పాక్‌కి రాకున్నా పర్లేదు! కానీ చెప్పే విధానం ఇది కాదు... జై షాపై పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఫైర్...

First Published Oct 22, 2022, 12:25 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కి ముందు బీసీసీఐ సెక్రటరీ జై షా, పాక్ పర్యటన గురించి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి. వచ్చే ఏడాది ఆసియా కప్ 2023 కోసం పాకిస్తాన్‌లో అడుగుపెట్టబోమని, తటస్థ వేదికపై టోర్నీ నిర్వహిస్తామని కుండబద్ధలు కొట్టాడు జై షా...

బీసీసీఐ వార్షిక సమావేశంలో ఆసియా కప్ 2023 టోర్నీలో పాక్‌కి వెళ్లేందుకు బోర్డు పెద్దలు అంగీకరించారని, అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తేనే పొరుగుదేశంలో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఎదురుచూసే లోపు... పాకిస్తాన్‌లో అడుగుపెట్టేది లేదని తేల్చేశాడు బీసీసీఐ సెక్రటరీ జై షా...

స్వయంగా కేంద్ర మంత్రి అమిత్ షా కొడుకు ప్రకటించడంతో ఇదే ప్రభుత్వ నిర్ణయమని తేలిపోయింది. అదీకాకుండా జై షా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. దీంతో ఆసియా కప్ 2023 టోర్నీ పాక్ నుంచి తటస్థ వేదికకు మారడం ఖాయమైపోయింది...

Image credit: Wikimedia Commons & Getty

‘ఆసియా కప్ 2023 టోర్నీని పాక్ నుంచి తరలిస్తే, వన్డే వరల్డ్ కప్‌లో ఆడకూడదని పాక్ క్రికెట్ బోర్డు సరైన నిర్ణయమే తీసుకుంది. ఎందుకంటే పాక్‌లో క్రికెట్ ఆడాలా? వద్దా? అనేది ఇండియా డిసైడ్ చేయకూడదు. పాకిస్తాన్‌లో 10-15 ఏళ్లుగా క్రికెట్ జరగనే లేదు..

asia cup

నేను మాజీ క్రికెటర్‌ని, నాకు రాజకీయాల గురించి తెలీదు. ఇరుదేశాల మధ్య రాజకీయ సంబంధాలు ఎలా ఉన్నాయో కూడా తెలీదు. అయినా పాక్‌లో ఆడం అని చెప్పే హక్కు, స్వేచ్ఛ వారికి ఉంది. అయితే చెప్పే విధానం ఇది కాదు. మనిషికి మనిషికి మధ్య సంబంధాలు చాలా ముఖ్యం...

Image credit: Getty

పాక్‌లో పర్యటించడం ఇష్టం లేకపోతే పీసీబీ సభ్యులతో, ఏసీసీ సభ్యులతో కలిసి ఓ మీటింగ్ నిర్వహించి నిర్ణయం తీసుకోవాలి. మీరేం అనుకుంటున్నారే మాకు చెప్పాలి. అంతేకానీ పాకిస్తాన్‌లో ఆసియా కప్ జరగదు అని స్టేట్‌మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్...

వాస్తవానికి 2018 ఆసియా కప్ టోర్నీకి టీమిండియా ఆతిథ్యం ఇవ్వాల్సింది. అయితే ఇరుదేశాల మధ్య సంబంధాలు సరిగా లేకపోవడం వల్ల యూఏఈ వేదికగా టోర్నీని నిర్వహించాల్సి వచ్చింది. ఈసారి కూడా పాకిస్తాన్‌కి బదులుగా తటస్థ వేదికైన యూఏఈలోనే ఆసియా కప్ నిర్వహించాలని పట్టుబడుతోంది బీసీసీఐ...

అలాగే 2025లో పాకిస్తాన్‌లో జరగాల్సిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అక్కడి నుంచి తటస్థ వేదికకు మారే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనిపై ఐసీసీ తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది. పాక్‌లో నిర్వహించి తీరాల్సిందేనని ఐసీసీ పట్టుబడితే, టీమిండియా వెళ్తుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది..

click me!