2020 సీజన్లో దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సిన ఆస్ట్రేలియా జట్టు, కరోనా భయంతో ఆ టూర్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కారణంగానే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2019-21 పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కివీస్, నేరుగా ఫైనల్కి అర్హత సాధించింది...
సఫారీ టూర్ను ఆస్ట్రేలియా వాయిదా చేసుకోవడంతో ఇంగ్లాండ్, ఇండియా, ఆస్ట్రేలియా జట్లు రెండో ఫైనల్ బెర్త్ కోసం పోటీపడ్డాయి. స్వదేశంలో ఇంగ్లాండ్ను 3-1 తేడాతో ఓడించిన టీమిండియా... టేబుల్ టాపర్గా ఫైనల్ చేరిన విషయం తెలిసిందే...
2021 సీజన్లో ఆరంభంలో ఆస్ట్రేలియా, టూర్ను వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయం కారణంగా సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకి వందల కోట్ల నష్టం వాటిల్లింది. అప్పటికే సౌతాఫ్రికా ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్కి చాలా దూరంలో ఉండడం వల్ల పెద్ద దుమారమేమీ రేగలేదు...
ఆస్ట్రేలియాతో పోలిస్తే, భారత జట్టు పర్యటన కారణంగా సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకి దాదాపు రెట్టింపు ఆదాయం సమకూరనుంది. ఒకవేళ టీమిండియా ఒమిక్రాన్ వేరియెంట్ కారణంగా సఫారీ టూర్ని వాయిదా వేసుకుంటే, మళ్లీ సౌతాఫ్రికా బోర్డు భారీ నష్టం ఎదుర్కొక తప్పదు...
అందుకే ఏదిఏమైనా ఈ సిరీస్ను జరిపించి తీరాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు. అదీకాకుండా కొన్నాళ్లుగా వర్ణవివక్ష, జాతివివక్ష వివాదాలతో సతమతమవుతున్న సఫారీ క్రికెట్కి టీమిండియా సిరీస్ చాలా కీలకంగా మారింది...
ఇప్పటికే సౌతాఫ్రికాలో పర్యటించిన భారత్-A జట్టు, సౌతాఫ్రికా- A టీమ్తో కలిసి మూడు అనధికారిక టెస్టు మ్యాచులు ఆడుతోంది. ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ మ్యాచులు నిర్వహిస్తున్నారు...
ఇండియా, సౌతాఫ్రికా సిరీస్ను కూడా ఇలాగే నిర్వహిస్తామని, కట్టుదిట్టమైన బయో సెక్యూలర్ జోన్ ఏర్పాటు చేసి, భారత క్రికెట్ జట్టుకు పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇస్తోంది దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు..
‘ప్రస్తుతం భారత్-A, సౌతాఫ్రికా -A జట్ల కోసం ఓ పూర్తి స్థాయి బయో సెక్యూలర్ వాతావరణాన్ని నిర్మించాం. భారత జట్టుకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారి సంక్షేమం కోసం అన్ని ఏర్పాట్లు చేశాం... సౌతాఫ్రికా రావడానికి మిగిలిన దేశాలు బయపడుతున్న భారత్-A జట్టును ఇక్కడికి పంపింది టీమిండియా. అలాగే భారత జట్టుకి కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తాం...’ అంటూ తెలిపింది అంతర్జాతీయ సంబంధాల శాఖ, సౌతాఫ్రికా విదేశీ మంత్రిత్వ శాఖ...
డిసెంబర్ 9న సౌతాఫ్రికా బయలుదేరి వెళ్లే, భారత జట్టు... అక్కడ మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20 మ్యాచులు ఆడనుంది. ఆ తర్వాత స్వదేశానికి చేరకుని ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసే క్యాంపులో క్వారంటైన్ గడపనుందని సమాచారం...