గర్ వార్నింగ్

First Published Jan 9, 2022, 5:43 PM IST

India Vs South Africa: ఈనెల 11 నుంచి కేప్టౌన్ వేదికగా జరుగబోయే తుది టెస్టు కోసం తాము సర్వం సిద్ధమయ్యామని అంటున్నాడు సఫారీ సారథి డీన్ ఎల్గర్.. ఈ టెస్టులో టీమిండియాకు ఓటమి తప్పదని  అతడు కామెంట్స్ చేస్తున్నాడు.

dean elgar

దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా.. ఈ నెల 11 నుంచి  సిరీస్ విజేతను నిర్ణయించే కేప్టౌన్  లోని న్యూలాండ్స్ మైదానంలో  మూడో టెస్టు ఆడనున్నది. 
 

అయితే ఈ టెస్టులో భారత జట్టును తమ పేసర్లు ముప్పు తిప్పలు  పెట్టనున్నారని అంటున్నాడు దక్షిణాఫ్రికా సారథి డీన్ ఎల్గర్. తమ పేస్ దళంతో భారత్ కు చుక్కలు చూపిస్తామని అతడు అన్నాడు.

ఎల్గర్ మాట్లాడుతూ.. ‘మూడో టెస్టు మాకు చాలా ముఖ్యమైనది. జోహన్నస్బర్గ్ లో ఆడినట్టే ఇక్కడ కూడా ఆడాలని మేం అనుకుంటున్నాం. మూడో టెస్టును గెలుస్తామనే నమ్మకం మాకుంది. 

కేప్టౌన్ లో పరిస్థితులపై మాకు పూర్తి అవగాహన ఉంది. ఇక్కడి పిచ్ పేసర్లకు స్వర్గదామం. ఇక్కడ భారత బ్యాటర్లకు కష్టాలు తప్పవు. మా పేస్ బౌలింగ్ దళం బలంగా ఉంది. వాళ్లు టీమిండియాను ముప్పుతిప్పలు పెడతారు. 

నా వరకు నేనైతే జోహన్నస్బర్గ్ టెస్టును చాలా ఆస్వాదించాను. ఒక సారథిగా నేను అలాంటి టెస్టులను లీడ్ చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తాను. నా చిన్నతనం నుంచే సవాళ్లను స్వీకరించడం నాకు  అలవాటైంది..’ అని చెప్పుకొచ్చాడు. 

ఎల్గర్ చెప్పినట్టే కేప్టౌన్ పిచ్ పేసర్లకు అనుకూలిస్తుంది. ఇక్కడ రబాడ, ఎంగిడి, జాన్సేన్ లను తట్టుకుని నిలవడం భారత ఆటగాళ్లకు  కఠిన సవాలే..

అంతేగాక ఈ పిచ్ మీద టీమిండియాకు రికార్డులు కూడా గొప్పగా ఏం లేవు. ఈ పిచ్ మీద గతంలో భారత జట్టు దక్షిణాఫ్రికాను 5 టెస్టులలో ఢీకొంది. ఇందులో  మూడు సార్లు ఓడిపోగా.. రెండుసార్లు డ్రా చేసుకుంది. ఇక 2014 నుంచి ఇక్కడ 7 టెస్టులాడిన సఫారీ జట్టు ఇక్కడ ఒక్కటే టెస్టు ఓడింది. 

1993లో ఇక్కడ తొలి టెస్టు ఆడిన భారత్.. మ్యాచును డ్రా చేసుకుంది. 1997, 2007 లలో సౌతాఫ్రికా గెలువగా.. 2011 లో  డ్రా అయింది. మళ్లీ 2018లో సఫారీలనే విజయం వరించింది.  

click me!