Rohit Sharma: రోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్ ప‌క్కానా.? లార్డ్స్ వ‌న్డేనే చివ‌రిదా.? అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది

Published : Jul 18, 2026, 01:15 PM IST

Rohit Sharma: రోహిత్ శర్మ వన్డే రిటైర్మైంట్‌పై గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోన్న విష‌యం తెలిసిందే. ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌లో జరగనున్న మూడో వన్డే తర్వాత ఆయన క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతారనే వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా క్లారిటీ ఇచ్చారు

PREV
15
రోహిత్ రిటైర్మెంట్‌పై బీసీసీఐ స్పష్టమైన ప్రకటన

పిటిఐతో మాట్లాడిన బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు. లార్డ్స్‌లో జరిగే మూడో వన్డే తర్వాత రోహిత్ ఆటకు వీడ్కోలు పలుకుతారనే అంశంపై బీసీసీఐలో ఎలాంటి చర్చ జరగలేదని వెల్లడించారు. ప్రస్తుతం రోహిత్ భారత వన్డే జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడని, జట్టు ప్రణాళికల్లో ఉన్నంత కాలం భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడని చెప్పారు. అయితే 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆయన ఆడతారా లేదా అన్న విషయంపై మాత్రం ఎలాంటి హామీ ఇవ్వలేదు.

25
ఈ రిటైర్మెంట్ ప్రచారం ఎలా మొదలైంది?

ఇటీవల కొన్ని మీడియా కథనాల్లో భారత జట్టు యాజమాన్యం 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్‌ను దీర్ఘకాలిక ఓపెనర్‌గా తీర్చిదిద్దాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇంగ్లాండ్ పర్యటన తర్వాత రోహిత్ భవిష్యత్తు జట్టులో ఉండదని సెలక్షన్ కమిటీ ఆయనకు తెలిపినట్లు కూడా కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలతోనే రోహిత్ త్వరలో రిటైర్మెంట్ ప్రకటిస్తారనే ప్రచారం మరింత పెరిగింది.

35
అశ్విన్ విమర్శలు.. కమ్యూనికేషన్‌పై ప్రశ్నలు

రోహిత్‌పై వచ్చిన వార్తల తర్వాత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టు యాజమాన్యాన్ని విమర్శించారు. ఒకవేళ రోహిత్‌ను భవిష్యత్తు ప్రణాళికల్లో ఉంచకూడదని నిర్ణయించి ఉంటే, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాతే ఆ విషయం స్పష్టంగా చెప్పాల్సిందని అభిప్రాయపడ్డారు. 2027 ప్రపంచకప్ కోసం రోహిత్ ఫిట్‌నెస్‌పై కష్టపడుతున్న సమయంలో ఇలాంటి పరిస్థితి రావడం సరైంది కాదన్నారు. ఆటగాళ్లతో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే ఇలాంటి వివాదాలు వస్తున్నాయని, తన రిటైర్మెంట్ సమయంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైందని అశ్విన్ పరోక్షంగా వ్యాఖ్యానించారు.

45
ఫామ్‌పై సందేహాలు.. లార్డ్స్ మ్యాచ్ కీలకం

ఇటీవల రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోతున్నారు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో కూడా పెద్ద స్కోర్లు నమోదు చేయలేదు. మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా కూడా రోహిత్ బ్యాటింగ్‌లో మునుపటి స్పష్టత కనిపించలేదని అభిప్రాయపడ్డారు. లార్డ్స్ వన్డేలో కూడా రోహిత్ విఫలమైతే సెలక్టర్లు కఠిన నిర్ణయం తీసుకునే అవకాశముందని క్రీడా వర్గాలు చర్చిస్తున్నాయి.

55
రోహిత్ కెరీర్ ప‌రంగా చూస్తే..

రోహిత్ శర్మ ఇప్పటివరకు భారత జట్టు తరఫున 287 వన్డేలు ఆడి 11,757 పరుగులు చేశారు. ఆయన సగటు 48.58 కాగా, 33 సెంచరీలు నమోదు చేశారు. వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన రోహిత్, ప్రస్తుతం ఫామ్ లేమితో పోరాడుతున్నప్పటికీ బీసీసీఐ తాజా ప్రకటనతో ఆయన రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు తాత్కాలికంగా తెరపడింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి లార్డ్స్‌లో జరిగే మూడో వన్డేపైనే ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories